SCHOOLS REOPEN: రాష్ట్రంలో తెరచుకోనున్న విద్యాసంస్థలు

author img

By

Published : Sep 1, 2021, 1:43 AM IST

Updated : Sep 1, 2021, 3:04 AM IST

SCHOOLS REOPEN: రాష్ట్రంలో తెరచుకోనున్న విద్యాసంస్థలు
SCHOOLS REOPEN: రాష్ట్రంలో తెరచుకోనున్న విద్యాసంస్థలు ()

రాష్ట్రంలో విద్యా సంస్థలు నేడు తెరుచుకోనున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోదన నేడు ప్రారంభం కానుంది. ప్రత్యక్ష తరగతులకు తప్పనిసరి హాజరు కావాలని విద్యార్థులపై ఒత్తిడి చేయవద్దని హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు స్పష్టం చేశాయి. ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్​లైన్​లో బోధించాలా.. ఆఫ్​లైన్​లోనా అనేది​​ యాజమాన్యాలే నిర్ణయించుకుంటాయి. కాలేజీల్లో మాత్రం ప్రత్యక్ష బోధన మాత్రమే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

కొవిడ్ ప్రభావంతో ఆన్​లైన్ బోధనకే పరిమితమైన రాష్ట్ర విద్యాసంస్థలు నేడు తెరుచుకోనున్నాయి. భిన్నమైన వాదనలు, అభిప్రాయాల మధ్య నేటి నుంచి ప్రత్యక్ష బోధనకు సర్కారు అనుమతించింది. కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన మాత్రమే ఉంటుందని.. ఆన్​లైన్ పాఠాలు ఇక ఉండబోవన్న సర్కారు.. హైకోర్టు ఉత్తర్వులతో కొన్ని మార్పులు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలు నేటి నుంచి తెరుచుకోవడం లేదు. మిగతా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నేడు బడి గంట మోగనుంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్​లైన్​లో బోధించాలా.. ప్రత్యక్ష బోధన ప్రారంభించాలా అనే నిర్ణయం యాజమాన్యాలే తీసుకోవచ్చునని విద్యా శాఖ తెలిపింది. పిల్లలను పంపించడంపై తల్లిదండ్రుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నందున.. ప్రైవేట్ యాజమాన్యాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కొన్నాళ్ల పాటు ఆన్​లైన్​లోనే బోధన కొనసాగిస్తామంటూ హైదరాబాద్​లో పలు పాఠశాలలు.. ఎస్ఎంఎస్​లు పంపించాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ఇప్పటికే శుభ్రం చేసి సిద్ధంగా ఉంచారు.

కళాశాలల్లో ప్రత్యక్షబోధన మాత్రమే..

ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా నేడు ప్రారంభం కానున్నాయి. కాలేజీల్లో కేవలం ప్రత్యక్ష బోధన మాత్రమే ఉంటుందని అధికారులు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు పాఠశాలలకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొన్నారు. జూనియర్ కాలేజీల్లో ప్రత్యక్ష బోధన మాత్రమే ఉంటుందని.. విద్యార్థులు అవసరమైతే యూట్యూబ్ పాఠాలనూ వినవచ్చునని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి ఆన్​లైన్​లో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష బోధన నిర్వహించాలని కోరారు.

తాజా నిర్ణయాలివీ

  • ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, హాస్టళ్లతో కూడిన సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ పాఠశాలలు తప్ప మిగతావి తెరచుకుంటాయి.
  • ప్రత్యక్ష తరగతులకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలంటూ పాఠశాలల యాజమాన్యాలు బలవంతం చేయరాదు.
  • ఆఫ్‌లైన్‌ బోధనా? ఆన్‌లైనా? లేదా రెండు విధానాలనూ అనుసరిస్తారా? అనేది ఆయా పాఠశాలల యాజమాన్యాలే నిర్ణయించుకోవచ్చు.
  • తల్లిదండ్రుల నుంచి హామీ పత్రాలు తీసుకున్నా న్యాయపరంగా చెల్లవు. పిల్లలు కరోనా బారినపడితే విద్యాసంస్థల యాజమాన్యాలదే బాధ్యత.
  • ప్రత్యక్ష తరగతులు నిర్వహించే పాఠశాలలు తగిన కొవిడ్‌ నియమ నిబంధనలు పాటించేలా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌(ఎస్‌వోపీ)ని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారంలోపు జారీ చేస్తారు.

హైకోర్టు ఏం చెప్పిందంటే..

ప్రత్యక్ష బోధనకు తప్పనిసరిగా హాజరు కావాలని విద్యార్థులను బలవంత పెట్టవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష తరగతులకు హాజరు కాని విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. అదేవిధంగా ఆన్​లైన్ ​బోధన కొనసాగించాలా.. ఆఫ్​లైన్​ తరగతులే ప్రారంభించాలా అనే నిర్ణయం విద్యా సంస్థలే తీసుకోవాలని పేర్కొంది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపైనా చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

ప్రత్యక్ష బోధన నిర్వహించే విద్యా సంస్థలు అనుసరించాల్సిన విధివిధానాలను వారంలోగా ఖరారు చేసి.. మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం సహా అధికారులు తనిఖీలు చేయాలని సూచించింది. గురుకుల విద్యాలయాలను ఇప్పుడే తెరవొద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించాలన్న ఉత్తర్వులను నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాల్లో వసతులపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కొవిడ్​పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సలహా కమిటీ ఇచ్చిన నివేదికను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యక్ష తరగతులు, ఆన్​లైన్​ బోధనపై భిన్నాభిప్రాయాలు. లాభ నష్టాలు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. చాలాకాలంగా విద్యా సంస్థలకు దూరంగా ఉండటం వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయన్న అధ్యయనాలు ఉన్నాయని చెప్పింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి సమస్యల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆన్​లైన్​ తరగతులు అందుకుకోలేకపోతున్నారని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు ప్రస్తుతం కొవిడ్ తీవ్రత కొనసాగుతోందని.. త్వరలో మూడో దశ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు కూడా వస్తున్నాయని న్యాయస్థానం పేర్కొంది.

ఇదీ చదవండి: వ్యాక్సినేషన్​లో దూసుకెళ్తున్న భారత్- మళ్లీ కోటి డోసులు

Last Updated :Sep 1, 2021, 3:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.