CM KCR: అఖిలపక్షంగా దిల్లీ వెళ్దాం.. 'పోడు'పై ప్రధానిని కలుద్దాం...

author img

By

Published : Oct 2, 2021, 7:04 AM IST

CM KCR

పర్యావరణానికి పరిణమిస్తున్న ముప్పు, వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా.... హరితహారం నిరంతరం కొనసాగాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) పేర్కొన్నారు. ఇందుకోసం నిధుల సమీకరణ ఎంతో ముఖ్యమన్న ఆయన.... హరితహారానికి తోడుగా రాష్ట్రంలో 'హరితనిధి'ని (haritha nidhi) ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా 'పోడు'పై ప్రధానిని కలుద్దామని తెలిపారు.

గోబీ ఎడారిలో గ్రేట్‌ గ్రీన్‌వాల్‌ ఆఫ్‌ చైనా పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద బృహత్‌ యజ్ఞం జరుగుతోంది. బ్రెజిల్‌లో అమెజాన్‌ అడవుల పరిరక్షణ కోసం మరో భారీ ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మూడో అతిపెద్ద ప్రయత్నంగా తెలంగాణ హరితహారం అని ఐక్యరాజ్యసమితి కితాబు ఇచ్చింది

ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు ఇస్తామని మా పార్టీ ఎక్కడా చెప్పలేదు.

‘పంచాయతీలకు రావాల్సిన నిధులను రాష్ట్ర ఖజానాకు రప్పించి అక్కడి నుంచి ఠంచనుగా నెలవారీగా విడుదల చేస్తున్నాం . సెప్టెంబరు నిధులను కూడా విడుదల చేశాం. 60వ నంబరు జీవోను జారీ చేశాం. ఆ జీవో నిధుల మళ్లింపునకు కాదు. పంచాయతీలన్నింటికీ సమ న్యాయం చేసేందుకే.

- కేసీఆర్‌

తెలంగాణలో పోడు భూముల సమస్యకు పరిష్కారం లభించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఈ విషయంపై మంత్రి సత్యవతి రాథోడ్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉపసంఘం నివేదిక ఇచ్చిన తర్వాత స్పష్టత వస్తుందన్నారు. అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో అవసరమైతే ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేద్దామని ప్రకటించారు. వీలైతే ప్రస్తుత సమావేశాలు ముగిసేలోపే తీర్మానం చేద్దామన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ‘తెలంగాణలో హరితహారం’ అంశంపై లఘుచర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..‘పోడు సాగుపై ఆధారపడ్డ గిరిజనులకు అన్యాయం చేయడం సరికాదు. అటవీప్రాంతంగా గుర్తించిన భూమిపై యాజమాన్య హక్కులు ఉండవని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

పోడు భూముల వ్యవహారంపై సీఎం కేసీఆర్​ ప్రసంగం

మానవతాదృక్పథంతో గత యూపీఏ ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. 2005 వరకు పోడు వ్యవసాయం చేస్తున్న వారిపై సర్వే చేయించింది. దాని ప్రకారం రాష్ట్రంలో 96,675 మంది గిరిజనులకు 3.08 లక్షల ఎకరాలకు సంబంధించి రికగ్నైజేషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్‌ యాక్ట్‌ (ఆర్‌వోఎఫ్‌ఆర్‌)కింద పట్టాలిచ్చారు. ఈ కటాఫ్‌ తేదీని పెంచితే మరో 6-7 లక్షల ఎకరాలకు పట్టాలివ్వొచ్చు. అయితే ఆదిలాబాద్‌ ప్రాంతంలో మహారాష్ట్ర లంబాడాలు.. ఖమ్మం, వరంగల్‌, ములుగు జిల్లాల్లో ఛత్తీస్‌గఢ్‌ గుత్తికోయలు భూముల్ని ఆక్రమించుకొని పోడు వ్యవసాయం చేస్తున్నారు. వారిని గుర్తించి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది. ఇటీవల కొందరు అటవీ అధికారుల అత్యుత్సాహం వల్ల అక్కడక్కడ తండాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. అలాంటివి పునరావృతం కావొద్దని ఆదేశాలిచ్చాం’ అని వివరించారు.

...

