village school: మూతబడిన సర్కారు బడి... తెరుచుకున్న గ్రామబడి

author img

By

Published : Aug 20, 2021, 4:30 PM IST

lockdown school

కరోనాతో పిల్లల చదువులు అటకెక్కాయి. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నా... వాటితో పిల్లలు నేర్చుకునేది అంతంతమాత్రమే. తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు చదువుకున్న వారు అయితే... వారు పిల్లల పట్ల శ్రద్ధ పెట్టి చదువు చెబుతున్నారు. కానీ... తల్లిదండ్రులకు చదువు లేకపోతే... ఆ పిల్లలు ఆన్‌లైన్‌ తరగతులతో నేర్చుకునేదేమీ ఉండట్లేదు. అందుకే జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట గ్రామస్థులు ఓ నిర్ణయం తీసుకున్నారు.

కొవిడ్​ కారణంగా పాఠశాలలు మూతపడడం వల్ల ఆన్​లైన్​ పాఠాలతో కొత్తగా నేర్చుకునేది దేవుడెరుగు... ఇప్పటికే నేర్చుకున్నది కూడా మర్చిపోతున్నారు. చెట్టు కింద కూర్చున్నా.. గదుల్లో కూర్చున్నా... ఆ బడి వాతావరణం పిల్లలకు చదువుపట్ల శ్రద్ధ తీసుకువస్తుంది. ఆన్‌లైన్‌ చదువుల్లో అది ఉండటం లేదు. పిల్లల చదువులపై దృష్టి పెట్టిన జగిత్యాల జిల్లా (jagtial) కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట (dammayapet) గ్రామస్థులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. పిల్లలు పాఠాలు మర్చిపోకుండా ఉండేలా పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు (village school). గ్రామంలో ఐదో తరగతి లోపు చిన్నారులకు 2 నెలలుగా ప్రత్యేక పాఠశాల నడుపుతున్నారు.

దమ్మయ్యపేట బడిలో విద్యార్థులు
దమ్మయ్యపేట బడిలో విద్యార్థులు

ఇది ప్రైవేటు పాఠశాల కాదు. గ్రామస్థుల సహకారంతో ఏర్పాటు చేశారు. పిల్లలు అందరూ బాగానే చదువుతున్నారు. పాఠాలు మరచిపోకుండా పునశ్ఛరణ చేయిస్తున్నాము. పాఠశాలలు తెరిచేనాటి పాఠాలు కొత్తగా అనిపించకుండా ఉపయోగపడుతుంది. -బొందు హేమ, ట్యూటర్​

తలా కొంత వేసుకుని

గ్రామస్థులు (villagers school) తలా కొంత మొత్తం వేసుకుని సుమారు రూ.30 వేలతో గ్రామంలోనే ఒక షెడ్డు నిర్మించారు. అందులోనే పిల్లలకు చదువులు చెబుతున్నారు. అదే గ్రామానికి చెందిన ఇంటర్‌ పూర్తి చేసిన బొందు హేమ అనే యువతితో తరగతులు చెప్పిస్తున్నారు. అందుకుగాను నెలకు కొంత మొత్తం ఇస్తున్నారు.

కొవిడ్​ నిబంధనలు సక్రమంగా పాటించడం వల్ల మా గ్రామంలో ఇప్పటివరకు ఒక్క కొవిడ్​ కేసు కూడా నమోదు కాలేదు. లాక్​డౌన్​ వల్ల పిల్లలు బడికి దూరమయ్యారు. ఆటల పట్టి పోతున్నారు. పాఠాలు మరచిపోతారు. క్రమశిక్షణ తప్పిపోతారనే ఉద్దేశంతో పాఠశాల ఏర్పాటు చేశాము.- తునికి నర్సయ్య, గ్రామ సర్పంచ్​

బడులు లేకపోవడం వల్ల పిల్లలు గాలిపట్టిపోతున్నారు. పాఠాలు మరచిపోతారు. కనీసం రోజుకు రెండు గంటలు చదివించాలి. అందుకే రోజు గ్రామంలో బడికి పంపుతున్నాం. -గ్రామస్థురాలు

కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ..

బడులు లేక పిల్లలు చదువుకున్నది మర్చిపోతున్నారని... ఇలా ట్యూషన్‌ నిర్వహిస్తే ఎంతో కొంత నేర్చుకుంటారని తల్లిదండ్రులు అంటున్నారు. దమ్మయ్యపేటలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసూ (covid cases) రాలేదు. నిబంధనలు, జాగ్రత్తలు పక్కాగా పాటించడంతో కొవిడ్‌ను కట్టడి చేయగలిగామని గ్రామస్థులు చెబుతున్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తామని అంటున్నారు.

ఇదీ చూడండి: school timings : పాఠశాలల పనివేళలు పెంపు... విద్యా సంవత్సరంలో 188 పని దినాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.