ETV Bharat / state

'12 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలి'

author img

By

Published : Jan 9, 2023, 7:08 PM IST

పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి డీజీపీ అంజనీకుమార్​ను కోరారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఇతర నేతలతో కలిసి డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. దీంతోపాటు మార్కండేయ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడి బాధ్యులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.

డీజీపీకి వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్ నేతలు
డీజీపీకి వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్ నేతలు

ఈ నెల 7న నాగర్‌కర్నూల్ జిల్లాలోని మార్కండేయ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడిని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు డీజీపీని కలిశారు. దాడికి పాల్పడిన బీఆర్​ఎస్​ నేతలపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, సీనియర్ నేత మల్లు రవి, నాగం జనార్దన్​రెడ్డి తదితరులు డీజీపీ అంజనీకుమార్​కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మార్కండేయ ప్రాజెక్టు శిలాఫలకాన్ని సందర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులపై దూషణలు, దాడులకు దిగారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. గొంతుపై కాలు పెట్టి తొక్కి.. పరుష పదజాలంతో దూషించారని తెలిపారు. దాడికి గురైన బాధితుల్లో ఒకరు గిరిజనుడు, మరొకరు దళితుడు ఉన్నారన్నారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారని అనుకుంటే.. తమ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిపైనే అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం, పోలీసుల బరి తెగింపు చర్య అని దుయ్యబట్టారు. ఈ అంశంపై ఆధారాలతో డీజీపీ అంజనీకుమార్​కు ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు.

మరోవైపు 12 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డీజీపీకి మరో ఫిర్యాదు ఇచ్చామని రేవంత్​రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మిగతా వారిపైనా సీబీఐ విచారణ చేపట్టాలని కోరామన్నారు.

ఈ అంశంపై చీఫ్‌ సెక్రటరీని అపాయింట్‌మెంట్‌ కోరితే తప్పించుకు తిరుగుతున్నారని రేవంత్​రెడ్డి మండిపడ్డారు. చీఫ్ సెక్రటరీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎస్ ఉద్దేశపూర్వకంగానే అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకు వత్తాసు పలుకుతున్నట్లు కాంగ్రెస్ భావించాల్సి వస్తుందని రేవంత్ పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల 12 నియోజకవర్గాల్లో సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు.

మా ఫిర్యాదులను డీజీపీ సీబీఐకి అప్పగించాలి. 12 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల వివరాలను సీబీఐకి అప్పగించాలి. మా ఫిర్యాదులపై సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ స్పందించట్లేదు. ఎన్నిసార్లు అడిగినా సీఎస్‌ సమయం ఇవ్వకుండా అవమానిస్తున్నారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను కూడా కోర్టుకు ఈడుస్తాం. - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇవీ చూడండి..

'రూ.35 వేల కోట్ల సర్పంచుల నిధులను రాష్ట్రప్రభుత్వం దారి మళ్లించింది'

కాంగ్రెస్ వార్​ రూమ్​ కేసు.. మల్లు రవికి పోలీసుల నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.