ETV Bharat / state

జ్యోతిషం నమ్మొద్దన్నందుకు ఒకరు, చట్నీ ఎక్కువగా వేశావన్నందుకు మరొకరి ఆత్మహత్య

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 9, 2024, 1:43 PM IST

Updated : Jan 9, 2024, 2:42 PM IST

Women Suicides in Hyderabad Today : ప్రస్తుత కాలంలో చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకోవడం ఫ్యాషన్​గా మారింది. చిన్న విషయాలను భూతద్ధంలో చూస్తూ తమ విలువైన ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి రెండు వేర్వేరు ఘటనలు హైదరాబాద్​లో వెలుగు చూశాయి. జ్యోతిషం పట్ల నమ్మకంతో ఒకరు, చట్నీ విషయంలో గొడవతో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు.

Women Suicides in Hyderabad Today
Women Suicides

Women Suicides in Hyderabad Today : జ్యోతిషంపై అతి నమ్మకం ఒకవైపు, భర్త వేధింపులు మరోవైపు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించింది. జ్యోతిషం పట్ల ఉన్న నమ్మకంతో యూట్యూబ్ ఛానల్​లో వచ్చే వాటిని అనుకరించి భార్యాభర్తలుగా తాము విడిపోతామని భర్తతో చెప్పడంతో వారి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భర్త కొట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. జ్యోతిషంపై అతి నమ్మకంతో పాటు భర్త వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

'నీ పెళ్లికి పెట్టిన ఖర్చులు తిరిగిచ్చేయ్' - అన్నా వదినల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అంబర్​పేట్​లో నివసించే చందు, స్వరూప దంపతుల కుమార్తె బబిత(28). ఆమెకు తల్లిదండ్రులు ఐదేళ్ల కిందట బాలంరాయికి చెందిన సాఫ్ట్​వేర్ ఉద్యోగి రామకృష్ణ అలియాస్ రాము (30)తో పెళ్లి జరిపించారు. అయితే ఈ దంపతులు ఖానాజిగూడ ఇందిరానగర్​లో కాపురం పెట్టారు. వీరికి మూడేళ్లబాబు కూడా ఉన్నాడు. ఆదివారం బాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బంధుమిత్రులంతా హాజరయ్యారు. కానీ బబిత తల్లిదండ్రులు మాత్రం హాజరు కాలేదు.

సోమవారం ఉదయం భర్త విధులకు వెళ్లాడు. తర్వాత రెండు గంటలకు అంగన్​వాడీ కేంద్రం నుంచి వచ్చిన చిన్నారి, తన తల్లి ఇంట్లో ఫ్యానుకు వేలాడుతుండటం చూసి కింది పోర్షన్​లో బాబాయికి చెప్పాడు. వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు వచ్చి రాముపై దాడి చేశారు. అదనపు కట్నం వేధింపులతోనే మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, జ్యోతిషాన్ని నమ్మవద్దని బబితను రాము పదే పదే కోరేవాడని, దీనిపై ఇటీవల వాగ్వాదం చోటుచేసుకోగా, అందరి ముందు రాము ఆమెను కొట్టినట్లు అత్తింటి వారు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చెప్పారు.

Women Suicides in Hyderabad Today
జ్యోతిషం పట్ల నమ్మకంతో యువతి మృతి

డిసెంబరు 31న ఆత్మహత్యకు పాల్పడిన జంట - శ్రీకాకుళం జిల్లా వాసులుగా గుర్తించిన పోలీసులు

Hyderabad Suicide News : చట్నీ విషయంలో భార్యభర్తల మధ్య తలెత్తిన గొడవ భార్య బలవన్మరణానికి పాల్పడేలా చేసింది. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం గోప తండాకు చెందిన రమణ, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన బానోతు చందన (25)ను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. రమణ సినీ నిర్మాత బండ్ల గణేశ్​ వద్ద డ్రైవర్​గా పని చేస్తున్నాడు. చందన కూడా ఓ ఆభరణాల దుకాణంలో పని చేస్తోంది. వీరిద్దరూ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లోని ఇందిరానగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసే సమయంలో చట్నీ ఎక్కువ వేశావంటూ రమణ భార్యతో గొడవపడ్డాడు. సోమవారం ఉదయం అతడు విధులకు వెళ్లగా, భార్య పలుమార్లు వీడియో కాల్స్‌ చేసింది. కానీ అతడు స్పందించకపోవడంతో ఫోన్‌ చేసి కావాలనే తనతో గొడవ పడుతున్నావంటూ పెద్దగా కేకలు వేసింది. అనంతరం తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్‌ పెట్టేసింది. అనుమానం వచ్చిన రమణ, ఇంటి యజమానికి ఫోన్‌ చేసి త్వరగా తన ఇంటికి వెళ్లాలని కోరాడు. యజమాని ఇరుగు పొరుగు వారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా, అప్పటికే ఆమె విగతజీవిగా కనిపించింది. ఈ మేరకు భర్త రమణను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. చందన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశాక కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Women Suicides in Hyderabad Today
చట్నీ విషయంలో గొడవతో యువతి మృతి

గీతం యూనివర్సిటీలో ఐదో అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్థిని బలవన్మరణం - వీడియో వైరల్

Last Updated :Jan 9, 2024, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.