కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలో భవన అనుమతులు, ఇంటి నంబర్ల కేటాయింపు, పేరు మార్పిడి వంటివి అన్ని ఆన్లైన్ ద్వారానే పనులు చేపడుతున్నారు. ఇళ్లకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పొందుపర్చి ఉండటంతో దాని ఆధారంగా ఆస్తిపన్ను చెల్లించడానికి వీలుంటుంది. అయితే గతేడాది ఏప్రిల్లో 5 శాతం రాయితీతో పనులు చెల్లించడానికి వస్తే ఇబ్బందులు తప్పడం లేదు.
భాగ్యనగర్కు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి తన ఇంటికి సంబంధించిన ఆస్తి పన్నును గతేడాది 5 శాతం రాయితీతో చెల్లించారు. అదే మాదిరిగా ఈ ఏడాది పురపాలక శాఖ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి నగరపాలికకు వెళ్తే ఆస్తిపన్ను చూపడం లేదు. ఆన్లైన్లో ఆస్తిపన్ను జనరేట్ కాలేదని పేర్కొంటూ ఇంటి పన్ను తీసుకోవడానికి నిరాకరించారు.
శ్రీనగర్కాలనీకి చెందిన ఓ ఇంటి యజమాని 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను 5 శాతం రాయితీతో తేదీ.23.4.2019లో పన్ను చెల్లించారు. అదే తరహాలో ఈ ఏడాది చెల్లించడానికి వెళ్తే ఆ ఇంటిపై ఆస్తిపన్ను చూపడం లేదు. కొద్ది రోజులైతే రాయితీ గడువు ముగుస్తుండగా సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారో తెలియకుండా మారిందంటున్నారు.
కనిపించని వివరాలు
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆస్తి పన్నులు వసూలు చేస్తుండగా వీటిని ఎప్పటికప్పుడూ రికార్డులో నమోదు చేయాలి. ముందస్తుగా ఆస్తిపన్నులు చెల్లించిన వారి కొన్ని ఇళ్లకు సంబంధించిన వివరాల నమోదు కాకపోవడంతో పన్నుల వివరాలు చూపడం లేదు. ప్రసుత్తం పురపాలక శాఖ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నులు చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. గతంలో ముందస్తుగా పన్నులు చెల్లించిన వారంతా పన్నులు చెల్లించడానికి వస్తున్నారు. తీరా ఆస్తిపన్ను చూపకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. దీంతో బిల్కలెక్టర్లు సైతం నిరాకరిస్తున్నారు. ఆన్లైన్లో బిల్లు రాకపోవడంతో తాము చేసేదేమి లేదంటున్నారు.
ఫిర్యాదులు పరిష్కరిస్తున్నాం
ఆస్తిపన్ను జనరేట్ కావడం లేదనే ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరిస్తున్నాం. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు సీడీఎంఏ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడి నుంచి జనరేట్ అయ్యాలా చర్యలు తీసుకుంటున్నాం.
- వల్లూరు క్రాంతి, కమిషనర్, కరీంనగర్ నగరపాలిక