కోల్‌ ఇండియా కన్నా సింగరేణి కార్మికులకు ఎక్కువగా ఇస్తున్నాం: ఎమ్మెల్సీ కవిత

author img

By

Published : Jan 22, 2023, 4:06 PM IST

MLC KAVITHA

సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్‌ ప్రకటిస్తే.. కొంతమంది కోర్టులకెళ్లి అడ్డుకున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కోల్‌ ఇండియా కన్నా సింగరేణిలో వేతనాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో ఉన్న బొగ్గుగని కార్మికులను సింగరేణి కార్మికులు ఏకం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి సత్యవతి రాఠోడ్​తో కలిసి ఆమె భూపాలపల్లిలో పర్యటించారు.

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో మంత్రి సత్యవతి రాఠోడ్‌, ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా భూపాలపల్లిలో బీఆర్​ఎస్, తెలంగాణ జాగృతి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించగా.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూధనాచారి పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం స్థానికంగా నూతనంగా నిర్మించిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం భవనాన్ని నేతలు ప్రారంభించారు. ఈ క్రమంలో మంత్రి సత్యవతి, ఎమ్మెల్సీ కవితల సమక్షంలోనే వర్గ విభేదాలు బయటపడ్డాయి. నూతన భవనం శిలాఫలకంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేరు లేదని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మధుసూదనాచారి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వర్గాల మధ్య కాసేపు తోపులాట జరిగింది. చివరకు పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు.

దేశంలో ఉన్న బొగ్గుగని కార్మికులను సింగరేణి కార్మికులు ఏకం చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికులకు వస్తున్న సౌకర్యాలు దేశంలోని కార్మికులకూ రావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు విజన్ 20-20లో సింగరేణి ప్రైవేటీకరణకు ఆజ్యం పోశారన్న ఆమె.. సీఎం కేసీఆర్​ డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామంటే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఆరోపించారు. సింగరేణి కార్మికులను కాపాడుకుంటామన్న ఎమ్మెల్సీ కవిత.. కోల్‌ ఇండియా కన్నా సింగరేణి కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు.

ఇక్కడ ఉద్యోగుల పొట్టకొట్టే పనులు చేస్తున్నారు. సింగరేణి కార్మికులను మేము కాపాడుకుంటాం. చంద్రబాబు విజన్ 20-20లో సింగరేణి ప్రైవేటీకరణకు ఆజ్యం పోశారు. డిపెండెంట్‌ ఉద్యోగాలు కేసీఆర్‌ ఇస్తామంటే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. కోల్‌ ఇండియా కన్నా సింగరేణి కార్మికులకు ఎక్కువ ఇస్తున్నాం. సింగరేణి కార్మికులకు వస్తున్న సౌకర్యాలు దేశంలోని కార్మికులకు రావాలి. దేశంలోని ఉన్న బొగ్గుగని కార్మికులను సింగరేణి కార్మికులు ఏకం చేయాలి.-ఎమ్మెల్సీ కవిత

అంతకుముందు ములుగు జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత రామప్ప దేవాలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రామప్ప డెవలప్​మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. అథారిటీ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. మంత్రి సత్యవతి రాఠోడ్‌తో కలిసి ములుగులోని గట్టమ్మ దేవాలయం, రామప్ప ఆలయాన్ని కవిత దర్శించుకున్నారు. రుద్రేశ్వర స్వామి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజనుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ములుగును జిల్లాగా ఏర్పాటు చేయడమే కాకుండా.. వైద్య కళాశాల సైతం మంజూరు చేశారని కవిత గుర్తు చేశారు.

యునెస్కో గుర్తింపు పొందిన ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉంది. ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం. అయినా కేంద్రం స్పందించడం లేదు. భవిష్యత్‌లో రామప్పను బీఆర్​ఎస్​ ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుంది. - ఎమ్మెల్సీ కవిత

కోల్‌ ఇండియా కన్నా సింగరేణి కార్మికులకు ఎక్కువగా ఇస్తున్నాం: ఎమ్మెల్సీ కవిత

ఇవీ చూడండి..

ఫలించిన కేసీఆర్‌ కృషి.. ప్రాంతీయ భాషల్లోనూ ఎస్ఎస్​సీ పరీక్షలు

భర్త రెండో పెళ్లి.. పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య.. తల్లి శవం వద్ద ఏడుస్తూ కూర్చున్న కుమారుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.