ETV Bharat / state

MINISTER ERRABELLI: సీఎం కేసీఆర్​కు ఎర్రబెల్లి ధన్యవాదాలు.. ఎందుకంటే?

author img

By

Published : Jul 9, 2021, 9:09 AM IST

మ‌హిళా స్వయం స‌హాయ‌క సంఘాల‌కు వ‌డ్డీలేని రుణాల‌కు సంబంధించి రాష్ట్రప్రభుత్వం రూ.200 కోట్లు విడుదల చేసింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ముఖ్యమంత్రి కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు.

వడ్డీలేని రుణాలకు నిధులు విడుదల.. సీఎంకు ఎర్రబెల్లి ధన్యవాదాలు
వడ్డీలేని రుణాలకు నిధులు విడుదల.. సీఎంకు ఎర్రబెల్లి ధన్యవాదాలు

రాష్ట్రంలోని మ‌హిళా స్వయం స‌హాయ‌క సంఘాల‌కు వ‌డ్డీలేని రుణాల‌కు సంబంధించి మొద‌టి విడ‌త‌లో రూ.200 కోట్లు విడుద‌ల చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివ‌ృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్​రావు ధ‌న్యవాదాలు తెలిపారు. క‌రోనా సంక్షోభంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. మ‌హిళా సంఘాల‌ను ప్రోత్సహించాల‌నే ఉద్దేశంతో సీఎం నిధులు విడ‌ుద‌ల‌ చేశార‌న్నారు.

మ‌హిళా సంఘాల‌కు గ‌తంలో ఎన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున రుణాలు అందిస్తున్నామ‌ని ఎర్రబెల్లి తెలిపారు. మ‌హిళా శ‌క్తిని గుర్తించిన సీఎం కేసీఆర్.. వారి కోసం అనేక కార్యక్రమాలు చేప‌డుతున్నార‌ని అన్నారు. వ‌డ్డీ లేని రుణాల‌ను మ‌హిళా సంఘాలు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ వ‌డ్డీ లేని రుణాల‌ కోసం ప్రస్తుత బ‌డ్జెట్‌లో రూ.1,698 కోట్లు కేటాయించార‌ని వివరించారు.

నెరవేరిన లక్ష్యం..

రాష్ట్రంలో తొలిసారిగా మహిళా స్వయం సహాయక బృందాలకు రుణలక్ష్యం నెరవేరింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) పరిధిలోని 2.71 లక్షల సంఘాలకు బ్యాంకుల ద్వారా 2020-21 ఏడాదిలో మార్చి 31 నాటికి రూ.10,431 కోట్ల రుణాల పంపిణీ పూర్తయింది. కరోనా కాలంలోనూ గ్రామీణ మహిళలు 98 శాతం రుణాలను తిరిగి చెల్లించారు. రాష్ట్రంలో 4.3 లక్షల మహిళా సంఘాలున్నాయి. వీటి పరిధిలో 46 లక్షల మంది సభ్యులు ఉన్నారు.

2020-21 ఏడాదికి 3.13 లక్షల స్వయం సహాయక బృందాలకు రూ.10,272 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ మొదలైంది. గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో మహిళా సంఘాలకు రుణాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రుణ పరిమితి గరిష్ఠంగా రూ.5-7 లక్షల వరకే ఉండగా.. తాజాగా ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచింది. జనవరి నాటికి 80 శాతం పూర్తయిన రుణాలు.. మార్చి నాటికి లక్ష్యానికి మించి రుణ పంపిణీ జరిగింది. రాష్ట్ర సగటు నూరు శాతం లక్ష్యం దాటినా.. 9 జిల్లాల్లో నూరు శాతానికి లోపు పంపిణీ చేశారు. మిగతా 19 జిల్లాల్లో శతశాతం దాటింది. అత్యల్పంగా కుమురం భీం జిల్లాలో 84.23 శాతం.. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 109.69 శాతంగా ఉంది.

మహిళా సంఘాల రుణాలకు వడ్డీరేట్లను బ్యాంకులు తగ్గించాయి. బ్యాంకర్ల సంఘం 14.5 నుంచి 12 శాతానికి రుణ వడ్డీరేట్లను తగ్గించింది. సంఘాలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నా.. వడ్డీరాయితీ పథకాలు అమలవ్వడం లేదు. 2021-22కి రూ.3 వేల కోట్లను ప్రభుత్వం వడ్డీరహిత రుణాల కింద బడ్జెట్‌లో ప్రతిపాదించింది.

ఇదీ చూడండి: వడ్డీ లేని రుణాలు పొందాలంటే ఆధార్​ తప్పనిసరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.