Gangula fire on Modi govt: వాజ్​పేయి హయంలో కొన్నారు... ఇప్పుడు కొనమంటే ఎలా?

author img

By

Published : Sep 14, 2021, 8:22 PM IST

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర వైఖరిని మంత్రి గంగుల తప్పుపట్టారు. మాజీ ప్రధాని వాజ్​పేయి హయంలో ధాన్యం నిల్వలు ఉన్న రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు చేశారని ఆయన గుర్తుచేశారు. అదే విధానాన్ని ఇప్పుడు మోదీ సర్కార్ కూడా పాటించాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ (MOU) కుదర్చుకొని పంట చేతికొచ్చే సమయానికి సాధ్యం కాదని చేతులు ఎత్తేయడం దారుణమని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు కాళేశ్వరం జలాలు ఉచిత కరెంట్​ ఇచ్చి ఆదుకొందామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Cm Kcr) యత్నిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎనలేని మోసం చేస్తోందని దుయ్యబట్టారు.

కరీంనగర్​లో మీడియా మాట్లాడిన మంత్రి.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయబోమని తేల్చి చెప్పిన కేంద్రం ఈసారి రారైస్ కొనుగోలులోనూ కోత విధించడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62లక్షల మెట్రిక్ టన్నుల రాబియ్యం ఉంటే కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తే మిగతా బియ్యాన్ని మేము ఏం చేసుకోవాలని ప్రశ్నించారు.

బియ్యం కొనుగోలు చేయాలని మేము భిక్షం అడగడం లేదన్న గంగుల... రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్‌ రాష్ట్రం నుంచి బియ్యం కొనుగోలు చేసి తెలంగాణా పట్ల వివక్ష చూపడమేంటని ప్రశ్నించారు. పంట వేసుకున్నాక బియ్యం కొనుగోలు చేయబోమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బియ్యం ఎగుమతి, నిల్వ, ధర స్థిరీకరణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలని... అలాంటి సందర్భంలో చేతులు ఎత్తేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

పంట మార్పిడి చేసుకోవాలన్నా కనీసం ఏడాది ముందైనా సమాచారం ఇవ్వాలని.. ఇప్పుడు చేతులెత్తేసిన కేంద్రంపై ఒత్తిడి తీసుకురావల్సిన బాధ్యత భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఉందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

మీ దగ్గర అంత పంట కొనలేమని కేంద్ర ప్రభుత్వం కొత్తగా మెలిక వేసింది. బియ్యం కొనుగోలు చేయమని మేం భిక్షం అడగట్లేదు. రైస్ మిల్లుల్లో ఉన్న బియ్యాన్ని కూడా కేంద్రం కొనట్లేదు. గోదాముల్లో నిల్వ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. 2001లో వాజ్​పేయి హయంలో మొత్తం పంట కొన్నారు. దాదాపు 7 కోట్ల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఆ రోజుల్లో వినియోగం అంతగా లేకున్నా... సామాజిక బాధ్యతగా కొన్నారు. ఇప్పుడేమో పంజాబ్​లో కొన్నారు. తెలంగాణలో కొనడం లేదు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదా?

--- గంగుల కమలాకర్, మంత్రి

బియ్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల ప్రెస్​మీట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.