ETV Bharat / state

సిద్ధమైన రైతువేదికలు... రేపు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం

author img

By

Published : Oct 30, 2020, 8:00 PM IST

సిద్ధమైన రైతువేదికలు... రేపు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం
సిద్ధమైన రైతువేదికలు... రేపు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం

రైతులంతా ఒక్క చోట చేరి పంటల బాగోగులు, మార్కెట్ ధరలు సహా సంబంధిత అంశాలపై చర్చించుకునేందుకు రైతు వేదికలు సిద్ధమయ్యాయి. ఐదు వేల ఎకరాలకు ఒకటి చొప్పున వ్యవసాయ క్లస్టర్ల వారీగా వేదికల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఉపాధిహామీ నిధులతో పాటు వ్యవసాయశాఖ నిధులు కలిపి మొత్తం రూ.572 కోట్లతో రైతు వేదికల నిర్మాణం జరుగుతోంది. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ప్రారంభించనున్నారు.

వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. రైతులు పండించిన పంటలకు మంచి ధరే లక్ష్యంగా వివిధ చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లోని నేలల స్వభావం, అవసరాల ఆధారంగా క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ విస్తరణ సేవలను ప్రోత్సహించే ఉద్దేశంతో వ్యవసాయ విస్తరణాధికారులను నియమించింది.

5వేల ఎకరాలకొకటి..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంటపొలాలను ఐదువేల ఎకరాలకు ఒకటి చొప్పున 2,601 క్లస్టర్లుగా విభజించింది. ఆయా క్లస్టర్లలోని రైతులందరూ ఒకే చోట చేరి చర్చించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతువేదికల నిర్మాణాన్ని చేపట్టింది. సంబంధిత క్లస్టర్ పరిధిలోని రైతులందరూ పంటలకు సంబంధించిన బాగోగులు, మార్కెట్ పరిణామాలు, ధరలపై చర్చించుకోవాలన్నది రైతు వేదికల ఉద్దేశం.

రూ.571 కోట్ల ఖర్చు...

రాష్ట్ర వ్యాప్తంగా 2,601 క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణం జరుగుతోంది. ఇందుకోసం మొత్తం రూ.571 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఒక్కో రైతు వేదిక నిర్మాణం కోసం రూ.22 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అందులో 12 లక్షలు వ్యవసాయశాఖ నుంచి, మిగతా పది లక్షలు జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి వినియోగిస్తున్నారు. మొత్తం 2,601 రైతువేదికల్లో గ్రామీణ ప్రాంతాల్లోనివి 2,462 కాగా... పట్టణప్రాంతాల్లోనివి 139.

139 రైతువేదికలకు భూములు దానం...

సొంత భూమి, నిధులతో రైతువేదికల నిర్మాణం కోసం రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, ప్రవాసులు కొందరు ముందుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో 22, పట్టణ ప్రాంతాల్లో రెండు రైతువేదికల నిర్మాణ పూర్తి వ్యయాన్ని దాతలే భరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 139 రైతువేదికల నిర్మాణం కోసం ఉచితంగా భూములు ఇచ్చారు. అందులో గ్రామీణ ప్రాంతాల్లో 137 కాగా... పట్టణ ప్రాంతాల్లో రెండు ఉన్నాయి. మిగతా చోట్ల ప్రభుత్వ స్థలాల్లో రైతువేదికల నిర్మాణం జరుగుతోంది. రైతువేదికలను అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. రైతులు కూర్చొని మాట్లాడుకోవడంతో పాటు ఏఈఓకు గదిని కూడా నిర్మిస్తున్నారు.

పూర్తైన 1,951 రైతు వేదికల నిర్మాణం...

రైతులకు వ్యవసాయ, ఉద్యానవన అధికారులు అవగాహన కల్పించేందుకు రైతువేదికలను వినియోగించనున్నారు. అటు ప్రతి రైతువేదికలోనూ దృశ్యమాధ్యమ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆన్​లైన్ విధానంలో ముఖ్యమంత్రి నేరుగా ఆయా క్లస్టర్లలోని రైతులతో మాట్లాడేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,951 రైతు వేదికల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 650 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. రైతువేదికలు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.

జనగామ జిల్లా కొడకండ్లలో నిర్మించిన రైతువేదికను ముఖ్యమంత్రి కేసీఆర్... రేపు మధ్యాహ్నం లాంఛనంగా ప్రారంభిస్తారు. రైతువేదికల నిర్మాణ ఉద్దేశం, ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలను సీఎం రేపు వివరించనున్నారు. ఆ తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని మిగతా రైతువేదికలు కూడా ప్రారంభం కానున్నాయి.

ఇదీ చూడండి: నిమ్మ పంటకు ధరల తెగులు సోకింది... రైతుకు ఆర్థిక కష్టాల్ని మిగుల్చుతోంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.