ETV Bharat / state

సికింద్రాబాద్​ నుంచి వందే భారత్‌ ఎక్స్​ప్రెస్.. ఈ నెలలోనే ప్రారంభం!

author img

By

Published : Dec 4, 2022, 8:07 AM IST

విమాన తరహాలో ప్రయాణ అనుభూతిని కలిగించే వందే భారత్​ ఎక్స్​ప్రెస్ దక్షిణ మధ్య రైల్వేకు మంజూరైంది. ఇందుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్​కుమార్​కు అధికారికంగా సమాచారం వచ్చింది. డిసెంబరులో ఈ రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది.

Vande Bharat Express
Vande Bharat Express

అత్యాధునిక హంగులు.. విమాన తరహా ప్రయాణ అనుభూతిని కలిగించే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. దక్షిణ మధ్య రైల్వేకు మంజూరయ్యింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌కు శుక్రవారం అధికారికంగా సమాచారం అందింది. దేశంలో ఇప్పటి వరకు ఐదు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలు ఎక్కాయి. కాగా ఇది ఆరోది. ఈ రైలు గరిష్ఠ వేగ సామర్థ్యం గంటకు 180 కిలోమీటర్లు. బయల్దేరిన రెండు నిమిషాల్లోనే 160 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య కాజీపేట మార్గంలో ట్రాక్‌ గరిష్ఠ వేగ సామర్థ్యం గంటకు 130 కి.మీ.

సికింద్రాబాద్‌-గుంటూరు వయా నల్గొండ మార్గంలో గరిష్ఠ వేగం 110 కి.మీ. వందేభారత్‌ కోసం ప్రస్తుత ట్రాక్‌ సామర్థ్యాన్ని 180 కి.మీ. గరిష్ఠ వేగానికి పెంచాల్సి ఉంటుంది. డిసెంబరులోనే ఈ రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. అన్నీ ఏసీ బోగీలుండే ఈ రైల్లో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఖరీదైన ‘అనుభూతి’ కోచ్‌ టికెట్ల కంటే ఎక్కువ ఛార్జీ ఉంటుంది.

రైల్వే మంత్రితో చర్చించిన కిషన్‌రెడ్డి: రాష్ట్రానికి, దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మంజూరులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చూపిన చొరవ ఫలించింది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి, విశాఖపట్నానికి వందే భారత్‌ రైళ్లు కావాలని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ని కొద్దివారాల క్రితం స్వయంగా కలిసి కోరారు. మూడు రోజుల క్రితం కూడా రైల్వేమంత్రిని మరోసారి కలిసి చర్చించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణిస్తున్న పలు రైళ్ల పొడిగింపునకు సంబంధించిన ప్రతిపాదనలను ఇవ్వడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులపైనా మాట్లాడారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వేకు తొలి వందేభారత్‌ మంజూరయ్యింది. ప్రస్తుతం వందేభారత్‌లో సీట్లు మాత్రమే ఉన్నందువల్ల తొలుత విజయవాడ వరకు నడిపిస్తామని.. బెర్తులతో కూడిన వందేభారత్‌ రైళ్లు వచ్చాక విశాఖపట్నం వరకు పొడిగిస్తామని అశ్వినివైష్ణవ్‌ కిషన్‌రెడ్డికి తెలిపారు.

ప్రధానమంత్రి చేతులమీదుగా ప్రారంభం: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రధాని సమయం కావాలని కిషన్‌రెడ్డి కోరినట్లు సమాచారం. ట్రాక్‌ అప్‌గ్రేడ్‌, సిగ్నలింగ్‌కు సంబంధించిన పనులు, ఇతర రైళ్ల టైం టేబుల్‌ సర్దుబాటు పూర్తవగానే.. రైలు ప్రారంభం తేదీపై స్పష్టత వస్తుంది. బీబీనగర్‌లో ఎయిమ్స్‌ కొత్త భవనాలకు ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించేందుకూ బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ కార్యక్రమాలకు ప్రధాని వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.