Saffron cultivation in Hyderabad: కశ్మీర్​ కుంకుమపువ్వు పరిమళం.. ఇక నుంచి భాగ్యనగరంలోనూ.!

author img

By

Published : Nov 24, 2021, 9:21 AM IST

Updated : Nov 26, 2021, 1:13 PM IST

Saffron cultivation in Hyderabad

కుంకుమ పువ్వు(Saffron cultivation in Hyderabad) అంటే మొదటగా మనకు గుర్తొచ్చేది పండంటి బిడ్డ. గర్భిణీలు పాలల్లో కలుపుకొని తాగితే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడతారని అంటారు. ఇంకా భోజనానికి మంచి రుచి రావాలన్నా అందులో కొంచెం కుంకుమ పువ్వు రెక్కలు కలుపుతారు. అంతే కాకుండా ఔషధాల తయారీలోనూ దీని వినియోగం ఎక్కువే. ఇప్పుడు ఎందుకీ ముచ్చట అనుకుంటున్నారా.. ఈ అవసరాలన్నిటికీ నాణ్యమైన కుంకుమపువ్వు ఐతేనే ఆరోగ్యకరం. అందుకే అందరిచూపు కశ్మీర్​ వైపే ఉంటుంది. ఇక నుంచి మనకు కుంకుమ పువ్వు కావాలంటే కశ్మీరే వెళ్లనసరం లేదు. మన హైదరాబాద్​లోనూ ఈ పంట సాగవుతోంది.

Saffron cultivation in Hyderabad: అందాల కశ్మీర్‌ లోయకే పరిమితమైన సుగంధ ద్రవ్యాల్లో రారాణిగా భావించే కుంకుమపువ్వు.. ఇప్పుడు భాగ్యనగరంలోనూ విరబూస్తోంది. సహజమైన చల్లని ప్రదేశాల్లోనే కాక నియంత్రిత వాతావరణంలోనూ పండించగలమని నిరూపించింది.. హైదరాబాద్‌కు చెందిన అర్బన్‌ కిసాన్‌ అంకుర సంస్థ. రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హ శాంతివనంలో వీటిని హైడ్రోపోనిక్స్‌ పద్ధతిలో ఈ మొక్కలను పెంచుతున్నారు. కన్హశాంతి వనం మార్గదర్శకులు గురూజీ కమలేష్‌ పటేల్‌జీ సూచలనతో అర్బన్‌ కిసాన్‌ సంస్థ కుంకుమ పువ్వు సాగు ప్రారంభించింది. ఏప్రిల్‌ నుంచి ఈ ప్రయత్నాలు మొదలుపెట్టగా... ఆగస్టులో మొక్కల పెంపకం ప్రారంభించారు. ఈ మేరకు కశ్మీర్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ శాఫ్రాన్‌ రీసెర్చ్‌ను సందర్శించిన అర్బన్ కిసాన్ అంకుర సంస్థ నిర్వహకులు.. అక్కడి శాస్త్రవేత్తలు, డైరెక్టర్లతో సమావేశమై పూర్తి వివరాలు సేకరించారు. మొక్కలు పెరగడానికి అనువైన వాతావరణం, తేమ, కార్బన్‌ డయాక్సైడ్, పోషకాలు ఎలా ఉండాలనే వివరాలు సేకరించారు.

హైదరాబాద్​లో కశ్మీర్​ కుంకుమ పువ్వు సాగు

హైడ్రోపోనిక్స్‌ పద్ధతిలో పెంచిన కుంకుమపువ్వు మొక్కలు

క్వింటాలు విత్తనాలు రూ. 18 వేలు ఉండగా 1.5 క్వింటాళ్ల విత్తనాలను కొనుగోలు చేశారు. వర్టికల్​ విధానంలో హైడ్రోపోనిక్స్‌(saffron cultivation in hydroponics process) పద్ధతిలో మొక్కలు పెంచుతున్నారు. అనువైన, నియంత్రిత వాతావరణం ఏర్పాటు చేసి ఆగస్టులో విత్తనాలు వేయగా ప్రస్తుతం 14 వేల మొక్కలు పెరిగాయని నిర్వాహకులు తెలిపారు. ఒక్కో మొక్కకు 3 నుంచి 4 పువ్వులు పూయగా.. ఒక్కో పువ్వు నుంచి మూడు తీగలు వస్తాయి. ప్రస్తుతం రెండువేల పూలు పూశాయని.. మరో 15 రోజుల్లో మొత్తం కోతకు వస్తాయని పేర్కొన్నారు. తొలిదశ ప్రయోగం విజయవంతం అవడంతో రెండో దశలో విస్తృత పెంపకం కోసం విత్తనాలను ఇక్కడే ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇన్​స్టిట్యూట్‌లోని టిష్యూ కల్చర్‌ ద్వారా విత్తనాలను సేకరించనున్నారు. టిష్యూ కల్చర్‌ ల్యాబ్‌ను ఇందుకు వినియోగిస్తున్నారు. వచ్చే సంవత్సరం టన్ను విత్తనాల ద్వారా పెంపకం చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఎగుమతులూ చేయొచ్చు

ఏటా దేశంలో 100 టన్నుల కుంకుమ పువ్వు అవసరం ఉంటే 30 టన్నులు మాత్రమే ఇక్కడ ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 70 టన్నులు ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అవసరం మేరకు నాణ్యమైన కశ్మీర్‌ కుంకుమ పువ్వు దొరక్కపోవడంతో ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకున్న పువ్వుతో కలిపి కల్తీ చేసి బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. హైడ్రోపోనిక్స్‌ పద్ధతిలో తొలిదశ విజయవంతం అయింది. రెండు, మూడు దశల్లోనూ విస్తృతంగా పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి కూడా విజయవంతం అయితే ఇక్కడే కాదు దేశంలో ఎక్కడైనా పండించొచ్చు. ఇతర దేశాలకు ఎగుమతి చేయొచ్చు. కశ్మీర్‌ మినహా ఇతర ప్రాంతాల్లో పండించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ నాణ్యతతో రావడం లేదు.

- డా.పి.సాయిరాంరెడ్డి, అర్బన్‌ కిసాన్‌ సంస్థ సహ వ్యవస్థాపకులు, హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌

కేటీఆర్​ ప్రశంసలు

తెలంగాణలో కశ్మీర్‌ కుంకుమపువ్వు మొక్కల పెంపకాన్ని అర్బన్‌ కిసాన్(saffron cultivation by urban kisan), హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇన్​స్టిట్యూట్‌(heartfulness institute) సంయుక్తంగా తొలిసారిగా చేపట్టినట్టు ఆ సంస్థ ప్రతినిధి ట్విట్టర్‌లో తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశారు. స్పందించిన మంత్రి ‘గ్రేట్‌ జాబ్‌.. అర్బన్‌ కిసాన్‌’ అంటూ అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి: TSRTC Single Day Income: ఒక్కరోజే టీఎస్​ఆర్టీసీకి రికార్డు స్థాయిలో రాబడి.. ఎంతంటే?

Last Updated :Nov 26, 2021, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.