ETV Bharat / state

Dr prescription: రోగుల పాలిట శరాఘాతంగా బ్రాండెడ్‌ సిఫార్సులు

author img

By

Published : Dec 22, 2021, 6:50 AM IST

Dr prescription: వైద్యులు రాసే గొలుసుకట్టు రాతలు సాధారణ జనానికి అర్థంకాక అల్లాడుతున్నారు. వాళ్లు రాసే మందుల చీటీ అర్థంకాక తలనొప్పి వస్తోంది. జనరిక్ పేర్లతో కాకుండా... బ్రాండ్ పేరుతో మందులు రాయడం పరిపాటిగా మారింది.

Dr prescription
Dr prescription

Dr prescription: గొలుసుకట్టు రాతలు.. ‘బ్రాండెడ్‌’ సిఫార్సులు.. రోగుల పాలిట శరాఘాతంగా మారుతున్నాయి. వైద్యుల రాత అర్థంకాక.. ఖరీదైన మందులు కొనలేక జనం అల్లాడుతున్నారు. జనరిక్‌ పేర్లతో మందుల చీటీ రాయాల్సి ఉండగా.. ‘బ్రాండ్‌’ పేరుతో రాయడం ఇప్పుడు ఎక్కువమంది వైద్యులకు పరిపాటిగా మారింది. ఉదాహరణకు పారాసెటమాల్‌ను జ్వరం వచ్చినప్పుడు, నొప్పి నివారణకు వినియోగిస్తుంటారు. దీన్ని వందల సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. 10 మాత్రలకు రూ.6 నుంచి రూ.45 వరకూ ధర ఉంది. అంటే సంస్థను బట్టి ధర మారుతోంది. ఇలాంటప్పుడు వైద్యుడు జనరిక్‌ పేరుతో ఔషధాన్ని రాసిస్తే.. రోగి తనకు ఏ సంస్థ ఉత్పత్తి తక్కువ ధరకు లభిస్తుందో దాన్ని ఎంచుకోవడానికి అవకాశముంటుంది.

ఇది కేవలం పారాసెటమాల్‌ ఒక్క దానికి సంబంధించిందే కాదు.. అన్ని రకాల వ్యాధులకూ ‘బ్రాండ్‌’ పేరుతో ఔషధాలను చీటిలో రాయడాన్నే అత్యధిక వైద్యులు అలవాటుగా పెట్టుకున్నారు. దీని వెనుక పెద్ద ఔషధ మాఫియానే ఉందనేది బహిరంగ విమర్శే. ‘వైద్యుడి చీటి’ వెనుక వాణిజ్యకోణాలుండటం ప్రమాదకరమైన ధోరణిగా నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జనరిక్‌ పేర్లతో కాకుండా.. తమ తమ బ్రాండ్ల పేర్లతో ఔషధాలను రాస్తే.. కంపెనీలు భారీగా ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. వైద్యులు కేవలం బ్రాండెడ్‌ పేర్లతోనే మందుల చీటీలు రాయడం దీనికి బలం చేకూర్చుతోంది.

దీనివల్ల ఏమిటి నష్టం?

గొలుసుకట్టుగా వైద్యులు చీటీ రాయడం వల్ల అనేక అనర్థాలకు ఆస్కారం ఉంది. రోగికే కాదు ఔషధ దుకాణదారులకూ వైద్యులు రాసిన మందేమిటో అర్థం కాక చివరకు జబ్బు ఏమిటో రోగి ద్వారానే తెలుసుకొని లేదా మొదటి అక్షరాన్ని ఆధారం చేసుకొని తమకు అర్థమైన ఔషధాన్ని ఇస్తున్న ఫార్మసిస్టులూ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఔషధం వికటించి రోగి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు మూడేళ్ల కిందట ముంబయిలో ఒక ఔషధానికి బదులు మరొక ఔషధాన్ని ఇవ్వడం వల్ల రోగి ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనలో రక్తహీనతను తగ్గించడానికి వైద్యుడు ఔషధం సూచించగా.. ఆ రాత అర్థం కాక, ఆ ఔషధ అక్షరాలకు దగ్గరగా ఉండే క్యాన్సర్‌ ఔషధాన్ని ఫార్మసిస్టు ఇచ్చారు. అలాగే జనరిక్‌ పేరుతో మందులు రాయకపోవడం వల్ల రోగి తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యుడు సూచించిన బ్రాండెడ్‌ ఔషధాలనే కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఆర్థికంగా పెనుభారం తప్పడం లేదు.

