Justice Naveen Rao Telangana HC Incharge Chief Justice : హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పొనుగోటి నవీన్ రావు శుక్రవారం ఒక్కరోజు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆయనకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడంతో... తాత్కాలికంగా అత్యంత సీనియర్ జడ్జి అయిన జస్టిస్ నవీన్రావుకు ఆ బాధ్యతలను అప్పగిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 కింద దఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే జస్టిస్ నవీన్రావు శుక్రవారం పదవీ విరమణ చేయనుండటంతో ఆయన ఈ ఒక్కరోజే ఆ పదవిలో కొనసాగుతారు.
Justice Abhinand Kumar Shavili Telangana HC CJ : ఎల్లుండి నుంచి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని కేంద్ర న్యాయశాఖ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. జస్టిస్ ఉజ్జల్భూయాన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించిన నేపథ్యంలో ఆ స్థానంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధేను సుప్రీంకోర్టు కొలీజియం ఈనెల 5న సిఫార్సు చేసినప్పటికీ.. రాష్ట్రపతి నుంచి నియామక ఉత్తర్వులు రావాల్సి ఉంది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత కుమారిని కర్ణాటక హైకోర్టు జడ్జిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. జస్టిస్ ఉజ్జల్భూయాన్తో పాటు కేరళ హైకోర్టు సీజే జస్టిస్ వెంకట నారాయణ భట్టిని కూడా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించింది.
కొత్త సీజే వచ్చే వరకు జస్టిస్ షావిలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు : కొత్త ప్రధాన న్యాయమూర్తి పదవీ ప్రమాణం చేసేంతవరకూ వరకు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తారు. శుక్రవారం ఒక్కరోజు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను తాత్కాలికంగా నిర్వర్తించనున్న జస్టిస్ పి.నవీన్రావు 1986లో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. 2013 ఏప్రిల్ 12న ఉమ్మడి ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 సెప్టెంబరు 8 నుంచి శాశ్వత న్యాయమూర్తి హోదా పొందారు. ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్న సమయంలోనే 2022 ఏప్రిల్ 22న రావి బియాస్ నదీజలాల ట్రైబ్యునల్ సభ్యుడిగా నియమితులయ్యారు. మరోవైపు శనివారం నుంచి తాత్కాలిక సీజే బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి 1989 ఆగస్టు 31న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2017 సెప్టెంబరు 21న ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఇవీ చదవండి :