ETV Bharat / state

'రవాణా సంస్థల్లో స్క్రీనింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేయండి'

author img

By

Published : Mar 6, 2020, 5:11 AM IST

Updated : Mar 6, 2020, 7:05 AM IST

'రవాణా సంస్థల్లో స్క్రీనింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేయండి'
'రవాణా సంస్థల్లో స్క్రీనింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేయండి'

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మురికివాడలపై మరింత ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మురికి వాడల్లోని పేదలకు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా మాస్క్​లు, సెన్సిటైజర్లు పంపిణీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది.

'రవాణా సంస్థల్లో స్క్రీనింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేయండి'

కరోనా వైరస్ మురికివాడల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాపై బుధవారం సిద్ధలక్ష్మి అనే మహిళ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం గురవారం మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్ర ఐపీఎం సంచాలకుడు డాక్టర్ శంకర్ హైకోర్టుకు హాజరై.. ప్రభుత్వ చర్యలను వివరించారు. ప్రభుత్వం అన్ని విధాల పటిష్టమైన చర్యలు చేపట్టిందని వివరించారు. ప్రస్తుతం గాంధీ, టీబీ, ఛాతీ, ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స వసతులు ఉన్నాయని.. మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, సూర్యాపేట, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, రామగుండంలో కూడా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వైద్య సిబ్బందికి సోకకుండా పర్సనల్ ప్రివెంటివ్ ఎక్విప్ మెంట్ సమకూర్చినట్లు శంకర్ తెలిపారు.

ఉచితంగా మాస్క్​లు, సెన్సిటైజర్లు..!

కరోనా వైరస్​ మురికివాడల్లో ఎక్కువగా ప్రబలే ప్రమాదం ఉన్నందున వాటికి సమీపంలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు తెలిపింది. మాస్క్‌లు, సెన్సిటైజర్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు.. వాటిని ప్రజలకు ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. మురికివాడల్లో పేదలకు రేషన్ దుకాణాల ద్వారా మాస్క్​లు, సెన్సిటైజర్లు ఉచితంగా పంపిణీ చేసే అంశం పరిశీలించాలని పేర్కొంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ కేంద్రం ఏర్పాటు చేశామని.. ఇప్పటి వరకు 18 వేల 224 మందికి పరీక్షలు జరిపినట్లు ఏజీ తెలిపారు. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి బెంగళూరు నుంచి హైదరాబాద్​కు బస్సులో వచ్చిన విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. దేశంలో ఎక్కువగా రైళ్లు, బస్సుల్లోనే ప్రయాణిస్తారు కాబట్టి.. ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కూడా స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది.

కేరళ ప్రభుత్వ చర్యలు పరిశీలించండి:

కేరళలో కరోనా వెలుగు చూసినప్పుడు అక్కడి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అభినందించిందని అమికస్ క్యూరీ నిరంజన్ రెడ్డి తెలిపారు. కేరళ చేపట్టిన చర్యలను పరిశీలించాలని హైకోర్టు పేర్కొంది. పది మంది వైద్యుల బృందాన్ని కేరళకు పంపనున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనాపై ప్రభుత్వ చర్యలను తాము సమీక్షిస్తామని.. ఈనెల 12న నివేదిక సమర్పించాలని హైకోర్టు సర్కారును ఆదేశించింది.

ఇవీ చూడండి: ఏ పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల

Last Updated :Mar 6, 2020, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.