ETV Bharat / state

భూ యజమాని మారితే మళ్లీ పేరు నమోదు

author img

By

Published : Dec 17, 2020, 9:01 AM IST

ప్రస్తుత యాసంగి(రబీ) సీజన్‌లో రైతుబంధు పథకం అమలుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. ఈ పథకానికి అర్హులైన రైతుల పేర్లను ఈనెల 21లోగా ‘రైతుబంధు పోర్టల్‌’లో నమోదు చేయాలని నిర్ణయించింది.

rythu bandhu
భూ యజమాని మారితే మళ్లీ పేరు నమోదు

జూన్‌ 30 తరువాత భూముల క్రయ విక్రయాల వల్ల భూ యజమానుల పేర్లు మారితే వారివి మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. భూ యజమాని పేరు మారకపోతే మళ్లీ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)కి రైతు బ్యాంకు ఖాతా, ఆధార్‌ సంఖ్య, పట్టాదారు పాసుపుస్తకం వివరాలు ఇస్తే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.

రెవెన్యూ శాఖ ‘ధరణి’ పోర్టల్‌లో ఉన్న 54 లక్షలమంది రైతుల వివరాలను ఇప్పటికే వ్యవసాయశాఖకు ఇచ్చింది. గత సీజన్‌లో వివిధ కారణాల వల్ల కొందరు రైతులకు రైతుబంధు సొమ్ము జమకాలేదు. అలాంటివారిని గుర్తించి నమోదు చేయాలని నిర్ణయించారు.

ఉదాహరణకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగునీటి కాల్వలు, ఇతర నిర్మాణాల కోసం భూములు సేకరించిన సమయంలో వాటిని రైతుబంధు జాబితా నుంచి తొలగించారు. కానీ ఈ భూముల్లో కొందరు రైతులు సాగుచేసుకుంటున్నందున వారికి ఈ సీజన్‌లో సొమ్ము ఇవ్వాలని వ్యవసాయశాఖ ఆదేశించింది. ఇలా రాష్ట్రమంతా అర్హులను అదనంగా చేరిస్తే ఇవ్వాల్సిన సొమ్ము రూ.100 కోట్లకు పైగా పెరుగుతుందని అంచనా. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5లోగా రైతుల ఖాతాల్లో నగదు జమచేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతు ఖాతాలో వేస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.