జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ 5వ శక్తి పీఠం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో బాల బ్రహ్మేశ్వర స్వామి, పాతాళ ఈశ్వరునికి 100 బిందెల తుంగభద్ర జలాలతో రైతులు అభిషేకం చేశారు. జులై మాసంలో వాన పడడంతో రైతులు మొక్కజొన్న, పత్తి, మిరప, ఉల్లి, తదితర పంటలను వేశారు. పంటలు వేసి 40 రోజులు గడుస్తున్నా వర్షం రాక పంటలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి.
అలంపూర్ రైతు సంఘం ఆధ్వర్యంలో కోటిలింగాలకు నిలయమైన దక్షిణ కాశీ బాల బ్రహ్మేశ్వర స్వామి క్షేత్రంలో బాల బ్రహ్మేశ్వరునికి, పాతాళ ఈశ్వరునికి తుంగభద్ర నదీ జలాలతో అభిషేకం నిర్వహించారు. ముందుగా రైతులందరూ 100 బిందెలతో తుంగభద్ర నది చేరుకొని పూజలు చేశారు. అక్కడి నుంచి బిందెలతో పాతాళ ఈశ్వరుడు, బాలబ్రహ్మేశ్వర స్వామికి భక్తిశ్రద్ధలతో అభిషేకం చేశారు.
గతంలో కూడా వర్షాలు రాకపోతే ఈ విధంగా స్వామివారికి అభిషేకం చేయడంతో వర్షాలు పడ్డాయని రైతులు తెలిపారు. అలంపూర్తో పాటు మానవపాడు మండల కేంద్రంలో కూడా మానవపాడు రైతు సంఘం ఆధ్వర్యంలో కృష్ణ తుంగభద్ర నదీ జలాలతో శివునికి అభిషేకం చేశారు.
ఇదీ చదవండి: రాయలసీమ ఎత్తిపోతలపై.. ఏపీ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోంది: ఎన్జీటీ