ETV Bharat / state

లాభాలొచ్చే గనులపై దృష్టి సారించిన సింగరేణి

author img

By

Published : Jul 2, 2020, 11:21 AM IST

సింగరేణి పరిచయం అక్కర్లేని సంస్థ. తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అయ్యే గనుల వైపు మొగ్గు చూపుతోంది. లాభాలు వచ్చే బ్లాక్‌లపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో ఒడిశా దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే నైనీ, న్యూపాత్రపాద గనులను సొంతం చేసుకొంది. ఇవేగాక మరికొన్నింటిని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది.

singareni concentrate on profits
లాభాలొచ్చే గనులపై దృష్టి సారించిన సింగరేణి

సింగరేణికి 2014లో ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది సంస్థకు లాభసాటిగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో బొగ్గు బయటకు తీయడానికి అనుకూల పరిస్థితులున్నాయి. 2020లో ఉత్పత్తి చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. గతేడాది నుంచి అన్వేషణ పనులు చేపట్టిన సింగరేణి ఈ ఏడాదిలో పూర్తి స్థాయిలో నివేదికలను తయారు చేసింది. ఒకవైపు అనుమతుల కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు భూసేకరణ చేస్తోంది.

తక్కువ ఖర్చుతో ఉత్పత్తి

ప్రస్తుతం సింగరేణిలో ఉన్న గనులన్నీ లోతైన ప్రాంతంలో ఉన్నాయి. 6 నుంచి 10క్యూబిక్‌ మీటర్ల మట్టిని తొలగిస్తేనే టన్ను బొగ్గును వెలికితీసే అవకాశం ఉంది. నైనీలో మాత్రం అతి తక్కువ లోతుల్లో నిక్షేపాలు గుర్తించారు. పైపొరల్లోనే బొగ్గు ఉన్నట్లు ప్రాథమిక అన్వేషణలో తేలింది. 2 నుంచి 3 క్యూబీక్‌ మీటర్ల మట్టిని మాత్రమే తీయాల్సి ఉంటుంది. దీంతో మట్టి తొలగించే ఖర్చు భారీగా తగ్గుతుంది. టన్ను బొగ్గు ఉత్పత్తికి ఇక్కడైతే రూ.2400 ఖర్చు అవుతుంది. అదే అక్కడైతే రూ.800 అవుతుందని అంచనా వేస్తోంది. అదేవిధంగా నాణ్యమైన ఖనిజం లభించే అవకాశం ఉండటంతో అక్కడి నైనీ ఉపరితలగని లాభసాటిగా ఉంటుందని సంస్థ భావిస్తోంది.

ఏటా 10మిలియన్లు..

నైనీ బ్లాక్‌ ఎక్కువగా అటవీ ప్రాంతంలోనే ఉంది. 650 హెక్టార్లలో విస్తరించి ఉంది. 490 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు గుర్తించారు. త్వరలోనే భూ సేకరణ పనులు పూర్తి చేయనున్నారు. పర్యావరణ అనుమతులు రాగానే మట్టి వెలికితీత చేపడతారు. ఏడాదిలోనే ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ఏటా 10మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికి తీసేందుకు ప్రణాళికలు చేసుకుంటున్న సింగరేణి సుమారుగా 49ఏళ్ల పాటు ఇక్కడ తమ కార్యకలాపాలను సాగిస్తుంది.

రెట్టింపు లాభాలు

ప్రస్తుతం ఉపరితల గనుల్లో సాధిస్తున్న లాభాల కంటే రెట్టింపు స్థాయిలో నైనీ, న్యూపాత్రపాద బొగ్గు బ్లాక్‌లో ఆర్జించే అవకాశం ఉంది. మట్టి తొలగింపు భారం తక్కువగా ఉండటంతో ఖర్చు తక్కువగా ఉంటుంది. బొగ్గు పొరలు పైపైనే ఉండే అవకాశం ఉండటంతో వెలికి తీయడానికి కూడా ఇబ్బంది ఉండదు. అందుకే సింగరేణి ఒడిశా వైపు అడుగులు వేస్తోంది.

మరిన్ని గనుల కోసం..

ఇప్పటికే నైనీ, న్యూపాత్రపాదను దక్కించుకుంది. ఇవేగాక ఆ ప్రాంతంలోని మహానది, జామ్‌కని, మచ్చాఖట, బిజాహాన్‌, రాధికాపూర్‌ బ్లాక్‌లను కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వేలం ద్వారా బ్లాక్‌లను ఇవ్వాలని నిర్ణయించింది. అవసరమైతే అందులో పాల్గొని దక్కించుకోవాలని భావిస్తుంది సింగరేణి.

ఇవీ చూడండి: సమ్మె సైరన్.. సింగరేణిలో మూడురోజుల నిరసనలు షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.