ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నిందితుల రిమాండ్‌కు తిరస్కరణ

author img

By

Published : Oct 27, 2022, 5:16 PM IST

Updated : Oct 28, 2022, 6:41 AM IST

తెరాసను వీడి భాజాపాలో చేరితే భారీగా నగదు ఇస్తామంటూ ఎమ్మెల్యేలను కొందరు ప్రలోభపెట్టబోయారన్న కేసు మలుపులు తిరుగుతోంది. నిందితులను పోలీసులు ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరచగా... న్యాయమూర్తి రిమాండ్‌ తిరస్కరించారు. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్టు వర్తించదని... ఆధారాలు లేవని.. 41 సీఆర్​పీసీ కింద నోటీసులు జారీ చేసి ముగ్గురిని విచారించాలని కోర్టు పేర్కొంది.

TRS Mlas trap issue
TRS Mlas trap issue

‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సరైన ఆధారాలు లేవంటూ.. ముగ్గురు నిందితులకు రిమాండ్‌ విధించేందుకు అవినీకి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిరాకరించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని, 41 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చిన తర్వాతే విచారించాలని స్పష్టం చేశారు. నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌లను పోలీసులు రాత్రి సరూర్‌నగర్‌లోని న్యాయమూర్తి జీ. రాజగోపాల్‌ నివాసానికి తీసుకెళ్లి ఆయన ఎదుట హాజరుపరిచారు. లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

న్యాయమూర్తి ఆదేశాల నేపథ్యంలో నిందితుల్ని విడిచిపెట్టామని శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని ముగ్గురు నిందితులపై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై రాత్రి వరకు ముమ్మరంగా దర్యాప్తు జరిగింది. నిందితులు కోట్ల నగదు తీసుకొచ్చారని ప్రచారం జరిగినా దానికి సంబంధించిన ఆధారాలను పోలీసులు వెల్లడించలేదు. కానీ జాతీయస్థాయిలో ఒక కీలక నాయకుడి కార్యదర్శి మాట్లాడిన ఆడియో టేపులు లభించాయని పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తెరాసను వదిలిపెట్టి భాజాపాలో చేరితే ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి 100 కోట్లు, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్‌, హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావుకు ఒక్కొక్కరికి 50 కోట్ల రూపాయల చొప్పున ఇస్తామంటూ ప్రలోభపెట్టారని... రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను అరెస్టు చేసి సుదీర్ఘంగా పోలీసులు విచారించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో కాంట్రాక్టులు కట్టబెడతామని ఆశపెట్టినట్టు... లేకుంటే ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తామని హెచ్చరించినట్టు రోహిత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

దీంతో ముగ్గురు నిందితులపై 120-బీ, “171-బీ రెడ్‌ విత్‌ 171-ఈ”, “506 రెడ్‌ విత్‌ 34 ఐపీసీ”, సెక్షన్‌ 8 ఆఫ్‌ ప్రివెన్షన్‌ కరప్షన్‌ యాక్టు- 1988 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ ప్రాంతాన్ని సైబరాబాద్‌ పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని.. నిన్నంతా విస్తృతంగా తనిఖీలు చేశారు. డబ్బు ఎక్కడైనా దాచారా అనే అనుమానంతో క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసులు తమ కంప్యూటర్లు, ప్రింటర్లు కూడా తీసుకెళ్లి.. ఫాంహౌస్‌లోనే పంచనామా నిర్వహించి, రిమాండ్‌ నివేదికను రూపొందించారు. అక్కడ నిలిపి ఉంచిన కారులోని బ్యాగుల్ని మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు ముగ్గురు నిందితులు ఫాంహౌస్‌ రావడానికి ముందు ఎక్కడెక్కడికి వెళ్లారు, ఏం చేశారనే కోణంలోనూ పోలీసులు వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. నిందితులు వినియోగించిన కారు డ్రైవర్‌ తిరుపతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పూజకోసమే వెళ్లామని... పైలట్‌ రోహిత్‌రెడ్డి ఆరోపణలతో సంబంధం లేదని నిందితుడు నందకుమార్‌ తెలిపారు.

ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ తిరస్కరించడంతో పోలీసులు తదుపరి ఎటువంటి చర్యలు చేపడతారనే అంశాన్ని వేచి చూడాల్సి ఉంది. 41 సీఆర్​పీసీ కింద నోటీసులు జారీ చేసి వారిని విచారించే అంశంపై పోలీసు అధికారులు దృష్టి సారిస్తున్నారు.

ఇవీ చూడండి

Last Updated :Oct 28, 2022, 6:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.