ETV Bharat / state

వివేకా హత్య కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ అంశం.. సుప్రీం తీర్పు వాయిదా

author img

By

Published : Nov 14, 2022, 4:13 PM IST

supreme
supreme

YS Viveka Murder Case Update: మాజీ మంత్రి వైఎస్​ వివేకా హత్య కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అంశంపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. ధర్మాసనంలోని మరో జడ్జి అందుబాటులో లేనందున.. ఇవాళ తీర్పు ఇవ్వలేదని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ప్రకటించారు.

YS Viveka Murder Case Update: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ బదిలీపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. కేసు విచారణను ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి.. బదిలీ చేయాలని వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నిర్ణయం వెలువరించనున్నట్లు.. జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం ప్రకటించింది. ధర్మాసనంలోని మరో జడ్జి అందుబాటులో లేనందున.. ఇవాళ తీర్పు ఇవ్వలేదని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ప్రకటించారు. మరోవైపు ఈ కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పైనా విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

ఇదీ జరిగింది: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో సీబీఐ కీలక విషయాలను పేర్కొంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న డి. శివశంకర్‌రెడ్డిని 2021 నవంబర్ 18న పులివెందులలో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినప్పుడు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కోర్టు గదిలోకి ప్రవేశించి కేసు దర్యాప్తు అధికారిని అడ్డుకున్నారని సీబీఐ తెలిపింది. పెద్దఎత్తున అనుచరులను వెంటేసుకొని.. కోర్టు ప్రాంగణంలోకి వచ్చి నిందితుల్లో ఎ-5గా ఉన్న శివశంకర్​రెడ్డికి అవినాష్‌ మద్దతు పలికినట్లు అఫిడవిట్‌లో సీబీఐ వివరించింది. శివశంకర్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశావని దర్యాప్తు అధికారిని ప్రశ్నించినట్లు వెల్లడించింది.

దర్యాప్తు బృందం కోర్టు నుంచి బయటికి వెళ్లే సమయంలో అవినాష్‌రెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారని.. అఫిడవిట్‌లో తెలిపింది. డి. శివశంకర్ రెడ్డి జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే కడప సెంట్రల్ జైలు నుంచి రిమ్స్ ఆసుపత్రికి తరలించారని వివరించింది. ఈ అంశంపై 2021 నవంబర్ 25న పులివెందుల జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తీవ్రంగా స్పందించారని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ జైళ్ల నిబంధనలు 1979ని ఉల్లంఘిస్తూ.. శివశంకర్‌ రెడ్డిని ఆసుపత్రికి ఎందుకు తరలించాల్సి వచ్చిందో వివరణ కోరుతూ జైలు సూపరిండెంట్‌కు షోకాజ్ నోటీసు జారీశారని తెలిపింది. కేసులో ఒక సాక్షి శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని మరో సాక్షి గంగాధర్‌ రెడ్డి కూడా చనిపోగా... పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారని సీబీఐ పేర్కొంది. ఈ మేరకు 278 పేజీల అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించింది.

మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డిని ఎంపీ అవినాష్‌ రెడ్డి తన అనుచరుడు డి. శివశంకర్ రెడ్డి ద్వారా చంపించినట్లు అనుమానాలు ఉన్నాయని సీబీఐ పేర్కొంది. దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి బెయిల్ పిటిషన్‌ తిరస్కరిస్తూ..కడప స్పెషల్ సెషన్స్ జడ్జి 2021 డిసెంబర్ 21న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలిపింది. ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌కు సీబీఐ జత చేసింది.

కడప ఎంపీ టికెట్‌ అవినాష్‌ రెడ్డికి బదులు తనకుకానీ, వైఎస్ షర్మిలకు కానీ, వైఎస్ విజయమ్మకు కానీ ఇవ్వాలని వివేకానందరెడ్డి కోరినట్లు దర్యాప్తులో తెలిసిందని, దాంతో ఎంపీ అవినాష్‌రెడ్డి... తన అనుచరుడు శివశంకర్ రెడ్డి ద్వారా ఆయన్ను చంపించి ఉంటారని దర్యాప్తు సంస్థ అనుమానం వ్యక్తం చేసిందని కడప కోర్టు ఉత్తర్వుల్లో తెలిపింది. నికార్సైన నిజాన్ని వెలికి తీయడానికి రాజకీయ ప్రాబల్యం ఉన్న శివశంకర్‌రెడ్డిని మరింత కాలం నిర్బంధంలో ఉంచాల్సి ఉంటుందని కడప కోర్టు నాటి ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులను సీబీఐ తన అఫడవిట్‌కు జతచేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.