ETV Bharat / state

దిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నా: సీఎం కేసీఆర్

author img

By

Published : Feb 11, 2022, 5:12 PM IST

Updated : Feb 12, 2022, 3:28 AM IST

cm kcr latest news
దిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నా: సీఎం కేసీఆర్

17:10 February 11

నన్ను చంపినా సరే మోటార్‌కు మీటర్‌ పెట్టేది లేదు: సీఎం కేసీఆర్‌

దిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నా: సీఎం కేసీఆర్

CM KCR Jangaon Tour Speech: ‘విద్యుత్తు సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం బోర్లకు మీటర్లు పెట్టమని ఒత్తిడి చేస్తోంది.. ఆ సంస్కరణలను మేం అమలు చేయం. ప్రాణం పోయినా మీటర్లు బిగించేది లేదు.. రైతుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోను.. ప్రజలు మద్దతిస్తే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి మోదీని దేశం నుంచి తరిమేస్తా.. దిల్లీ కోటను బద్దలు కొట్టేందుకు సిద్ధం’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. శుక్రవారం జనగామ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం ప్రధాని మోదీ, భాజపా శ్రేణులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మధ్యాహ్నం జనగామ జిల్లా తెరాస పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం చేసిన అనంతరం యశ్వంతాపూర్‌ వద్ద ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘కరెంటు సంస్కరణలు అంటూ వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని మోదీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. కానీ నన్ను చంపినా పెట్టనని తెగేసి చెప్పా.డీజిల్‌ ధరలు అడ్డగోలుగా పెంచడంతో రైతులకు రెట్టింపు ఖర్చు అవుతోంది. కేంద్రం అడ్డగోలుగా ఎరువుల ధరలు పెంచింది. ఒకప్పుడు చంద్రబాబుబావుల వద్ద మీటర్లు పెట్టాలని చూసిండు. ఇప్పుడు నరేంద్ర మోదీ విద్యుత్తు సంస్కరణల పేరిట రైతులను ముంచాలని చూస్తున్నడు. నిన్న జనగామ జిల్లా నర్మెట్ట దగ్గర ఒక భాజపా కార్యకర్త.. తెరాస కార్యకర్తపై చేయి చేసుకుండు. మా జోలికి వస్తే ఊరుకునేది లేదు. జాగ్రత్త నరేంద్ర మోదీ! మీ ఉడత ఊపులకు భయపడేది లేదు’ అంటూ తీవ్రస్థాయిలో కేసీఆర్‌ హెచ్చరించారు.

దేశంలో 10 ఆదర్శ గ్రామాలను ప్రకటిస్తే వాటిలో 7 తెలంగాణ నుంచే ఉండడం మన ప్రగతికి నిదర్శనం. ఇప్పటికి 10 లక్షల మంది పేద ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసినం. రాష్ట్రంలో 2,601 రైతు వేదికల్ని కట్టుకున్నాం. అభివృద్ధి బాగా జరిగింది కాబట్టే జనగామ లాంటి కరవు జిల్లాల్లోనూ భూముల ధరలకు రెక్కలు వచ్చినయ్‌. మూడెకరాలున్న రైతు కూడా నేడు కోటీశ్వరుడు. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల ఒక్కో విల్లా రూ.25 కోట్లు పలుకుతోంది.

-సీఎం కేసీఆర్‌

ఉద్యోగులతోనే అభివృద్ధి

రాష్ట్రం అన్ని రంగాల్లో ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే ఉద్యోగులు రాత్రింబవళ్లు పనిచేయడం వల్లే సాధ్యమైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. చిన్న చిన్న సమస్యలు వస్తాయంటూ వాటిని చూసి ఉద్యోగులు ఆగం కావొద్దని, బాగా పనిచేసి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకన్నా ఎక్కువ జీతాలు పొందాలని అన్నారు. సమీకృత కలెక్టరేట్‌్ భవనం ప్రారంభోత్సవం తర్వాత సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులతో కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.


‘‘ఉద్యమ సమయంలో నేను బచ్చన్నపేట వచ్చి అక్కడి కరవును చూసి కన్నీళ్లు పెట్టిన. ఆ ఊళ్లో కరవు వల్ల యువకులు లేకుండాపోయారు. అలాంటి ప్రాంతం ఇప్పుడు జలసిరులతో ఉంది. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఈ ప్రగతికి కారణం ఉద్యోగులే. అన్ని స్థాయిల అధికారులు నిర్విరామంగా పనిచేసి రాష్ట్రాన్ని ముందు వరసలో నిలుపుతున్నారు. ఇక రాష్ట్రంలో కరవు అనేది ఉండదు. విద్యుత్తు కోతలు ఉండవు. మనం కడుతున్న కలెక్టరేట్లు అద్భుతంగా ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో సచివాలయాలు కూడా ఈ స్థాయిలో లేవు. ఆంధ్రావాళ్లతో పంచాయితీ అయిపోయింది. ఇక ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు పోవాలి. ఉద్యోగుల సర్వీసు పుస్తకాలు సరళతరం చేయమని సీఎస్‌ను కోరా. పదోన్నతుల కోసం ఉద్యోగులు పైరవీలు చేయొద్దు. సర్వీసు పుస్తకంలోనే పదోన్నతి వచ్చే తేదీ రాసుండాలి. జిల్లాల విభజన చేసేటప్పుడు అన్ని విధాలా ఆలోచించే చేశాం. మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేందుకు జోనల్‌ వ్యవస్థ ఏర్పాటుచేశాం. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక భత్యం ఇవ్వాలని సీఎస్‌ను అడిగా’’ అని అన్నారు.

