ETV Bharat / state

Govt Jobs: ఒకటికి మించి పోస్టులకు ఎంపికైతే.. ప్రభుత్వం పక్కా ప్రణాళిక

author img

By

Published : Mar 14, 2022, 3:16 AM IST

Updated : Mar 14, 2022, 4:40 AM IST

Govt Jobs: ఖాళీలు మిగలకుండా.. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గతంలో అనుసరించిన విధానాల్లో మార్పులు చేయాలని భావిస్తోంది. ఎవరైనా ఒకటికి మించి పోస్టులకు ఎంపికైనా.. ఏదో ఒకటే ఖరారు చేసుకునే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. గడువులోపు చేరకుంటే తదుపరి అర్హులైనవారికి అవకాశం ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించి వివిధ ప్రతిపాదనలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Govt Jobs: ఒకటికి మించి పోస్టులకు ఎంపికైతే.. ప్రభుత్వం పక్కా ప్రణాళిక
Govt Jobs: ఒకటికి మించి పోస్టులకు ఎంపికైతే.. ప్రభుత్వం పక్కా ప్రణాళిక

ఒకటికి మించి పోస్టులకు ఎంపికైతే.. ప్రభుత్వం పక్కా ప్రణాళిక

Govt Jobs: రాష్ట్రంలో ఈసారి ఉద్యోగ నియామకాలను పక్కాగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పోస్టులు మిగలకుండా అన్నింటినీ భర్తీ చేయాలని చూస్తోంది. అభ్యర్థులు గడువులోగా విధుల్లో చేరకపోతే వారిని వదిలేసి ప్రాధాన్య క్రమంలో మిగిలిన అర్హులకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. దీని విధివిధానాలపై కసరత్తు చేస్తోంది.

గత అనుభవాల దృష్ట్యా..

గతంలో వివిధ నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరకపోతే చాలా పోస్టులు ఖాళీగా మిగిలిపోయేవి. వాటిని మిగులు పోస్టులుగా తేల్చి మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు మాత్రమే భర్తీ చేసేవారు. ఒకసారైతే వివిధ పోటీ పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో దాదాపు 500 మందికి పైగా ఒకటికి మించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారు విధుల్లో చేరని కారణంగా వివిధ శాఖల్లో 500 పోస్టులు భర్తీ కాలేదు. అర్హులు ఎందరో ఉన్నా మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చాకే భర్తీ చేయాలని ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది. దీంతో ఆ 500 పోస్టుల్లో ఎవరికీ అవకాశం దక్కలేదు. ఉద్యోగాన్వేషణలో అభ్యర్థులు ఒకటికి మించి పోస్టులకు ప్రయత్నించడం మామూలే. కొందరు రెండు, మూడు పోస్టులకు ఎంపికవుతుంటారు. చివరకు నచ్చిన పోస్టును ఎంచుకొని, మిగిలిన వాటిని వదిలేస్తారు. దీంతో అవన్నీ ఖాళీగా ఉండిపోతున్నాయి. ఆశావహులైన నిరుద్యోగులు తర్వాతి నోటిఫికేషన్‌ వరకు ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిని నివారించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులకు సూచించింది. అధికారులు పరిష్కార మార్గాలను పరిశీలిస్తున్నారు.

అధికారులు మరింత కసరత్తు చేసి నోటిఫికేషన్లలోని పోస్టులు ఏ మాత్రం మిగలకుండా చూడడం కోసం మరికొన్ని ప్రతిపాదనలు కూడా రూపొందించనున్నారని తెలుస్తోంది. వాటిలో మెరుగైన విధానాన్ని ఖరారు చేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది.

ఏ పోస్టులకు వెళ్తున్నారో ఆరా..

ప్రస్తుతం రాతపరీక్షల సమయంలో అభ్యర్థులు ఇప్పటికే ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారా అనే సమాచారం తీసుకుంటారు.అభ్యర్థుల పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఎవరు ఏయే పరీక్షలు రాస్తున్నారో తెలుసుకుంటారు. తర్వాత ఒకటి మించి ఉద్యోగాలకు ఎంపికైన వారిని గుర్తించి వారు ఏ పోస్టులో చేరాలనుకుంటున్నారో, దేనిని వదిలేస్తారో ఆరా తీస్తారు. వారు వదిలిపెట్టిన పోస్టులకు జాబితాలో ఉన్న తర్వాతి అర్హులకు అవకాశం ఇస్తారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సమాధానం ఇవ్వకుండా గడువులోగా నియామక ఉత్తర్వులు తీసుకోకుంటే వారికి ఏదో ఒకచోట పోస్టింగ్‌ ఖరారు చేసి మిగిలిన వాటి నుంచి మినహాయిస్తారు.

కేరళ, తమిళనాడు విధానం

కేరళ, తమిళనాడుల్లో పోస్టులు మిగిలిపోకుండా.. అర్హుల జాబితాలోని తర్వాతి వారికి అవకాశమిచ్చి నోటిఫికేషన్‌లలోని పోస్టులన్నీ భర్తీ చేస్తున్నారు. రాతపరీక్షల అనంతరం ఎంపికైన అభ్యర్థులకు వెంటనే ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. దీనికి హాజరయ్యే అభ్యర్థులకు మాత్రమే పోస్టింగ్‌ ఖరారు చేస్తారు. అదే ఉద్యోగం అతను/ఆమెకు ఖరారవుతుంది. మిగిలిన వాటికి అర్హత (ఎలిమినేషన్‌) కోల్పోతారు. ఎవరైనా రాని పక్షంలో వరస క్రమంలో అర్హులైనవారికి అవకాశమిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఎంసెట్‌ కౌన్సెలింగ్‌, కేంద్రంలో నీట్‌ కౌన్సెలింగ్‌ ఇదే తరహాలో సాగుతున్నాయి.

ఇదీ చదవండి:

Last Updated :Mar 14, 2022, 4:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.