preparations: పంటల కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఏం చేద్దాం..!

author img

By

Published : Aug 29, 2021, 5:12 PM IST

preparations: పంటల కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఏం చేద్దాం..!

వానాకాలం సీజన్​ ప్రారంభంలో రైతులను మురిపించిన వానలు.. ఇప్పుడు కంటికి కనిపించడం లేదు. అప్పుడప్పుడు అడపా దడపా పడుతోన్నా.. ఆ వానలు సరిపోవడం లేదు. సమృద్ధిగా వర్షాలు కురుస్తాయనే ఆశతో పంటలు సాగు చేసుకున్న రైతులు.. ఇప్పుడు ఆ పంటలను కాపాడుకోలేక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వరుణ దేవుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ వానాకాలంలో 1 కోటి 48 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రాబోతోందని అంచనా వేసిన ప్రభుత్వం.. ధాన్యం దిగుబడులు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఎఫ్‌సీఐ సేకరణ, నిల్వ, మిల్లింగ్ వంటి అంశాలపై అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో నిమగ్నమైంది.

ఈ వానాకాలం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. జూన్ నెలలో రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలతో వర్షాలు ఆశాజనకంగా పడటంతో రైతులు పంటలు సాగు చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం తగ్గి.. వరి పంట సాగు గణనీయంగా పెరిగిపోయింది. కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టుల కింద సాగు నీటి వనరులు అందుబాటులోకి రావడం వల్ల కూడా వరి సాగు పెరిగేందుకు మరో కారణమైంది. మొత్తంగా 55 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ప్రధాన వాణిజ్య పంట పత్తి 70.04 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా.. వర్షాభావం కారణంగా కాస్త తగ్గిపోయింది.

గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రికార్డు సాధించింది. దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. గత సీజన్​ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ధాన్యం దిగుబడులు, సేకరణ, మార్కెటింగ్ అంశాలపై వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. పెరగబోతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, భారత ఆహార సంస్థను రంగంలోకి దింపడం ద్వారా రైతులకు కనీస మద్దతు ధరలు చెల్లించడం, నిల్వల కోసం మంచి సామర్థ్యం గల గిడ్డంగుల సమాయత్తం, అదనపు సిబ్బందిని సమీకరించడంపై ముందుస్తుగా విస్తృత కసరత్తు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

55 లక్షల ఎకరాల్లో వరి సాగు..

తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో వరి సాగు 55 లక్షల ఎకరాలకు పెరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. ఒక ఎకరానికి సరాసరి 27 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనాల మేరకు 1 కోటి 48 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రాబోతోందని అంచనా వేసింది. వానాకాలం ఉత్పత్తిలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐ అంగీకరించిన దృష్ట్యా.. మరో 15 నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల ఆహార అవసరాల నిమిత్తం ఏడాదికి సరాసరి వినియోగించే బియ్యం 56 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేసింది. అందుకోసం 83.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం అవుతాయని తెలిపింది.

సన్నాలే సాగు చేయాలి..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లోనూ సన్న రకాల వడ్లకు మంచి మార్కెట్ నెలకొంది. కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో దొడ్డు వడ్ల వినియోగం తగ్గడం, స్థానికంగా రైతులు పండిస్తుండటంతో అవసరం లేకుండా పోయింది. చివరకు అవి కొనుగోలు చేయబోమని ఎఫ్‌సీఐ స్పష్టం చేసింది. ఇది దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రైతాంగం యాసంగిలో దొడ్డు రకం వడ్లు సాగు చేయవద్దని.. సన్న రకాలనే సాగు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వీలైనంత మేరకు వరి సాగు తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయంగా వేరు శనగ, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు వంటి తక్కువ పెట్టుబడి అయ్యే నూనె గింజల పంటల సాగుపై దృష్టి సారించాలని కోరింది. యాసంగిలో వడగండ్ల వానలు, అకాల వర్షాలు, గాలివానలతో రైతులు పంటలు నష్టపోకుండా మార్చి 31లోపు పంటలు కోతకు వచ్చేలా చూసుకోవాలని సూచించింది. వ్యవసాయ శాఖ ఈ విషయంలో రైతులను చైతన్యపరచాలని స్పష్టం చేసింది.

ఆ సమస్యను అధిగమించేందుకు చర్యలు..

రాష్ట్రంలో గోదాంల సమస్య తీవ్రంగా ఉంది. సాగు విస్తీర్ణం పెరగడం, దిగుబడులు అంచనాలకు మించి రావడం.. వెరసి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్న అన్ని రకాల గిడ్డంగులు ధాన్యం, ఇతర పంటలతో నిండుగా ఉన్నాయి. ఇవి వానాకాలం పంటలు వచ్చే నాటికి ఖాళీ అయ్యే అవకాశం తక్కువగా ఉంది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ వద్ద 40 లక్షల మెట్రిక్ టన్నుల గోదాంల నిర్మాణానికి డీపీఆర్ సిద్ధంగా ఉంది. ఆసక్తి గల వారికి నిర్మాణ ఖర్చులో రాయితీ ఇస్తే.. తక్కువ ఖర్చుతో ఎక్కువ నిల్వ సామర్థ్యం వచ్చే అవకాశం ఉందని ప్రతిపాదనలు అందుతున్నాయి. ఈ విషయంపై అధ్యయనం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో గోదాముల నిల్వ సామర్థ్యం మరింత పెంచేందుకు త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇదీ చూడండి: TS Weather report: ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.