ETV Bharat / state

స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్​తో.. ఇక​ నకిలీ ధ్రువపత్రాలకు చెక్​

author img

By

Published : Nov 18, 2022, 4:00 PM IST

ఇక నుంచి నకిలీ ధ్రువపత్రాలకు చెక్​..
ఇక నుంచి నకిలీ ధ్రువపత్రాలకు చెక్​..

రాష్ట్రంలో నకిలీ ధ్రువపత్రాల చలామణికి తెరపడనుంది. ఇక్కడ ఉన్న ప్రభుత్వ వర్సిటీల పేరిట నకిలీవి ముద్రించి ఉన్నత చదువులు చదవాలన్నా.. కొలువులు పొందాలన్నా సాధ్యపడదు. వాటిని సులభంగా.. వేగంగా గుర్తించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నేటి నుంచి ఆన్‌లైన్‌ స్టూడెంట్‌ అకడమిక్‌ వెరిఫికేషన్‌ సర్వీస్‌ (ఎస్‌ఏవీఎస్‌) సావ్స్​ను అందుబాటులోకి తెచ్చింది.

వ్యవసాయంలో నకిలీ విత్తనాలు.. విద్యావ్యవస్థలో నకిలీ ధ్రువపత్రాలకు అడ్డుకట్ట వేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. విద్యాశాఖ తీసుకువచ్చిన స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ పోర్టల్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి అధికారులు, వీసీలతో కలిసి మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు.

2010 నుంచి 2021 వరకు అన్ని విశ్వవిద్యాలయాలకు చెందిన వివిధ కోర్సుల పట్టాలన్నింటిని ఈ పోర్టల్‌లో ఉంచనున్నారు. గత 12 ఏళ్లలో సర్టిఫికెట్లు పొందిన విద్యార్థుల డాటాను ఇందులో నిక్షిప్తం చేశారు. అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేస్తే.. సర్టిఫికెట్ అసలుదో.. నకిలీదో తెలుసుకునేలా అవకాశం ఉంటుంది. పోర్టల్‌ను పటిష్ఠంగా అమలుచేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి, డీజీపీ తెలిపారు.

గుర్తించేది ఇలా: రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలిచ్చే డిగ్రీ, పీజీ, బీటెక్‌, అగ్రికల్చర్‌, ఎంబీబీఎస్‌, ఎంబీఏ తదితర అన్ని రకాల సర్టిఫికెట్లను ఒక పోర్టల్‌లోకి తెచ్చి నకిలీ పట్టాలకు తెరదించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి గత ఏడాది కాలంగా పోలీసుశాఖతో కలిసి పనిచేస్తోంది.

అసలా? కాదా? అని తెలుసుకోవడానికి ఎటువంటి ఫీజు ఉండదు. మార్కుల శాతం, ఇతర వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం ఆన్‌లైన్‌లోనే కొంత రుసుము చెల్లించాలి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(టీఎస్‌సీహెచ్‌ఈ) వెబ్‌సైట్‌ ద్వారా దేశ విదేశాల్లోని వర్సిటీలు, ఉద్యోగాలిచ్చే కంపెనీలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని మండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు.

ఇతర రాష్ట్రాల్లోని వర్సిటీలు నిర్ధారిస్తేనే: ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ వర్సిటీల పట్టాల్లో నకిలీ వాటిని గుర్తించడం మాత్రం వీలుకాదు. వాటి గురించి తేల్చాలంటే మళ్లీ ఆయా విశ్వవిద్యాలయాలకు లిఖితపూర్వకంగా రాసి.. వివరాలు పంపితే వారు నిర్ధారిస్తారు. అయితే ఇతర రాష్ట్రాల వారిని అడిగినా పట్టించుకోవడం లేదు.

ఒకవేళ స్పందించినా తీవ్ర జాప్యం చేస్తున్నాయి. అంతేకాకుండా ఇంజినీరింగ్‌, ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో పనిచేసే అధ్యాపకుల్లో వందల మంది రాజస్థాన్‌, మరికొన్ని ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేట్‌ వర్సిటీల నుంచి ఒక్క ఏడాదిలోనే పీహెచ్‌డీ పట్టాలు పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి.

అందుకు ఆ విశ్వవిద్యాలయాలకు రూ.2-5 లక్షల వరకు మధ్యవర్తుల ద్వారా చెల్లిస్తున్నారు. రికార్డుల్లో మాత్రం నాలుగైదు సంవత్సరాల క్రితమే పీహెచ్‌డీలో చేరినట్లు చూపుతున్నారు. అలాంటి పీహెచ్‌డీ పట్టాలిచ్చే సందర్భాల్లో వర్సిటీల హస్తం ఉన్నందున అవి అసలు పట్టాలేనని ధ్రువీకరిస్తాయి. అలాంటి సందర్భాల్లో నకిలీ అని గుర్తించడం కష్టం.


ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.