English Practicals in Intermediate : ఇకపై ఇంటర్​​​ ఇంగ్లిష్​లోనూ ప్రాక్టికల్స్​

author img

By

Published : May 19, 2023, 8:17 AM IST

Updated : May 19, 2023, 8:30 AM IST

Intermediate

English Practicals in Intermediate : ఇంటర్మీడియట్‌లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్‌లోనూ ప్రాక్టికల్స్‌ నిర్వహించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఇప్పటి వరకు భౌతికశాస్త్రం, రసాయన, జీవ, వృక్ష శాస్త్రాలతో పాటు ఒకేషనల్‌ కోర్సుల్లోనే ప్రాక్టికల్స్‌ ఉండేవి. ఇక నుంచి ఆంగ్లం సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఆంగ్లంలో ఫస్టియర్‌ విద్యార్థులకు వీటిని అమలు చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయిస్తారు. రాత పరీక్ష 80 మార్కులకే పరిమితమవుతుంది.

ఇకపై ఇంటర్​​​ ఇంగ్లిష్​లోనూ ప్రాక్టికల్స్​

English Practicals in Intermediate : ఈ ఏడాది కొత్త విద్యాసంవత్సరంలో పలు సంస్కరణలు అమలుచేయాలని.. గత నవంబరులో తెలంగాణ ఇంటర్‌ బోర్డు పాలకమండలి నిర్ణయం తీసుకొంది. అందులో ఒకటైన ఇంగ్లిషు సబ్జెక్టులో ప్రాక్టికల్స్‌.. అమలుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు ఉండనుండగా.. రాత పరీక్ష 80 మార్కులకే పరిమితం కానుంది. ఆంగ్లంలో సంభాషించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని, దానివల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ప్రాక్టికల్స్‌కు సిలబస్‌ కూర్పుపై భాషా నిపుణులతో బోర్డు అధికారుల చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయి. దీనిలో విద్యార్థులను దైనందిన జీవితంలో ఎదురయ్యే వివిధ సందర్భాలు చెప్పి ఆంగ్లంలో ఎలా మాట్లాడతారో పరీక్షించి అందుకు తగ్గట్లుగా ఆంగ్ల నిపుణులు మాడ్యూళ్లు రూపొందిస్తున్నారు. ఆపై పుస్తకాలనూ ముద్రించాలని భావిస్తున్నారు. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థుల 'వైవా' తరహాలోనే పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు.

పాత సిలబస్​తోనే పాఠాలు : ఇంటర్​ మొదటి సంవత్సరం తరగతలు ప్రారంభమయ్యే నాటికి ప్రాక్టికల్స్‌పై ఇంటర్మీడియట్​ బోర్జు నిర్ణయం ప్రకటించనుంది. ఇంటర్‌లో ద్వితీయ భాషా సబ్జెక్టులైన తెలుగు, సంస్కృతం, హిందీ సిలబస్‌ను ప్రస్తుతానికి పాతదాని ప్రకారమే బోధించనున్నారు. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా భాషా విధానం మారడంతో.. రానున్న విద్యాసంవత్సరం భాషా సబ్జెక్టులకు కొత్త సిలబస్‌ రావొచ్చని అధికారులు అంచనా వేశారు. కానీ ఈ ఏడాది ఇక్కడ మార్పు చేస్తే ఇబ్బంది అవుతుందని బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌కు నిపుణలు సూచించినట్లు సమాచారం. దీంతో పాత సిలబస్‌నే ముద్రిస్తున్నారు.

కొన్ని దశాబ్దాలుగా సీఈసీ, ఎంఈసీ, గ్రూపులకు ఒకే స్థాయి గణితాన్ని అమలుచేస్తున్నారు. మరీ ఎక్కువ స్థాయి గణితం సీఈసీ విద్యార్థులకు అవసరం లేదని భావించిన బోర్డు.. కొత్త విద్యాసంవత్సరం నుంచి మార్చాలని గతంలో నిర్ణయించింది. ఇది కూడా ఈసారి అమలులోకి రావడం లేదు. ప్రత్యేకంగా సీఈఏ గ్రూపును తీసుకురావాలని నిర్ణయించినా.. ఇది కూడా ఈ విద్యాసంవత్సరం అమలుకావడం లేదు.

INTER FIRST YEAR ADMISSIONS : మరోవైపు జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యింది. జూన్‌ 30 నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఇంటర్ బోర్డు మార్గదర్శకాలు ప్రకటించింది. ఒక్కో సెక్షన్‌లో 88 మంది విద్యార్థులు మించరాదని.. అనుమతి లేకుండా అదనపు సెక్షన్లు పెడితే కళాశాల అనుమతి రద్దు చేస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది.

ఇవీ చదవండి:

Last Updated :May 19, 2023, 8:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.