ఉద్యోగాల నియామక పురోగతిపై ఇక నుంచి ప్రతి వారం ప్రభుత్వం సమీక్ష

author img

By

Published : Sep 1, 2022, 7:26 AM IST

రాష్ట్ర ప్రభుత్వం

ఉద్యోగాల నియామక ప్రక్రియ పురోగతిని రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి ప్రతి వారం సమీక్షించనుంది. ఆలస్యం చేయకుండా దశల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసేలా అవసరమైన చర్యలు తీసుకోనుంది. అనుమతులు, నోటిఫికేషన్లు సహా పురోగతిని ప్రతి సోమవారం నివేదించాలని సాధారణ పరిపాలనా శాఖను ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు ఆదేశించారు.

రాష్ట్రంలో భారీ ఎత్తున ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. వివిధ శాఖల్లో 80 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 52,460 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో గ్రూప్-1, పోలీసు ఉద్యోగాలు, వైద్య, ఆరోగ్య శాఖలోని ఉద్యోగాలు సహా ఇతరత్రా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేశారు.

ఆయా ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖల్లో నియామకాల ప్రక్రియ వేగంగా సాగుతోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా తేదీని కూడా పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ప్రభుత్వం అనుమతులు జారీ చేసినంత వేగంగా నోటిఫికేషన్లు విడుదల కావడం లేదన్న భావన ఉంది. ఉద్యోగాల నియామక పురోగతిపై ఇటీవల ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు నిర్వహించిన సమీక్షలో ఈ విషయమై చర్చ జరిగింది.

అనుమతుల పరంగా ప్రక్రియ పూర్తైనప్పటికీ నోటిఫికేషన్ల జారీ ఆలస్యం ఎందుకని మంత్రి ప్రశ్నించారు. సంబంధిత అధికారులపై ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండి అనుమతులు ఇచ్చినప్పటికీ నోటిఫికేషన్లలో ఆలస్యం తగదని స్పష్టం చేశారు. వైద్య, ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. అనుమతులకు అనుగుణంగా చేయాల్సిన సవరణలు, మార్పులను పూర్తి చేసి నోటిఫికేషన్లు జారీ చేశారు.

ఇదే తరహాలో మిగతా అన్ని శాఖలూ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. నియామక సంస్థలు నోటిఫికేషన్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. ఉద్యోగాల నియామక ప్రక్రియ పురోగతిపై ఇక నుంచి ప్రతి వారం సమీక్షించాలని నిర్ణయించారు. అనుమతులు, సవరణలు, నోటిఫికేషన్ల జారీ సంబంధిత ప్రక్రియపై ప్రతి వారం నివేదిక ఇవ్వాలని సాధారణ పరిపాలనా శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ ప్రక్రియను వేగవంతం చేసి దశలవారీగా నోటిఫికేషన్లు జారీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులకు కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా సంబంధిత నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఇంజినీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

ఇవీ చదవండి: 2,910 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్

'గణేశ్'​ మ్యూజియంలా ఇల్లు.. 600 విగ్రహాలు సేకరించిన భక్తుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.