ధాన్యం కుప్పపైనే ప్రాణాలొదిలిన రైతు.. కొనుగోలులో జాప్యమే కారణమా..?

author img

By

Published : Nov 5, 2021, 3:18 PM IST

Updated : Nov 5, 2021, 4:09 PM IST

farmer-died-at-ikp-center-in-lingampet

ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు వచ్చిన రైతు.. అదే ధాన్యం కుప్పపై ప్రాణాలొదిలిన విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేటలో జరిగింది. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి.. వారం రోజులుగా రాత్రిపగలు కాపలాగా ఉంటున్న ఆ రైతు.. అదే ధాన్యం కుప్పపై తుదిశ్వాస వదలటం అందరినీ కలచివేసింది.

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఓ రైతు మృతికి కారణమైంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు బీరయ్య(57) గుండె పోటుతో మృతి చెందాడు. తన ధాన్యం కుప్ప వద్ద కాపలా కోసం వచ్చిన రైతు బీరయ్య రాత్రి అక్కడే నిద్రించాడు. అర్ధరాత్రి మూత్ర విసర్జన కోసం లేచిన సమయంలో.. ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. ధాన్యం కుప్పపైనే పడిపోయిన రైతు.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

వారం రోజులుగా..

తెల్లవారుజామున తోటి రైతులు గమనించగా.. బీరయ్య చనిపోయి ఉన్నాడు. పండించిన ధాన్యం కుప్పపైనే ప్రాణాలు వదిలిన బీరయ్యను చూసి.. రైతులంతా భావోద్వేగానికి లోనయ్యారు. బీరయ్యకు ఒక ఎకరం సొంత పొలం ఉండగా.. మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. ఇటీవల కోతలు పూర్తి చేసి గత నెల 27న లింగంపేట కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. అదే రోజున అక్కడున్న సిబ్బంది సీరియల్ నంబర్ రాసుకోగా.. 70వ నంబర్ వచ్చింది. అప్పటి నుంచి తన నంబర్​ ఎప్పుడు వస్తుందోనని.. బీరయ్య రోజూ వేచిచూస్తున్నాడు. ధాన్యం కుప్ప వద్దే పగలు రాత్రి కాపలా ఉన్నాడు. నిన్న రాత్రి అనుకోకుండా.. గుండెపోటుతో ధాన్యం కుప్పపైనే కుప్పకూలి ప్రాణాలొదిలాడు.

20రోజులకు పైగా..

వారం రోజుల కింద లింగంపేట కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే.. నిన్న, ఈరోజు దీపావళి కారణంగా.. అంతకుముందు వర్షం వల్ల కాంటా వెయ్యలేదు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చినప్పటి నుంచి.. రాత్రి, పగలూ కాపలా ఉండాల్సి వస్తోంది. రాత్రిపూట సైతం రైతులు అక్కడే చలిలో నిద్రిస్తున్నారు. ధాన్యం తూకం వేసేందుకు ఒక్కో రైతు 20 రోజులకు పైగా ఎదురుచూడాల్సి వస్తోంది.

అన్ని చోట్లా కాలాయాపనే..

లింగంపేట కేంద్రానికి మొత్తం 207మంది ధాన్యం తీసుకురాగా.. వారం నుంచి కేవలం 23 మందివి మాత్రమే తూకం వేశారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటం, మూడు రోజులు కాంటా వేయకపోవటం వల్ల మానసిక ఆందోళనతోనే బీరయ్య చనిపోయి ఉంటాడని తోటి రైతులు భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 343 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అన్ని చోట్లా కాలయాపనే జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

Last Updated :Nov 5, 2021, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.