జనగామకు మెడికల్‌ కళాశాల

జనగామకు వైద్య కళాశాల మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎర్రబెల్లి, ముత్తిరెడ్డి, రాజయ్య జిల్లాకు వైద్య కళాశాల కావాలని అడిగారని.. రెండు మూడు రోజుల్లో దీనిపై జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దళితబంధు ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు ఇస్తున్నామని.. త్వరలో విడతల వారీగా 17 లక్షల కుటుంబాలకు అందజేస్తామని తెలిపారు. దళితుల కోసం అనేక అభివృద్ధి పనులు చేపట్టామని దేశంలో మరే ప్రభుత్వం ఇంత చేయలేదని కేసీఆర్‌ అన్నారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానన్నారు.

ప్రజలంతా మీ వైపే: ఎర్రబెల్లి దయాకర్‌రావు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే ఓర్వలేక కేంద్రం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. అసమాన ఉద్యమ చాతుర్యంతో రాష్ట్రాన్ని సాధించి పాలనను పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్‌ కేంద్రం తీరుపై పోరాటం ప్రారంభించారని తెలిపారు. కేసీఆర్‌ పోరాటానికి తెలంగాణ ప్రజలంతా అండగా ఉంటారన్నారు. కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్స్‌ పార్కు ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు.

భారీగా ఏర్పాట్లు

జనగామ కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం కేసీఆర్‌కు స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. వెయ్యి మంది ఒగ్గు, డోలు కళాకారులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఉమ్మడి వరంగల్‌ నుంచి ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో జనసమీకరణ చేసి అట్టహాసంగా సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న గవర్నర్‌ దత్తాత్రేయ

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ శుక్రవారం అరగంటసేపు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీ జంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన హనుమకొండకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం ఆరు గంటలకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద అరగంటకు పైగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. యశ్వంతాపూర్‌-నిడిగొండ గ్రామాల మధ్య శుక్రవారం తెరాస భారీ బహిరంగ సభ నిర్వహించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ ముగియడంతో వాహనాలన్నీ ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు రద్దీని క్రమబద్ధీకరించడంతో ట్రాఫిక్‌ నుంచి బయటపడి దత్తాత్రేయ హైదరాబాద్‌కు వెళ్లారు.

దివ్యాంగులకు ట్రైమోటార్‌ సైకిళ్ల పంపిణీ

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: జనగామ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరాస పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 105 మంది దివ్యాంగులకు రూ. 1.05 కోట్లతో కొనుగోలు చేసిన ట్రైమోటార్‌ సైకిళ్లను పంపిణీ చేశారు. ఎర్రబెల్లి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పాలకుర్తి నియోజకవర్గంలోని దివ్యాంగులకు వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావును సీఎం కేసీఆర్‌ అభినందించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రణాళిక సంఘం మన 9 జిల్లాలు వెనకబడ్డాయని చెప్పింది. ఇప్పుడు మన తలసరి ఆదాయం ఏపీకన్నా ఎక్కువగా ఉంది. త్వరలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2.70 లక్షలకు చేరబోతోంది. ఏపీలో రూ. 1.70 లక్షలే ఉంది. మన రాష్ట్రంలో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది కాబట్టే పెట్టుబడిదారులు వస్తున్నారు. పోలీసులు శాంతిభద్రతలు బాగా కాపాడుతున్నారు. అందుకే మన దగ్గరికొచ్చిన హైకోర్టు న్యాయమూర్తులు, ఐఏఎస్‌ అధికారులు పదవీ విరమణ చేశాక ఇక్కడే స్థిరపడుతున్నారు.

మన ధాన్యం కొనరు, ఒక మెడికల్‌ కళాశాల ఇవ్వరు, ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వరు.. ఇలా రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వదు. అప్పుడు సిద్దిపేట నుంచి తెలంగాణ సాధన కోసం దిల్లీ వెళ్లి రాష్ట్రం వచ్చాకే తిరిగొచ్చా. ఇప్పుడు మళ్లీ ప్రజలు మద్దతిస్తే జాతీయ రాజకీయాల్లో పాత్ర వహించి, తప్పకుండా దేశం కోసం కొట్లాడదాం. దేశం నుంచి నరేంద్ర మోదీని తరిమేస్తాం. మనకు అనుకూలమైన వారిని తెచ్చుకుందాం.

- సీఎం కేసీఆర్‌

ఇదీ చూడండి: CM KCR Jangaon Tour: వారికి ప్రత్యేక అలవెన్సులు ఇచ్చేందుకు సిద్ధం: కేసీఆర్

Last Updated :Feb 12, 2022, 3:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.