ETV Bharat / state

'దశలవారీగా సాధారణ రైళ్లను నడిపిస్తాం'

author img

By

Published : Sep 23, 2020, 7:57 PM IST

south central railway gm gajanan mallya we will run regular trains
'దశలవారీగా సాధారణ రైళ్లను నడిపిస్తాం'

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం సాధారణ రైళ్లను దశలవారీగా నడిపిస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. ఇప్పటికే సబర్బన్ రైళ్లను సిద్దంగా ఉంచామని.. రైల్వే శాఖ నుంచి అనుమతులు రాగానే వాటిని అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం సాధారణ రైళ్లను దశలవారీగా నడిపిస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. ఇప్పటికే సబర్బన్ రైళ్లను సిద్దంగా ఉంచామని.. రైల్వే శాఖ నుంచి అనుమతులు రాగానే వాటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. లాక్​డౌన్ సమయంలో చేపట్టిన కార్యక్రమాలను దృశ్య మాధ్యమం ద్వారా రైల్ నిలయం నుంచి మాల్యా వివరించారు.

గమ్య స్థానాలకు

జూన్ 30 నాటికి దక్షిణ మధ్య రైల్వే 246 శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా 3,13,534 మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చామన్నారు. తెలంగాణలో 14 రైల్వే స్టేషన్ల నుంచి 151 రైళ్లను నడిపి 1,87,303 మంది ప్రయాణికులను చేరవేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లో 15 రైల్వే స్టేషన్ల నుంచి 74 రైళ్లను నడిపించి 89,971 మంది ప్రయాణికులు.. మహారాష్ట్రలో 3 రైల్వే స్టేషన్ల నుంచి 18 రైళ్లను నడిపించి 23,432 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా పంపించామని చెప్పారు.

ప్రత్యేక శ్రామిక రైళ్లు

వీటితో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక శ్రామిక రైళ్లను నడిపామని వివరాలు వెల్లడించారు. బీహార్​కు 63 రైళ్ల ద్వారా 81,997 మందిని, ఒడిశాాకు 48 రైళ్ల ద్వారా 77,582 మందిని, ఉత్తరప్రదేశ్​కు 51 రైళ్ల ద్వారా 61,517 మందిని, ఝార్ఖండ్​కు 25 రైళ్ల ద్వారా 27,338 మందిని, బెంగాల్​కు 14 రైళ్ల ద్వారా 20,156 మందిని, మధ్యప్రదేశ్​కు 13 రైళ్లను నడిపి 13,216 మందిని, రాజస్థాన్​కు 10 రైళ్లను నడిపి 9,847 మందిని, మణిపూర్​కు 4 రైళ్లను నడిపించి 5,517 మందిని, చత్తీస్​ఘడ్​కు 4 రైళ్ల ద్వారా 4,949 మందిని, ఉత్తరాఖండ్​కు ఒక రైలును నడిపించి 1,180 మందిని, మిజోరాంకు ఒక రైలును నడిపించి 1,143 మందిని, జమ్మూ కశ్మీర్​కు ఒక రైలును నడిపి 983 మందిని, త్రిపురకు ఒక్క రైలును నడిపించి 975 మందిని, అసోంకు ఒక రైలును నడిపించి 968 మందిని సురక్షితంగా చేరవేశామన్నారు.

రోజుకి 35 వేల మంది

ప్రత్యేక ప్రయాణికుల రైళ్లను నాలుగు దశల్లో నడిపించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అన్నారు. మే 12, జూన్ 1, 12, సెప్టెంబర్ 20 తేదీల్లో ఆ రైళ్లను నడిపించామని పేర్కొన్నారు. 12 జతల ఆర్గనైజింగ్ రైళ్లు, దక్షిణ మధ్య రైల్వే మీదుగా వెళ్లే 16 జతల రైళ్లు నడిపించామని.. వాటి ద్వారా రోజుకి సుమారు 35,240 మంది ప్రయాణించారని చెప్పారు.

నూతన లైన్లు

తెలంగాణలో మనోహరాబాద్-కొత్తపల్లి మధ్య 32 కి.మీల పరిధిలో కొత్త లైన్లు, షాద్​నగర్-గొల్లపల్లి మధ్యలో 30 కి.మీల మధ్యలో డబుల్ లైన్లను, జక్లైర్-మక్తల్ మధ్య 11 కి.మీల కొత్త లైనును అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్​లో పిడుగురాళ్ల-సావల్యపురం మధ్య 46 కి.మీలు కొత్తలైను, జంగల్లపల్లి-చెంగిచెర్ల మధ్యలో 11 కి.మీల డంబ్లింగ్ లైన్, మహారాష్ట్రలో అకోలా-అకోట్ మధ్య 44 కి.మీల గేజ్ మార్పిడి పనులు చేపట్టామన్నారు. భారతీయ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే మూడో అత్యధిక పార్శిల్ లోడింగ్​ను సాధించిందని చెప్పారు. జోన్ పరిధిలో 587 మిల్క్ ట్యాంకర్ల ద్వారా 2.8 కోట్ల లీటర్ల పాలను రవాణా చేశామని వివరించారు. 158 పార్శిల్ ప్రత్యేక రైళ్లను నడిపి సుమారు 39,000 టన్నుల వివిధ వస్తువులను రవాణా చేశామన్నారు.

కిసాన్ రైలు సర్వీసు

రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కల్పించడానికి సెప్టెంబర్ 9న అనంతపూర్-న్యూదిల్లీ మధ్య దక్షిణ భారతదేశపు మొదటి కిసాన్ రైలు సర్వీసును ప్రారంభించామని పేర్కొన్నారు. సరకు రవాణా రైళ్ల సగటు వేగం 24 కి.మీ. నుంచి 51 కి.మీ.కు పెంచామని.. కరోనా మహమ్మారి కాలంలో కూడా ఆహార ధాన్యాల లోడింగ్ రెండు మెట్రిక్ టన్నుల నుంచి 4.3 మెట్రిక్ టన్నులకు పెరిగిందని వివరించారు.

ఇదీ చూడండి : టీఎస్​ బీపాస్​ అమలుకు త్వరలో కార్యాచరణ: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.