ఎందుకు ఈ తరహా విపత్కర ధోరణి?

కొన్ని ఔషధ సంస్థల ఉత్పత్తులను రాయడం వల్ల కొందరు వైద్యులకు ఆ ఔషధ అమ్మకాల్లో కొంత శాతం కమీషన్‌ రూపంలో ముడుతుందనే ఆరోపణలున్నాయి. ఔషధ షాపుల యజమానులతో, సంస్థలతో కుమ్మక్కై కొన్ని రకాల ఉత్పత్తులనే ఎక్కువగా రాస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ కమీషన్లు కాకుండా ఏడాదికోసారి విదేశీయానాలకయ్యే ఖర్చుల్నీ, పుట్టిన రోజులు, పెళ్లి రోజుల పేరిట ప్రత్యేక బహుమతులు తదితరాలను కూడా సంస్థలే అందజేస్తుంటాయి. చాలామంది వైద్యులు తమ ఆసుపత్రిలో సొంతంగా ఔషధ దుకాణాలనూ నిర్వహిస్తున్నారు. వీరు రాసే ఔషధాలు వారి దుకాణంలో తప్ప మరెక్కడా లభ్యం కావు. ఇదో రకమైన దోపిడీగా బాధితులు అభివర్ణిస్తున్నారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ట్టి పరిస్థితుల్లోనూ ఔషధాల జనరిక్‌ పేర్లతోనే వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ రాయాల్సి ఉంటుందని 2017 ఏప్రిల్‌ 21న భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. రోగికి అర్థమయ్యేలా, కనిపించే విధంగా పెద్దక్షరాలతో రాయాలని సూచించింది. దీనిపై అంతకుముందు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలిచ్చింది. అయితే, ఎక్కువమంది వైద్యులు ఇప్పటికీ ఔషధాల బ్రాండెడ్‌ పేర్లే రాస్తున్నారు. అవి కూడా గొలుసుకట్టుగా ఎవరికీ అర్థం కాని రీతిలో ఉంటున్నాయి.

జనరిక్‌ పేర్లతోనే రాయాలి..

డాక్టర్‌ ఇ.రవీంద్రారెడ్డి

నరిక్‌ పేర్లతోనే మందులు రాయాలని ఎంసీఐ ఇచ్చిన ఆదేశాలను వైద్యులందరూ తప్పనిసరిగా పాటించాలి. జనరిక్‌ ఔషధాలను ప్రోత్సహించాలి. పెద్దక్షరాలతో రాయడం వల్ల రోగులకు, ఫార్మసిస్టుకూ తేలిగ్గా అర్థమవుతుంది. వైద్యుల చీటీ రాతపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

-డాక్టర్‌ ఇ.రవీంద్రారెడ్డి, తెలంగాణ వైద్య మండలి ఛైర్మన్‌

గొలుసుకట్టు రాతతో ప్రమాదం..

డాక్టర్‌ డి.లవకుమార్‌రెడ్డి

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు బ్రాండెడ్‌ ఔషధాలు కొనాలంటే ఆర్థికంగా భారమే. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో ఎక్కువగా జనరిక్‌ పేరుతోనే రాస్తుంటారు. గొలుసుకట్టు రాత కొన్నిసార్లు రోగులకు ప్రాణాంతకమవుతుంది.

- డాక్టర్‌ డి.లవకుమార్‌రెడ్డి, తెలంగాణ ఐఎంఏ అధ్యక్షుడు

ఇదీ చూడండి: Piyush Goyal on Cm kcr: 'ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.