REVANTH REDDY: 'కేసీఆర్‌ యాత్రలతో రాష్ట్రానికి, రైతులకు ఒరిగేదేమీ లేదు'

author img

By

Published : Nov 24, 2021, 12:08 PM IST

Updated : Nov 24, 2021, 12:50 PM IST

REVANTH REDDY: 'తెరాస, భాజపా రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడు'

తెరాస, భాజపా రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(tpcc chief revanth reddy) ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ లేఖ విడుదల చేసిన రేవంత్‌రెడ్డి(revanth reddy).. కల్లాల్లో రైతులు కన్నీరు పెడుతున్నారని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ మాత్రం దిల్లీలో సేద తీరుతున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సమాజానికి బహిరంగ లేఖ రాసిన రేవంత్‌ రెడ్డి.. ఈ యాత్రలతో అయ్యేది లేదు... పొయ్యేదీ లేదని వ్యాఖ్యానించారు. తెరాస, భాజపా రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడన్నారు. కల్లాల్లో ధాన్యం కొనకుండా దిల్లీలో యాసంగి పంటపై డ్రామాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. తడిచిన ధాన్యం కొనే అంశంపై కేసీఆర్ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కొనుగోలులో జరుగుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆలస్యం వల్లే వర్షాలకు ధాన్యం తడిసి మోసులు వస్తున్నాయని ధ్వజమెత్తారు.

రైతుల ఒత్తిడితోనే వ్యవసాయ చట్టాలపై సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. యాసంగి ధాన్యం కొనమని ఒత్తిడి చేయబోమని కేసీఆర్ కేంద్రానికి ఇచ్చిన లేఖనే నేడు వరి రైతుల పాలిటి ఉరితాడైందని విమర్శించారు. కల్లాల్లోకి కాంగ్రెస్ పర్యటనలో రైతుల ఆవేదననే తాను మాట్లాడుతున్నానన్న రేవంత్‌ రెడ్డి.. భాజపా, తెరాసలు తెలంగాణ రైతాంగ విశ్వాసాన్ని కోల్పోయాయని ఆరోపించారు.

కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధి ఏర్పాటు చేయాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులకు హామీ ఇచ్చిన లక్ష రుణమాఫీ అమలు చేయాలని, ఎరువులు ఉచితంగా ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.

చనిపోయిన రైతు కుటుంబాలు పరిహారం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందన్న రేవంత్‌.. తక్షణం వారికి పరిహారం ఇవ్వాలని కోరారు. రైతాంగ సమస్యలపై ఇవాళ, రేపు మండల, జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు జరుగుతాయని.. భవిష్యత్​లో కూడా రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

Last Updated :Nov 24, 2021, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.