ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ఈనెల 17న విచారణకు సుప్రీం గ్రీన్​సిగ్నల్

author img

By

Published : Feb 8, 2023, 11:07 AM IST

Updated : Feb 8, 2023, 12:43 PM IST

Supreme Court
Supreme Court

11:02 February 08

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈనెల 17న విచారణ జరపనున్న సుప్రీంకోర్టు

MLAs Poaching Case Updates: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు గురించి సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం వద్ద రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైకోర్టు ఉత్తర్వులపై ‘స్టే’ విధించాలని.. లేదా ‘స్టేటస్‌ కో’ ఇవ్వాలని ఆయన కోరారు.

ఫైల్‌ ఒకసారి సీబీఐ చేతికి వెళ్తే పిటిషన్‌ నీరుగారిపోతుందని సీజేఐకు తెలిపారు. ఫైల్స్‌ ఇవ్వాలని ఇప్పటికే సీబీఐ నుంచి ఒత్తిడి ఉందన్నారు. ఈ నేపథ్యంలో స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ స్టే, స్టేటస్‌ కో ఇచ్చేందుకు నిరాకరించారు. కేసుపై ఈనెల 17న విచారణ చేపడతామని.. ఆరోజే అన్ని అంశాలనూ పరిశీలిస్తామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. కేసులో మెరిట్స్‌ ఉంటే ఇచ్చిన డాక్యుమెంట్లను వెనక్కి ఇవ్వాలని సీబీఐను ఆదేశిస్తామని తెలిపింది.

BRS MLAs Poaching Case News: కేసు తీవ్రత దృష్ట్యా 17వ తేదీ కంటే ముందే విచారణ చేపట్టాలని.. దానికి ఉన్న అవకాశాలను పరిశీలించాని న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. 17నే విచారణ చేపడతామని సీజేఐ ధర్మాసనం మరోసారి స్పష్టం చేసింది. మరోవైపు హైకోర్టులోనూ దీనిపై విచారణ జరిగింది. తీర్పు ఆపాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నిరాకరించారు.

కేసు దస్త్రాల కోసం సీబీఐ ఒత్తిడి చేస్తోందని.. సింగిల్‌ జడ్జి వద్ద విచారణకు అనుమతి ఇవ్వాలని అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ కోరారు. కేసు ఫైల్స్‌ ఇవ్వాలని సీఎస్‌కు మంగళవారం సీబీఐ మరోసారి లేఖ రాసిందని చెప్పారు. డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చాక మళ్లీ సింగిల్‌ జడ్జి విచారణ జరపకూడదని.. సుప్రీంకోర్టు మాత్రమే దీనిపై సమీక్ష చేస్తుందని సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వీడియోలను, వివరాలను బయటపెట్టారన్న ఒకే ఒక కారణంతో కేసును సీబీఐకి అప్పగించడం తగదని దవే వాదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్​పై నమ్మకం లేదని నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న సీజే ధర్మాసనం గత నెల 30న తీర్పుని రిజర్వ్ చేసింది. ఈ కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే సమర్థిస్తుందా? లేకపోతే సిట్ దర్యాప్తు కొనసాగించాలని ఆదేశిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది.

సీబీఐకి అప్పగించిన హైకోర్టు: ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు పట్ల నమ్మకం లేదని బీజేపీ, నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి వేసిన పిటిషన్లు పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు కేసును సీబీఐకి అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని సిట్‌ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో పురోగతి ఉన్నందున సిట్‌తో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. అయితే, అడ్వకేట్‌ జనరల్‌ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది.

అసలేంటీ కేసు: గత సంవత్సరం అక్టోబర్‌ 26న హైదరాబాద్‌ శివారులోని మెయినాబాద్‌లో బీఆర్​ఎస్​కు చెందిన ఎమ్మెల్యేల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీలో చేరాలంటూ తనతో పాటు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావులను కొందరు ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ అక్టోబర్‌ 26న తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొయినాబాద్‌ పోలీసులు బేరసారాలకు జరుగుతున్న ఫాంహౌజ్‌పై దాడులు నిర్వహించారు.

ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను అదే రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ నేతృత్యంలో ఏర్పాటైన సిట్‌.. న్యాయస్థానం అనుమతితో నిందితులను పలుమార్లు కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఈ క్రమంలోనే లభించిన ఆధారాలతో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌తో పాటు కేరళకు చెందిన తుషార్‌, జగ్గుస్వామిని విచారించేందుకు నోటీసులు జారీచేసింది.

ఈ నేపథ్యంలో వారు హైకోర్టును ఆశ్రయించటంతో వీరికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నోటీసులతో స్టే విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజిలు బెయిల్‌ కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా పలు దఫాలుగా విచారణ జరిపిన న్యాయస్థానం.. అనంతరం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు పట్ల నమ్మకం లేదంటూ ఈ కేసు నిందితులతో పాటు బీజేపీతో పాటు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారించిన ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

ఇవీ చదవండి:

Last Updated :Feb 8, 2023, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.