ETV Bharat / state

Telangana Assembly Elections 2023 : శాసనసభ ఎన్నికల కసరత్తు వేగవంతం.. ఆ విషయాలపై ఈసీ ఆరా

author img

By

Published : Jul 7, 2023, 9:05 AM IST

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల కసరత్తు కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో ఇంటింటి పరిశీలన ముమ్మరంగా జరుగుతోంది. సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 21న ముసాయిదా జాబితా ప్రకటించాల్సి ఉంది. ఈవీఎంల తనిఖీ ప్రక్రియ.. ఒకటి, రెండు రోజుల్లో పూర్తి కానుంది. త్వరలో జిల్లాల వారీగా అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.

telangana election
telangana election

శాసనసభ ఎన్నికల కసరత్తు వేగవంతం

Telangana Assembly Elections Exercise 2023 : కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం పర్యటన అనంతరం శాసనసభ ఎన్నికల కసరత్తు వేగవంతమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన సన్నాహాకాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ ప్రతినిధి బృందం.. కొన్ని జిల్లాల్లో మాత్రం ప్రక్రియను ఇంకా వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సంబంధిత ప్రక్రియను వేగవంతం చేశారు.బీఎల్‌ఓల ద్వారా ఇంటింటి పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ఆరుగురికిపైగా ఉన్న ఓటర్ల ఇళ్లు అన్నింటినీ ఖచ్చితంగా బీఎల్‌ఓలు సందర్శించి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని నివేదించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

అందుకు అనుగుణంగా బీఎల్‌ఓల ఇంటింటి పరిశీలన పూర్తైనట్లు సమాచారం. కొన్ని జిల్లాల నుంచి ఇంకా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి వివరాలు అందాల్సి ఉన్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను రెండోసారి చేపట్టింది. ఇందుకోసం గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ను ఈసీ సవరించింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 21న ముసాయిదా జాబితాను ప్రకటించాల్సి ఉంది. ఇందుకోసం కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల పక్రియ కొనసాగుతోంది. అక్టోబరు ఒకటో తేదీ వరకు 18 ఏళ్లు నిండే వారందరూ ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.

Telangana Assembly Elections Exercise : ముసాయిదాపై సెప్టెంబరు తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలు, వినతులకు గడువు ఇచ్చారు. వాటన్నింటిని పరిష్కరించి తుది జాబితా సిద్ధం చేసి అక్టోబరు నాలుగో తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటించాల్సి ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తనిఖీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. రానున్న ఎన్నికలకు హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐఎల్‌ తయారు చేసిన కొత్త ఈవీఎంలను వినియోగించనున్నారు. ఈ యంత్రాలకు సంబంధించిన ఫస్ట్ లెవల్ చెకింగ్ - ఎఫ్‌ఎల్‌ఏ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ఒకటి, రెండు రోజుల్లో పూర్తి కానుంది. అటు ఎన్నికల విధులు, నిర్వహణకు సంబంధించి అధికారులకు శిక్షణ ప్రక్రియ దశ కొనసాగుతోంది.

రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్లకు రెండో విడత శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ అనంతరం వారి ద్వారా జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత తదుపరి స్థాయిలో శిక్షణ ఉంటుంది. ఇటీవల ఎన్నికలు జరిగిన కర్ణాటకలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నేతృత్వంలోని బృందం త్వరలో పర్యటించనుంది. సీఈఓతో పాటు ఇటీవలే కొత్తగా విధుల్లో చేరిన అదనపు ప్రధాన ఎన్నికల అధికారి, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర అధికారుల బృందం అక్కడ పర్యటించి ఎన్నికల నిర్వహణా విధానంపై అధ్యయనం చేయనుంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.