Varshakonda zphs school: ఆదర్శంగా నిలుస్తున్న జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల

author img

By

Published : Nov 24, 2021, 5:38 PM IST

Varshakonda zphs school, ideal school in jagtial

Government School ideal story: ప్రభుత్వం పాఠశాలలు అంటే ఇంకా చిన్నచూపే.. సర్కారీ దవాఖానాలు అన్నా అదే తీరు. అన్ని వనరులు ఉన్నా.. సిబ్బంది నిర్లక్ష్యమే అందుకు ప్రధాన కారణమనే వాదనలు ఎవరూ కాదనలేనివి. ఉద్యోగులు ముందు వరుసలో నిలిచి ప్రజలకు నమ్మకం కలిపిస్తే మధ్యతరగతి ప్రజల మన్ననలు పొందవచ్చని నిరూపించారు ఓ ప్రధానోపాధ్యాయుడు.

ఆదర్శంగా నిలుస్తున్న జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల

Facilities in Varshakonda government school: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చించడంతో పాటు వారిలో ప్రతిభను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు పాటుపడుతున్నారు. చదువుతో పాటు క్రీడలు, వైజ్ఞానికి ప్రదర్శనల్లో ముందుండేలా తీర్చిదిద్దుతున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానంపై నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. ప్రొజెక్టర్ ద్వారా తరగతులు నిర్వహిస్తూ పాఠ్యాంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా చూస్తున్నారు.

ఉత్తమ పాఠశాల

జడ్పీహెచ్​ఎస్​లో 145 మంది విద్యార్థులు చదువుతున్నారు. అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా క్రమశిక్షణను అలవరుస్తున్నారు. స్వచ్ఛత, పచ్చదనంపై ప్రత్యేకంగా దృష్టి సారించి మెుక్కలను పెంచుతున్నారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. బడి అంటే భయంతో కాకుండా ఆనందంగా అడుగుపెట్టేలా ఉపాధ్యాయులు కృషిచేస్తున్నారు.

'ఆరో తరగతిలో నాకు ఇక్కడ స్టడీ ఏం బాగా అనిపించలేదు. నేను ప్రైవేటుకు వెళ్లాలని అనుకున్నాను. ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. కంప్యూటర్ ల్యాబ్, గేమ్స్ వంటివి నిర్వహిస్తున్నారు. స్కూల్​కు వస్తే ఇంటికి వెళ్లాలని అనిపించదు. అంతా బాగుంది స్టడీ.'

-విద్యార్థిని, వర్షకొండ పాఠశాల

'ఇక్కడ స్టడీ చాలా బాగుంది. హెచ్​ఎం సార్ కూడా చాలా ప్రోత్సహిస్తారు. సైన్స్ ల్యాబ్, స్పోర్ట్స్, కంప్యూటర్ వంటివి చాలా బాగా అనిపిస్తాయి. ఇక్కడ స్వచ్ఛ భారత్ కూడా నిర్వహిస్తాం. ఇంట్లో కన్నా స్కూల్​లోనే బాగా అనిపిస్తుంది. టీచర్లందరితో ఫ్రెండ్లీగా ఉంటాం. టీచర్లు కూడా చాలా బాగా చెప్తారు. ప్రైవేటుకన్నా గవర్నమెంట్ స్కూల్ బెస్ట్. వర్షకొండ స్కూల్ ది బెస్ట్.'

-విద్యార్థిని, వర్షకొండ పాఠశాల

ప్రైవేటుకు దీటుగా..

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడిని తీర్చిదిద్దాలని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌ రెడ్డి సంకల్పించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో గ్రామస్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి పిల్లలను చదివించాలని కోరారు. పూర్తి బాధ్యత వహిస్తానని భరోసా కల్పించారు. పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో పాఠశాలలో సౌకర్యాలు కల్పించారు.

'నేను జడ్పీహెచ్​ వర్షకొండలో పనిచేయబట్టి పదేళ్లు దాటింది. శ్రీనివాస్ రెడ్డి సార్ 2018లో వచ్చారు. అప్పటికీ... ఇప్పటికీ స్కూల్​లో చాలా మార్పులు జరిగాయి. దాతల సహకారం, వర్షకొండ ప్రజల సాయంతో స్కూల్​ను అభివృద్ధి చేశారు. ప్రధానోపాధ్యాయుడి మాట ప్రకారం ఉపాధ్యాయులందరం సమష్టిగా కలిసి పనిచేస్తున్నాం.'

-ఉపాధ్యాయురాలు, వర్షకొండ పాఠశాల

ఉపాధ్యాయుల కృషి అవసరం

ప్రభుత్వ పాఠాశాలలపై చిన్నచూపు పోవాలంటే ఉపాధ్యాయుల కృషి కూడా ఎంతో అవసరమని వర్షకొండ జడ్పీహెచ్​ఎస్ నిరూపిస్తోంది. మిగతా ఉపాధ్యాయులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

'రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మేం పాల్గొన్నాం. గేమ్స్ విషయంలో జిల్లా, జోనల్ స్థాయిలో రాణించాం. పిల్లలకు శుభ్రమైన వాటర్, అన్నిరకాల సౌకర్యాలు సమకూర్చాం. పేద విద్యార్థులకు ఉచిత నోట్ బక్ పంపిణీ చేస్తున్నాం. పదో తరగతి విద్యార్థుల స్నాక్స్ కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశాం. పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయులందరూ నాకు సహకరిస్తున్నారు.'

-గడ్డం శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు

ఇదీ చదవండి: Mayor On BJP Corporators GHMC Attack: 'సమాజానికి గూండాయిజం నేర్పిస్తున్నారా..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.