ETV Bharat / state

ys viveka murder case: 'వివేకాను హత్య చేయించింది వారే'

author img

By

Published : Feb 27, 2022, 11:59 AM IST

ys viveka murder case: ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని రాజకీయ కారణాలతోనే.. హత్య చేయించారని పులివెందుల వాసి నాగప్ప తెలిపారు. ఈ విషయాన్ని పులివెందులలో చిన్న పిల్లాడినడిగినా చెబుతారని పేర్కొన్నారు. కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి హత్య చేయించారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.

YS Viveka
YS Viveka

ys viveka murder case: ‘వైఎస్‌ వివేకానందరెడ్డిని రాజకీయ కారణాలతో కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి హత్య చేయించారని పులివెందులలో చిన్న పిల్లాడినడిగినా చెబుతాడు. మా ప్రాంతంలో నాయకులంటే వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, వివేకానందరెడ్డిలే. భాస్కర్‌రెడ్డి కుటుంబం వారి ఎదుట నోరు తెరిచే సాహసం కూడా చేసేది కాదు. రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాతే... భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి జగన్‌తో కలిసి క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించారు’ అని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పులివెందుల వాసి నాగప్ప తెలిపారు. వివేకా హత్యకేసు నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి పక్క ఇంట్లో నాగప్ప ఉంటారు. గతేడాది డిసెంబరు 22న ఆయన సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. అందులోని ప్రధానాంశాలివే..

అంత పొద్దున్నే బయటకు రావటం అంతకు ముందెప్పుడూ చూడలేదు

2019 మార్చి 15న ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి, మా ఇంటిముందు నిలబడ్డాను. అదే సమయానికి ఎర్ర గంగిరెడ్డి తన ఇంటి గేటు వద్ద నిలబడి ఉండటం చూశాను. అతను అంత పొద్దుటే ఇంటి బయట ఎందుకు ఉన్నాడో అర్థం కాలేదు. అంత పొద్దుటే అలా ఇంటి బయటకు రావడం అంతకు ముందెప్పుడూ నేను చూడలేదు. నేను నా ఇంట్లోకి వెళ్లిపోయాను. ఉదయం 7గంటల సమయంలో ఎర్ర గంగిరెడ్డి నన్ను పిలిచాడు. చొక్కా తొడుక్కుని, బండి తీసుకుని రమ్మన్నాడు. వివేకానందరెడ్డి ఇంటికి తీసుకెళ్లాలని అడిగాడు. వివేకానందరెడ్డి చనిపోయిన విషయాన్ని అతను నాతో ప్రస్తావించలేదు. ఆందోళనగా ఉన్నట్టు కనిపించింది. అతన్ని వివేకా ఇంటిదగ్గర దించాను. నేరుగా ఆయన వివేకా ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఈ కేసులో గంగిరెడ్డి 90 రోజులు జైల్లో ఉన్నాడు. అతను జైలు నుంచి వచ్చాక నాతో మాటల్లేవు. వివేకా హత్యకేసులో అతని ప్రమేయం ఉందని తెలిశాక పూర్తిగా మాట్లాడటం మానేశాను. తర్వాత అతను ఎప్పుడూ ఏదో జబ్బు పడ్డవాడిలా ఆందోళనగా కనిపించేవాడు.

వాళ్లు తరచూ వచ్చేవారు

ఎర్ర గంగిరెడ్డి ఇంటికి సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌, జగదీశ్వర్‌రెడ్డి తరచూ వచ్చేవాళ్లు. దస్తగిరి అప్పుడప్పుడు వచ్చేవాడు. ఒకటి రెండు సందర్భాల్లో సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌, జగదీశ్వర్‌రెడ్డితో కలసి దస్తగిరి వచ్చాడు. అప్పుడప్పుడూ వివేకానందరెడ్డి కూడా ఎర్ర గంగిరెడ్డి ఇంటికి వచ్చేవారు.

భాస్కర్‌రెడ్డి, గంగిరెడ్డి వివేకా బెడ్రూంలోకి వెళ్తూ కనిపించారు...

వివేకానందరెడ్డి మృతి వార్త తెలుసుకుని ఆయన ఇంట్లోకి వెళ్లేసరికి అక్కడ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో పాటు మరో నలుగురైదుగురు వ్యక్తులు బెడ్రూంలో ఉన్నారని వేముల జడ్పీటీసీ సభ్యుడు కె.వెంకట బయపురెడ్డి తెలిపారు. తాను బయటకు వచ్చేసరికి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కలిసి వివేకా బెడ్రూంలోకి వెళ్తూ కనిపించారన్నారు. గతేడాది సెప్టెంబరు 28న ఆయన సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ‘వివేకా ఇంటికి కిలోమీటరు దూరంలో మా ఇల్లు ఉంది. భరత్‌రెడ్డి అనే గుత్తేదారు నాకు వివేకా మృతి గురించి చెప్పారు. ఉదయం 7.15కు నేను వివేకా ఇంటికి వెళ్లాను. ఆ సమయంలో ఎంపీ అవినాష్‌రెడ్డి హాల్లో ఉన్నారు. నేను నేరుగా బెడ్రూం, బాత్రూంలోకి వెళ్లాను. రక్తపు మడుగులో మృతదేహం పడి ఉంది. బెడ్రూం, బాత్రూంలలో రక్తం ఉంది. తలపై గాయాలు గమనించాను’ అని వివరించారు.

ఇదీ చూడండి : YS Viveka murder case : ' వైఎస్ వివేకా హత్యా నేరాన్ని నాపై వేసుకుంటే రూ.10కోట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.