crop: దిగుబడిలో 25 శాతానికి కేంద్రం అనుమతి!

author img

By

Published : Sep 15, 2021, 8:02 AM IST

crop
crop ()

వానాకాలం పంటల సీజన్‌ పంటల్లో మద్దతు ధరకు కొనేదెంత అనేది ప్రశ్నార్థకంగా మారింది. పెసర, మినుము, సోయా చిక్కుడు పంటలను మద్దతు ధరపై అనుమతించాలని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ కేంద్రానికి లేఖ రాయగా.. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, వరి మాత్రమే పరిమితంగా కొంటామని కేంద్రం స్పష్టం చేసింది. మినుము, సోయా పంటల దిగుబడిలో సైతం 25 శాతం చొప్పున కొనడానికి కేంద్రం నుంచి అనుమతి రావచ్చని మార్క్‌ఫెడ్‌ (రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య) ఎదురుచూస్తోంది.

పప్పు ధాన్యాలు, నూనె గింజలు, వరి మాత్రమే పరిమితంగా కొంటామని కేంద్రం స్పష్టం చేయడంతో.... వానాకాలం పంటల సీజన్​ పంటల్లో మద్దతు ధరకు కొనేదెంత అనేది ప్రశ్నార్థకంగా మారింది.

పెసర ఇలా...

పెసర పంట రాష్ట్ర దిగుబడిలో 25 శాతం కొనుగోలు చేస్తామంది. రైతుల నుంచి పెసర్లను మద్దతు ధరకు కొనాలని మార్క్‌ఫెడ్‌ను నోడల్‌ ఏజెన్సీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత వానాకాలంలో రాష్ట్రంలో 1,34,721 ఎకరాల్లో పెసర పంట సాగు చేశారని, 40,416 టన్నుల దిగుబడి రావచ్చని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కేంద్రానికి రాసిన లేఖలో తెలిపింది. ఇందులో 25 శాతం అంటే 10,104 టన్నులే మద్దతు ధరకు కొంటామని కేంద్రం చెప్పింది. మినుము, సోయాచిక్కుడు, కంది, వేరుసెనగ పంటల విషయంలోనూ కేంద్రం ఇదే నిబంధన అమలు చేస్తున్నందున 75 శాతం పంటను వ్యాపారులు చెప్పినంత ధరకే రైతులు అమ్ముకోవాలి. కేంద్రం కొనే 25 శాతం కాకుండా మిగిలిన పంటను కొనడానికి తమవద్ద నిధులు లేవని, ఒకవేళ కొనాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని మార్క్‌ఫెడ్‌ చెబుతోంది.

మక్కలు ఎలా...

మొక్కజొన్న పంటను రేషన్‌కార్డులపై పేదలకు విక్రయిస్తేనే తాము మద్దతు ధరకు కొంటామని కేంద్రం తెలిపింది. గతేడాది రైతులు తమ పంటకు మద్దతు ధర రాకపోవడంతో ఆందోళన చేశారు. దీంతో 2020 వానాకాలం సీజన్‌ పంటను పరిమితంగా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అనుమతించింది. తర్వాత యాసంగిలో మక్కలను కొనడానికి అనుమతించలేదు. ఈ సీజన్‌లో సాధారణ విస్తీర్ణం 9.89 లక్షల ఎకరాలకు రైతులు 6.12 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. 15 లక్షల టన్నుల దిగుబడి రావచ్చని అంచనా. దీన్ని కేంద్రం కొనేది లేదని చెప్పినందున రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా లేదా తేలలేదు. ఈ పంటను మద్దతు ధరకు తీసుకోవాలంటే రూ.1500 కోట్లను బ్యాంకుల నుంచి రుణాలుగా పొందేందుకు మార్క్‌ఫెడ్‌ తరఫున రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వాలి.

వరి ధాన్యంపై అనిశ్చితి

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వరి అరకోటి ఎకరాల్లో సాగైంది. కనీసం కోటి టన్నులకు తగ్గకుండా ధాన్యం దిగుబడి రానుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. కానీ ‘భారత ఆహార సంస్థ’(ఎఫ్‌సీఐ) 40 లక్షల టన్నుల బియ్యమే కొనడానికి అనుమతించినందున దానికి సరిపడా 60 లక్షల టన్నుల ధాన్యమే మద్దతు ధరకు కొనాలి. మరి మిగిలిన 40 లక్షల టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొంటుందా లేక వ్యాపారులకు వదిలేస్తుందా అనేది తేలలేదు. వరి విషయమై రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వకపోతే వ్యాపారులు ధరలు తగ్గించేసి కొంటారని మార్కెటింగ్‌ అధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు.

ఇదీ చూడండి: Central Government: బియ్యం సేకరణపై కేంద్రం తాజా మెలిక... నష్టపోతామంటున్న రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.