kaleshwaram Lakshmi Pump House : కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల పథకం సిద్ధమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మండలంలోని లక్ష్మీ పంపుహౌస్లో ఆదివారం రెండు పంపులను నడిపించి నీటిని ఎత్తిపోశారు. దీంతో దిగువ నుంచి ఎగువ వరకు ఈ పథకం అందుబాటులోకి వచ్చినట్లు అయింది. గోదావరికి వచ్చిన భారీ వరదతో జులై 14న ఈ పంపుహౌస్ మునిగిపోయిన విషయం తెలిసిందే. పంపుహౌస్ రక్షణ గోడ కూలి వరద చేరడంతో పంపులు, మోటార్లు మునిగి దెబ్బతిన్నాయి. తొలుత రక్షణ గోడను పునరుద్ధరించిన అధికారులు.. అనంతరం నీటిని తోడివేసి 20 రోజుల క్రితమే మరమ్మతులు పూర్తి చేశారు.
శనివారం 1, 2 పంపులను సిద్ధం చేసి ప్రయోగాత్మకంగా నడిపించారు. ఆదివారం పూర్తిస్థాయిలో నడిపించి నీటిని ఎత్తిపోశారు. ఈ నీరు గ్రావిటీ కాలువ ద్వారా అన్నారం బ్యారేజీకి చేరింది. ఈ పంపుహౌస్లో మొత్తం 17 మోటార్లు ఉన్నాయి. ఒక్కో పంపు సామర్థ్యం 2,200 క్యూసెక్కులు. వీటిలో ఎనిమిదింటిని సిద్ధం చేశారు. ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎస్ఈ కరుణాకర్, ఈఈ తిరుపతిరావు, డీఈ సూర్యప్రకాశ్, మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిపుణులు, సిబ్బంది పంపుల పునరుద్ధరణలో పాలుపంచుకున్నారు.
లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీకి ఎగువన ఉన్న సరస్వతి (అన్నారం) బ్యారేజీ సమీపంలోని సరస్వతి పంపుహౌస్ సైతం మునిగిపోయిన విషయం తెలిసిందే. ఇక్కడ ఉన్న 12 పంపుల్లో ఇప్పటికే నాలుగింటిని సిద్ధం చేసి నీటిని ఎత్తిపోశారు. లక్ష్మీ, సరస్వతి పంపుహౌస్లు సిద్ధమవ్వడంతో ఇక మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల్లోని పైస్థాయి వరకు నీటిని తరలించుకునే వెసులుబాటు కలిగిందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది యాసంగి పంటల అవసరాలకు దాదాపు 25 టీఎంసీల వరకు తరలించే అవకాశం ఉందని కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు. యాసంగి పంటలకు సంబంధించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద రెండో దశ ఆయకట్టుకు పంట చివరి దశలో సాగునీరు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. సూర్యాపేట తదితర జిల్లాల్లో చివరి ఆయకట్టుకూ పంట ఆఖరిదశలో సాగునీటి ఇబ్బందులు తొలగిపోయినట్లేనని పేర్కొన్నారు.
ఇవీ చూడండి..