మొక్కల ఉద్యమానికి నాయకత్వం వహించాలని ప్రధానిని కోరా

జీడీపీ, జీఎస్‌డీపీ, వ్యక్తిగత ఆస్తులెన్ని పెరిగినా భవిష్యత్‌ తరాలకు జీవించలేని పరిస్థితి ఇవ్వొద్దని అంతా గుర్తుంచుకోవాలని కేసీఆర్‌ సూచించారు. ‘మొక్కల పెంపకాన్ని ప్రజా ఉద్యమంగా మలచి నాయకత్వం వహించాలని ప్రధానిని కోరా. తెలంగాణ భూభాగంలో 66.25 లక్షల ఎకరాల అటవీభూమి ఉండటం మన అదృష్టం. కానీ గతంలోనే అవి మాయమయ్యాయి. నిజామాబాద్‌ ఇందల్వాయి మొదలు హైదరాబాద్‌ సమీపంలోని నర్సాపూర్‌ వరకు అడవులు కనిపించకుండా పోయాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మూడో రోజే పర్యావరణ పరిరక్షణపై చర్చలు జరిపా. ముఖ్యమంత్రి కార్యాలయంలోకి నిపుణులు భూపాల్‌రెడ్డి, ప్రియాంకవర్గీస్‌ను తీసుకొని ప్రణాళికలు రూపొందించా.అడవిని పునరుజ్జీవింపజేసేందుకు 230 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పంగా పెట్టుకున్నాం. అడవుల్లో 100 కోట్ల మొక్కల లక్ష్యంలో ఇప్పటికే 60.6 కోట్లు నాటాం. అడవుల బయట 120 కోట్ల లక్ష్యం పెట్టుకోగా 162 కోట్లకు చేరుకున్నాం. హెచ్‌ఎండీఏ పరిధిలో 10 కోట్లకు 14.5 కోట్లు దాటాయి. హరితహారం కింద రూ.6,555 కోట్ల వ్యయం చేశాం. ఇప్పుడు ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీ ఉంది. 19,472 ఆవాసాల్లో పల్లె ప్రకృతివనాలు ఏర్పాటయ్యాయి. మండలానికో బృహత్‌ ప్రకృతివనం కోసం 526 స్థలాల్ని గుర్తించాం. వీటిల్లో 7,178 ఎకరాల్లో మొక్కలు నాటుతున్నాం. 109 పట్టణ ప్రాంతాల్లోని 75,740 ఎకరాల్లో అర్బన్‌ పార్కులు ఏర్పాటవుతున్నాయి. అదృష్టవశాత్తు హైదరాబాద్‌లోని 188 రిజర్వ్‌ ఫారెస్ట్‌ బ్లాకుల్లో 1.6 లక్షల ఎకరాల అటవీభూములు అన్యాక్రాంతం కాలేదు. వాటికి రక్షణ కంచెలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోని 1,00,150 కి.మీ.ల రహదారులకు గాను 82,491 కి.మీ.ల పరిధిలో మొక్కల పెంపకం జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 3.67శాతం పచ్చదనం పెరిగింది. ఇదే ప్రణాళికతో 33 శాతం పెంచుతాం’ అని వివరించారు. హరితహారం పెరిగిందని చెబుతూ శాసనసభలో చిత్రాలను ప్రదర్శించారు.

కేసీఆర్​ ప్రసంగం

కంపా నిధులు ముమ్మాటికీ రాష్ట్రాలవే

అడవుల అభివృద్ధి కోసం వినియోగించే కంపా నిధులు ముమ్మాటికీ రాష్ట్రాలవే అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇవి కేంద్రం అధీనంలో ఉంటాయి తప్ప కేంద్రానికి ఎలాంటి హక్కూ లేదన్నారు. తెలంగాణ నుంచి రూ.4,675 కోట్లు జమయ్యాయని వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దేశవ్యాప్తంగా రూ.35 వేల కోట్లు అలాగే ఉండిపోయాయన్నారు. ఆ నిధుల్ని అడవుల అభివృద్ధికే వినియోగించాలనే కఠిన నిబంధన విధించాలని ప్రధానికి సూచించానని తెలిపారు. ఆ నిధుల నుంచి ఇప్పటివరకు రూ.3,109కోట్లు రాష్ట్రానికి తిరిగి వచ్చాయని పేర్కొన్నారు.

అటవీ శాతాన్ని ఇంకా పెంచుతాం

పలువురు సభ్యులు మాట్లాడిన తర్వాత అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమాధానం ఇస్తూ రాష్ట్రంలో హరితహారం 2015 జులైలో ప్రారంభించామని, అప్పటి నుంచి 3.67 శాతం అటవీ విస్తీర్ణం పెరిగిందన్నారు. పట్టణాలు, నగరాల్లో 53 పార్కులను పూర్తి చేశామని తెలిపారు.

- మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

‘హరితనిధి’ సమీకరణకు ప్రణాళిక

మొక్కల్ని పెంచడమే కాకుండా వాటిని నిరంతరం కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని కేసీఆర్‌ పేర్కొన్నారు. అందుకోసమే ‘తెలంగాణ హరితనిధి’ ఏర్పాటు చేసి నిధుల సమీకరణకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ నిధికి రాష్ట్రంలోని అఖిలభారత సర్వీసు అధికారులు తమ వేతనం నుంచి ప్రతినెలా రూ.100 చొప్పున.. ఉపాధ్యాయ, ఉద్యోగులు రూ.25 చొప్పున ఇచ్చేందుకు అంగీకరించారని వెల్లడించారు. భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలో ఒక్కో రిజిస్ట్రేషన్‌కు రూ.50 చొప్పున, వ్యాపార లైసెన్స్‌ల పునరుద్ధరణ సమయంలో రూ.వెయ్యి చొప్పున, కాంట్రాక్టు పనుల్లో 0.1శాతం చొప్పున, విద్యాసంస్థల్లో అడ్మిషన్‌ సమయంలో ప్రాథమిక విద్యార్థుల నుంచి రూ.5, ఉన్నత విద్యార్థుల నుంచి రూ.10, ఇంటర్‌ విద్యార్థుల నుంచి రూ.25, డిగ్రీ విద్యార్థుల నుంచి రూ.50, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ విద్యార్థుల నుంచి రూ.100 చొప్పున తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. డబ్బులెంత ఇచ్చామన్నది ముఖ్యం కాదని.. ఈ బృహత్‌కార్యంలో తమ పాత్ర ఉందని ప్రతి ఒక్కరూ అనుకోవాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతి నెలా తమ వేతనం నుంచి రూ.500 ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇందుకు విపక్ష పార్టీలు ఆమోదం తెలిపాయి. ఈ నిధి ద్వారా హరితహారాన్ని నిరంతరం కొనసాగించుకోవచ్చన్నారు. విరాళాలిచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని కోరారు. హరితభావజాల వ్యాప్తికి కృషి చేస్తున్నారంటూ ఎంపీ సంతోష్‌ను ప్రశంసించారు.

‘పోడు’ రైతుల పొట్టకొట్టొద్దు : సీతక్క

...

అంతకు ముందు హరితహారంపై చర్చలో భాగంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ గతంలో ప్రభుత్వమే పేదలు, గిరిజన రైతులకు భూములిచ్చిందని, హరితహారం అంటూ ఇప్పుడు లాక్కొని మొక్కలు నాటుతున్నారన్నారు. ఎక్కడైనా ప్రాజెక్టుల కింద అటవీ భూములు పోతే వాటి బదులు గిరిజన పల్లెల్లో మొక్కలు నాటుతున్నారని తెలిపారు. పోడు భూములు తీసుకొని రైతుల పొట్టకొట్టొద్దన్నారు. ఆదివాసీల కోసం 2006లో తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టం ప్రకారం వారి భూములను వదిలేయాలని కోరారు. భాజపా సభ్యుడు రఘునందన్‌రావు మాట్లాడుతూ పోడు భూములున్న చోట సాదాసీదా మొక్కలు కాకుండా సుగంధ ద్రవ్యాలు, పండ్ల మొక్కలను రైతులే పండించేలా ప్రోత్సహిస్తే అటు పచ్చదనం, ఇటు ఆర్థికంగా ప్రయోజనం ఉంటుందన్నారు. గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో ఆకాశ హర్మ్యాలు భారీగా వస్తున్నాయని, వాటిల్లో భవనాలు తప్ప చెట్లు ఉండటం లేదని, దానిపై ఓ విధానాన్ని రూపొందించాలని కోరారు. రాష్ట్రంలో నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయో గణాంకాలు ఇవ్వాలని, తప్పుడు లెక్కలిచ్చే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో నెలకొన్న పోడు లాంటి సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపాలని సీఎంను కోరారు. కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌, యాకుత్‌పుర ఎమ్మెల్యే పాషా ఖాద్రీ కూడా మాట్లాడారు. హరితహారం కొనసాగించేందుకు కాంగ్రెస్‌ ముందుంటుందని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత భట్టివిక్రమార్క పేర్కొన్నారు. 6-7లక్షల ఎకరాల పోడుభూములకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలిచ్చే విషయంలోనూ అసెంబ్లీలో తీర్మానం చేద్దామన్నారు. హరితనిధి ఏర్పాటును స్వాగతిస్తున్నామని భాజపా పక్షనేత రాజాసింగ్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: KCR Speech in Assembly 2021: ఏకగ్రీవ పంచాయతీలకు నిధులిస్తమని మేమెప్పుడు చెప్పినం: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.