ETV Bharat / state

గ్రూప్​-1 రాస్తున్నారా... అయితే ఈ మార్పులు తెలుసుకోండి!

author img

By

Published : Oct 10, 2022, 9:04 AM IST

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ మార్పులు చేసింది. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రం గేటు మూసివేసి, అభ్యర్థుల్ని అనుమతించబోమని వెల్లడించింది.

TSPSC
TSPSC

తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ మార్పులు చేసింది. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందుగానే (ఉదయం 10.15గంటలకు) పరీక్ష కేంద్రం గేటు మూసివేసి, అభ్యర్థుల్ని అనుమతించబోమని వెల్లడించింది. వీలైనన్ని బహుళ సిరీస్‌లతో ప్రశ్నపత్రాలను కమిషన్‌ సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,041 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. మొత్తం 503 పోస్టులకు రాష్ట్రంలో 3,80,202 మంది హాజరు కానున్న ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆదివారం నుంచి కమిషన్‌ అందుబాటులోకి తెచ్చింది.

వెబ్‌సైట్‌ నుంచి వాటిని డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక లింకు ఏర్పాటుచేసింది. పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులు చెప్పులతోనే రావాలని, బూట్లు ధరించరాదని స్పష్టీకరించింది. గోరింటాకు, సిరా, టాటూస్‌ తదితరాలతో చేతులు, కాళ్లకు అలంకరణలు చేసుకుని రావద్దని తెలిపింది. తప్పుడు ధ్రువీకరణలతో హాజరైనా, ఒకరి పేరిట మరొకరు వచ్చినట్లు తెలిసినా క్రిమినల్‌ కేసులు పెడతామని, కమిషన్‌ పరీక్షల నుంచి డీబార్‌ చేస్తామని హెచ్చరించింది. ఇక.. ఓఎంఆర్‌ పత్రంలో వైట్నర్‌, చాక్‌పౌడర్‌, బ్లేడ్‌, రబ్బరు వాడితే ఆ పత్రాన్ని అనర్హమైనదిగా గుర్తించి, మూల్యాంకనానికి పరిగణించరు. పరీక్ష సమయం ముగిసే వరకు అభ్యర్థులు బయటకు వెళ్లడానికి అనుమతించరు. అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్ల డిజిటల్‌ ఇమేజ్‌ స్కానింగ్‌ అనంతరం డిజిటల్‌ ఓఎంఆర్‌ కాపీలను కమిషన్‌ తన వెబ్‌సైట్‌లో ఉంచనుంది.

ప్రిలిమినరీ అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్‌ తీసుకున్నాకే పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ప్రిలిమినరీ రాసేటపుడు తీసుకున్న బయోమెట్రిక్‌, మెయిన్స్‌కి వచ్చినపుడు తీసుకునే దానితో సరిపోలితేనే ప్రధాన పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాలు, చిరునామాపై తలెత్తే సందేహాల నివృత్తికి జిల్లా కలెక్టరేట్లలో గ్రూప్‌-1 హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో పొందుపరిచిన గంట సమయంలోనే 50వేల మందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం రాత్రి వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్న వారి సంఖ్య 1,32,406గా ఉన్నట్లు చెప్పారు. అభ్యర్థులు సకాలంలో వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షకు హాజరుకావాలని కోరారు. ఓఎంఆర్‌పై అభ్యర్థి, ఇన్విజిలేటర్‌ ఇద్దరూ సంతకాలు చేయాలని, ఏ ఒక్కరి చేవ్రాలు లేకున్నా మూల్యాంకనానికి జవాబు పత్రాల్ని పరిశీలించబోమన్నారు. ఇరువురి సంతకాలు ఉండేలా అభ్యర్థి చూసుకోవాలని, తప్పుచేసే ఇన్విజిలేటర్లపై చర్యలు తప్పవని కమిషన్‌ ఛైర్మన్‌ హెచ్చరించారు.

భారీగా ప్రశ్నల జంబ్లింగ్‌... ప్రభుత్వ పోటీపరీక్షలకు నిర్ణీత ప్రశ్నలను జంబ్లింగ్‌ చేసి ఇప్పటివరకు ఎ, బి, సి, డి సిరీస్‌ల పేరిట నాలుగు ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు వరుస క్రమంలో ఇచ్చేవారు. ఇకపై నాలుగుకు మించి వీలైనన్ని బహుళ సిరీస్‌లు వచ్చేలా ప్రశ్నపత్రాలను కమిషన్‌ సిద్ధం చేస్తోంది. ఎంపిక చేసిన ప్రశ్నలకు కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌తో సాధ్యమైనన్ని దఫాలుగా జంబ్లింగ్‌ చేసి, ఎక్కువ సంఖ్యలో సిరీస్‌ల ప్రశ్నపత్రాలను ముద్రించనుంది. ఈ మేరకు ఎ, బి, సి, డి సిరీస్‌ల స్థానంలో ఆరంకెల ప్రశ్నపత్రం నంబరుతో ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు ఇవ్వనుంది. అభ్యర్థులు ఆరంకెల సిరీస్‌తో కూడిన ప్రశ్నపత్రం కోడ్‌ను ఓఎంఆర్‌ షీట్‌లో నమోదు చేసి, ఆ మేరకు వృత్తాల్ని బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌తో బబ్లింగ్‌ చేయాలని కమిషన్‌ తెలిపింది. ప్రశ్నపత్రం బుక్‌లెట్‌ సిరీస్‌ నంబరు ఓఎంఆర్‌లో రాసి, వృత్తాల్ని సరిగా బబ్లింగ్‌ చేయకున్నా, వృత్తాల్ని సరిగా నింపి బుక్‌లెట్‌ సిరీస్‌ నంబరు రాయకున్నా..ఒక్క అంకెను తప్పించినా ఆ ఓఎంఆర్‌ను మూల్యాంకనానికి పరిగణనలోకి తీసుకోబోమని వెల్లడించింది.

అభ్యర్థులకు సూచనలు..

  • పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేందుకు ముందుగా హాల్‌టికెట్‌తో పాటు పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరుకార్డు, ఆధార్‌కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపుకార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు తదితర ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తీసుకురావాలి.
  • హాల్‌టికెట్లను అభ్యర్థులు ఏ4 సైజు పేజీపై ప్రింటు తీసుకోవాలి. మరింత స్పష్టతకు కలర్‌ ప్రింట్‌ అయితే బాగుంటుంది. ఒకవేళ అభ్యర్థి ఫొటో, సిగ్నేచర్‌ ప్రింట్‌ కాకుంటే మూడు పాస్‌పోర్టు ఫొటోలపై గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ తీసుకుని, పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు హామీపత్రం ఇవ్వాలి. లేకుంటే ఆ అభ్యర్థిని అనుమతించరు.
  • అభ్యర్థి పరీక్ష కేంద్రానికి ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రం గేటు 10.15కు మూసివేస్తారు.
  • ప్రశ్నపత్రం తెరవగానే అందులో 150 ప్రశ్నలు ముద్రించారా? లేదా? చూసుకోవాలి. పొరపాట్లు ఉంటే మరొకటి అడిగి తీసుకోవాలి.
  • ప్రశ్నపత్రంపై జవాబులను ఎట్టిపరిస్థితుల్లో మార్కు చేయకూడదు. ఓఎంఆర్‌ షీట్లో పేర్కొన్న స్థలంలో కాకుండా ఎక్కడైనా హాల్‌టికెట్‌ నంబరు రాసినా, ఇతర గుర్తులు వేసినా, ఆ పత్రాన్ని చెల్లనిదిగా పరిగణిస్తారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.