ETV Bharat / state

హైజీనిక్​ కండిషన్​లోకి శంషాబాద్​ విమానాశ్రయం

author img

By

Published : May 13, 2020, 12:59 PM IST

శంషాబాద్‌ అంతర్జాతీయ విమనాశ్రయం పూర్తి స్థాయిలో హైజీనిక్‌ కండిషన్‌లో సిద్దమవుతోంది. లాక్‌ డౌన్‌ ఎత్తివేయగానే ఏలాంటి భయం లేకుండా ప్రయాణీకులు రాకపోకలు సాగించేందుకు వీలుగా అవసరమైన చర్యలను జీఎంఆర్‌ యాజమాన్యం తీసుకుంటోంది. ప్రయాణీకులు భౌతిక దూరాన్ని పాటించేట్లు ప్రత్యేక గడులు ఏర్పాటు చేయడం, చేతులు శుభ్ర పరచుకోడానికి ఆటోమేటిక్‌ శానిటైజ్‌ డిస్పెన్షనరీ స్టేషన్స్‌ ఏర్పాటు చేసింది.

హైజీనిక్​ కండిషన్​లోకి శంషాబాద్​ విమానాశ్రయం
హైజీనిక్​ కండిషన్​లోకి శంషాబాద్​ విమానాశ్రయం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించేందుకు దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని డీప్‌ క్లీనింగ్‌ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తెచ్చేందుకు వందే భారత్‌ మిషన్ అమలు చేస్తున్నందున విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో హైజీనిక్‌ కండిషన్‌లోకి తీసుకొచ్చేందుకు ఎయిర్‌పోర్టు యాజమాన్యం చర్యలు తీసుకుంది.

ప్రతి ప్రాంతం శానిటైజ్​:

మరో వైపు లాక్‌ డౌన్‌ ఎత్తివేయగానే విమానాల రాకపోకలు తిరిగి పునరుద్ధరణ జరుగనున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో విమానాశ్రయంలో ఎయిరో బ్రిడ్జి నుంచి అరైవల్స్ ర్యాంప్ వరకు పూర్తిగా శానిటైజ్ చేశారు. అదే విధంగా విమానాశ్రయంలోని వాష్ రూంలు, కుర్చీలు, కౌంటర్లు, ట్రాలీలు, రెయిలింగులు, లిఫ్టులు, ఎస్కలేటర్లు తదితర వాటిని కూడా శానిజైట్ చేశారు. దేశీయ, అంతర్జాతీయ రాకపోకలు సాగించే ప్రయాణీకులు.. కోవిడ్‌-19కు చెంది అన్ని నియమాలను పాటించేట్లు విమానాశ్రయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

థర్మల్​ కెమెరాలతో స్క్రీనింగ్​..

ప్రధానంగా ఎయిర్‌ పోర్టులోకి ప్రయాణీకులు ప్రవేశించగానే థర్మల్‌ కెమెరాల ద్వారా ఉష్ణోగ్రతలను స్క్రీనింగ్‌ చేస్తున్నారు. ఎవరికైనా.. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నట్లు గుర్తిస్తే వారిని అక్కడే నిలిపివేస్తారు. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ప్రయాణీకులను ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం తీసుకెళ్లే సమయంలో వైరస్‌ వ్యాప్తికి అవకాశం లేని విధంగా కౌంటర్ల వద్ద గ్లాస్ షీల్డులను ఏర్పాటు చేశారు. బ్యాగేజ్ బెల్టుతో అనుసంధానించిన డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా ప్రయాణికుల బ్యాగేజీని శానిటైజ్ చేస్తారు. ఎప్పటికప్పుడు పూర్తిగా శానిటైజ్ చేసిన బ్యాగేజ్ ట్రాలీలను ప్రయాణికుల కోసం సిద్ధంగా ఉంచుతారు.

భౌతిక దూరానికి చర్యలు:

అలాగే భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ప్రయాణీకులు వేచి ఉండే ప్రదేశాల్లో కూర్చొనే చోట మూడు కుర్చీలుంటే అందులో రెండింటిలో మాత్రమే కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. పాస్ట్‌పోర్టు ఇతర పత్రాలను పరిశీలించే కేంద్రాల వద్ద, బ్యాగేజి తనిఖీ కేంద్రాల వద్ద, ఇమిగ్రేషన్‌ అధికారులు, కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహేంచే చోట ఎర్రటి చతురస్రాకార గడులను ఏర్పాటు చేసి ప్రయాణీకుల మధ్య భౌతిక దూరాన్ని పాటించేట్లు చర్యలు తీసుకున్నారు.

శానిటైజర్​ డిస్పెన్షనరీ సెంటర్లు ఏర్పాటు:

ఎయిర్‌ పోర్టులోకి ప్రవేశించే ప్రతి ప్రయాణీకుడు, అధికారులు, సిబ్బంది అందరూ తరచూ చేతులు శుబ్రం చేసుకోడానికి ఆటోమేటిక్‌గా శానిటైజర్‌ చేతులో పడేట్లు డిస్పెన్షనరీ సెంటర్లను ఏర్పాటు చేశారు. లగేజీ ట్రాలీలు, హ్యాండ్‌ బ్యాగ్‌ ట్రేలు, స్కానింగ్‌ ప్రాంతాలు ఇలా అన్ని చోట్ల డీప్‌ క్లీనింగ్‌ చేస్తున్నారు. ఎయిర్‌ పోర్టులో పని చేసే సిబ్బంది, అధికారులు అంతా కూడా మాస్క్‌లు ధరించి, చేతులకు గ్లౌజులు వేసుకోవడం తప్పనిసరి చేశారు.

782 మంది భారతీయులు స్వదేశానికి..

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వందే భారత్‌ మిషన్‌లో భాగంగా మంగళవారం వరకు శంషాబాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టుకు నాలుగు విమానాలు రాకపోకలు సాగించాయి. కువైట్ నుంచి 163 మంది, యూఏఈ నుంచి 170 మంది, అమెరికా నుంచి 118 మంది, యూకె నుంచి 331 మంది లెక్కన విదేశాల్లో చిక్కుకుపోయిన 782 మంది భారతీయులను శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు ద్వారా స్వదేశానికి వచ్చారు. ఇలా తీసుకువచ్చిన భారతీయులందరినీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా క్వారంటైన్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్​ దాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.