వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయని తెలిసి కూడా ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం అస్తవ్యస్తంగా మారిందని మాజీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు. వరి, జొన్నలు ఉత్పత్తి పెరుగుతుందని... తాను నాలుగు నెలలుగా చెబుతున్నా ప్రభుత్వం సన్నద్దం కాలేదని, ధాన్యం కొనేందుకు ప్రణాళికలు సిద్దం చేయలేదని విమర్శించారు. దేవుడి దయవల్ల కోటి 30లక్షల టన్నులు వరి ధాన్యం తెలంగాణాలో దిగుబడి వచ్చిందని కానీ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు.
90లక్షల టన్నులు కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి... 60 లక్షలు టన్నులు కూడా కొనలేదని విమర్శించారు. అన్నింటిని పక్కన పెట్టి ధాన్యం కొనుగోలు చేయాలని లేదంటే రైతులు తిరగబడతారని ఆయన హెచ్చరించారు. ధనిక రాష్ట్రం అంటున్నారు...డబ్బులు ఎక్కడ పోయాయని ఆయన ప్రశ్నించారు. రాజకీయం మరచిపోయి కొవిడ్ నివారణ, ధాన్యం కొనుగోలులపైనే ప్రత్యేక దృష్టిసారించాలని డిమాండ్ చేశారు. రైతుబంధు లాంటివి తన లాంటి రైతులకు అవసరం లేదని, పంటలు పండించే రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.