కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి ఎదుట బాలింత మృతదేహంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యురాలి నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని ఆరోపించారు. ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. శంకరపట్నం మండలం కన్నాపూర్కు చెందిన రెడ్డి స్వప్న పురుటి నొప్పులతో ఆసుపత్రిలో సోమవారం చేరినట్లు ఆమె భర్త మహేందర్ తెలిపారు. కొన్ని గంటల వరకు చికిత్స చేయకుండా ఆలస్యం చేశారన్నారు.
సాయంత్రం నాలుగు గంటలకు సుఖ ప్రసవం చేయగా.. ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు. స్వప్నకు రక్తస్రావం ఆగకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హన్మకొండ తరలించాలని వైద్యులు సూచించారు. హన్మకొండలోని ఆసుపత్రికి తరలించగానే మృతి చెందిందని ఆయన పేర్కొన్నారు.
వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి చెందిందని మహేందర్ వాపోయారు. సమాచారం అందుకున్న సీఐ వాసంశెట్టి మాధవి, ఎస్సై చీనా నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. ఘటనపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని సీఐ స్పష్టం చేశారు. వైద్య సేవలు అందించే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యుడు రమేశ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: హైదరాబాద్కు మరో అంతర్జాతీయ సంస్థ