ETV Bharat / state

ఎస్పీజీ ఆధీనంలో బేగంపేట విమానాశ్రయం... పీఎం పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

author img

By

Published : May 25, 2022, 3:34 PM IST

Updated : May 25, 2022, 5:08 PM IST

PM Modi Hyderabad Tour
ప్రధాని హైదరాబాద్​ పర్యటన

PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం(మే 26) హైదరాబాద్‌కు రానున్నారు. గచ్చిబౌలిలోని ఐఎస్​బీ ద్విదశాబ్ది వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 2022 సంవత్సరానికి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మోదీ పట్టాలు పంపిణీ చేయనున్నారు. ప్రధాని హైదరాబాద్‌కు వస్తుండటంతో భాజపా రాష్ట్ర నాయకత్వం ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయం వద్ధ ప్రధానికి ఘనస్వాగతం పలికి... సన్మానం చేయనుంది. ప్రధాని రాక పార్టీ శ్రేణుల్లో ఉత్తేజంతో పాటు రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తోందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

PM Modi Hyderabad Tour: హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌- ఐఎస్​బీ ద్విదశాబ్ది వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా జరుపుకుంటోంది. ఈ వార్షికోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ప్రత్యేక విమానంలో రేపు మధ్యాహ్నం 1:25 గం.లకు మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరకుంటారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు రాష్ట్ర అధికారులు, భాజపా నాయకులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం భాజపా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయం ముందు ఏర్పాటు చేసిన వేదిక వద్ధకు చేరుకుంటారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రధానికి ఘన స్వాగతం పలికి సన్మానించనుంది.

పర్యటనకు కేసీఆర్​ దూరం: వేదికపై పార్టీ శ్రేణులకు మోదీ అభివాదం చేసి ఉత్తేజాన్ని నింపనున్నారు. ప్రధాని మోదీ రాక పార్టీ శ్రేణులతో పాటు తెలంగాణ ప్రజలకు భరోసా కల్పిస్తోందని భాజపా నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మోదీ సెంట్రల్‌ యూనివర్శిటీకి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఐఎస్‌బీకి చేరకుంటారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండనున్నారు. ఈ నెల 26న మోదీ హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటించనుండగా.. అదేరోజు సీఎం కేసీఆర్‌ బెంగళూరులో పర్యటించనున్నారు.

తొలిసారిగా ఐఎస్‌బీ హైదరాబాద్‌, మొహాలీ క్యాంపస్‌లతో కలిపి ఉమ్మడి స్నాతకోత్సవం నిర్వహిస్తోంది. ఈ స్నాతకోత్సవంలో 2022 సంవత్సరానికి గాను పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న 930 మంది విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ స్నాతకోత్సవంలో ప్రధాని ముఖ్య అతిధిగా పాల్గొని గోల్డ్ మెడల్‌ సాధించిన పదిమంది విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలను అందజేయనున్నారు. అనంతరం విద్యార్థులను ఉద్ధేశించి మోదీ ప్రసంగించనున్నారు. గంటపాటు ఐఎస్​బీలో గడపనున్న ప్రధాని.. తిరిగి 3.50 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై బయల్ధేరి వెళ్లనున్నారు. తిరుగు ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానికి తలసాని వీడ్కోలు పలుకుతారు.

ఎస్పీజీ అధీనంలోకి: మోదీ రాక నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయాన్ని ఎస్పీజీ తన అధీనంలోకి తీసుకుంది. భద్రతలో పాల్గొనే సిబ్బందికి అధికారులు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌ ద్వారా హెచ్‌సీయూకి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఐఎస్‌బీకి వెళ్తారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా రోడ్డు మార్గాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఐఎస్‌బీ వరకు పీఎంవో భద్రతా విభాగం ట్రయల్‌ రన్‌ నిర్వహించింది.

PM Modi Hyderabad Tour
ప్రధాని పర్యటన దృష్ట్యా బేగంపేట విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది

డ్రోన్ల నిషేధం: ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐఎస్‌బీకి 5 కి.మీ పరిధిలో రిమోట్ కంట్రోల్ డ్రోన్ల వాడకంపై నిషేధం విధించారు. ప్యారాగ్లైడింగ్, మైక్రో లైట్ ఎయిర్ క్రాప్ట్స్‌పై నిషేధం విధించిన పోలీసులు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్క ఐఎస్‌బీలోనే సుమారు 2 వేల మందితో బందోబస్తు చేపడుతున్నారు. ప్రధాని పర్యటన సమయంలో డ్రోన్లు వాడేందుకు అనుమతించారు. ఈ ఆంక్షలు రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 వరకు అమల్లో ఉండనున్నాయి. కార్యక్రమం అనంతరం ​సాయంత్రం 3.55 గంటలకు మోదీ తిరుగు ప్రయాణం కానున్నారు.

PM Modi Hyderabad Tour
ఎస్పీజీ అధీనంలో బేగంపేట విమానాశ్రయం

దారుల మళ్లింపు: గచ్చిబౌలి స్టేడియం నుంచి విప్రో కూడలి వరకు ఉన్న కంపెనీలకు పోలీసులు సూచనలు చేశారు. పనివేళల్లో మార్పులు చేసుకోవాలని ఐటీ కంపెనీలకు సూచించారు. గచ్చిబౌలి కూడలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలను.. బొటానికల్ గార్డెన్ నుంచి హెచ్‌సీయూ డిపో మీదుగా వెళ్లాలని తెలిపారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలు.. హెచ్‌సీయూ డిపో నుంచి బొటానికల్ గార్డెన్ మీదుగా వెళ్లాలని చెప్పారు. విప్రో కూడలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు.. క్యూసిటీ, గౌలిదొడ్డి నుంచి నల్లగండ్ల మీదుగా వెళ్లాలని పేర్కొన్నారు. విప్రో కూడలి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలు.. ఫెయిర్‌ఫీల్డ్ హోటల్ నుంచి ఎల్ అండ్‌ టీ టవర్స్ వైపు వెళ్లాలని.. తీగల వంతెన నుంచి గచ్చిబౌలి కూడలి వైపు వెళ్లే వాహనాలు.. మాదాపూర్ పీఎస్‌ నుంచి బొటానికల్ గార్డెన్ మీదుగా వెళ్లాలని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్​కు 20 ఏళ్లు.. రేపే ద్విదశాబ్ది వార్షికోత్సవం..

రేపు హైదరాబాద్‌కు మోదీ.. ఐఎస్‌బీ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం3

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు హతం

Last Updated :May 25, 2022, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.