ETV Bharat / state

T Congress Strategises : తెలంగాణలో 'కర్ణాటక ప్లాన్'.. రంగంలోకి యువజన​ కాంగ్రెస్

author img

By

Published : Jun 25, 2023, 1:38 PM IST

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల యువజన కాంగ్రెస్‌ నాయకులను భాగస్వామ్యం చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. కర్ణాటక తరహా విధానాన్ని అనుసరించి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలను నియమించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు కార్యాచరణను సిద్దం చేస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ.. రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా హస్తం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.

Youth congress
Youth congress

T-Congress Focus on Assembly Elections 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపునకు యువజన కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషించిందని కాంగ్రెస్‌ పార్టీ అంచనా వేసింది. అదే తరహాలో రాష్ట్రంలోనూ యువజన కాంగ్రెస్‌ను భాగస్వామ్యం చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగా గాంధీభవన్‌లో కర్ణాటకకు చెందిన యువజన కాంగ్రెస్‌ నాయకులతో రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ నాయకులను కలిపి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్‌రావ్‌ ఠాక్రే సమావేశమయ్యారు. సుదీర్ఘంగా చర్చించిన ఠాక్రే యువజన కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించి చురుకైన పాత్ర పోషిస్తే భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు.

త్వరలో యువజన కాంగ్రెస్‌ ఫ్లీనరీ..: పదోన్నతులతో పాటు పార్టీ వ్యవహారాల్లో కీలకమైన పదవులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో.. వచ్చే నెల 11, 12, 13 తేదీల్లో బెంగళూరులో యువజన కాంగ్రెస్‌ ప్లీనరీ నిర్వహించనున్నట్లు యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తెలిపారు. ఇక్కడ జరగబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని ఛేజిక్కించుకునేందుకు ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు.

గడప గడపకు ప్రచారం..: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు దక్షణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి 119 మంది చురుకైన యువజన కాంగ్రెస్‌ నాయకులను రంగంలోకి దించనుంది. వీరంతా ఆయా అసెంబ్లీ నియోజక వర్గాల్లో తిష్ఠ వేసి స్థానిక నియోజకవర్గ, మండల, బూత్ స్థాయి యువజన కాంగ్రెస్‌ నాయకులతో, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటారు. పార్టీపరంగా తీసుకునే విధానపరమైన నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే వీరి ప్రధాన లక్ష్యంగా పని చేస్తారు.

Telangana youth congress : ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలను, కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లే బాధ్యత వీరిపై ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల సమయంలో 4.70 లక్షల ఇళ్లకు యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీకి చెందిన విషయాలను చేరవేయగలిగారు. అదే తరహాలో ఇక్కడ కూడా ప్రతి గడపకు యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు వెళ్లేట్లు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ప్రత్యేక యాప్ రూపకల్పన..: యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు ఇంటింటికీ వెళ్లేందుకు కాంగ్రెస్‌ పార్టీ ‌.. "విత్‌ ఐవైసీ" అన్న యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో భాగస్యామ్యమై పార్టీ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లేందుకు పని చేసే యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలకు దీనిని అందుబాటులో ఉంచుతారు. పార్టీ అజెండాను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్లకుండా దొంగ లెక్కలు చూపేందుకు వీలులేకుండా.. లొకేషన్‌తో సహా వివరాలు నమోదయ్యేట్లు యాప్‌ను రూపొందించారు.

దీంతో ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే సునాయాసంగా గుర్తిస్తారు. కర్ణాటకలో కొందరు తప్పుడు సమాచారం ఇవ్వగా.. వెరిఫికేషన్‌లో బయట పడినట్లు యువజన కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, 6 వేలకు పైగా బూతులు ఉండగా ఇప్పటికే అసెంబ్లీ స్థాయి యువజన కాంగ్రెస్‌ కమిటీలు ఉండగా మండల స్థాయి 80 శాతం, బూతు స్థాయి కేవలం 20 శాతం మాత్రమే కమిటీలు ఉండడంతో వాటిని వీలైనంత త్వరగా వేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డిని ఠాక్రే ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.