ETV Bharat / state

Police rides on Ganjai: గంజాయి రవాణాపై ఉక్కుపాదం.. పోలీసుల దాడులు ముమ్మరం

author img

By

Published : Oct 24, 2021, 5:18 PM IST

డ్రగ్స్​, గంజాయి లాంటి మత్తు పదార్థాల రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. యువత జీవితాలను చిత్తు చేస్తున్న మాదకద్రవ్యాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపి ఇటివలే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గంజాయి రవాణా, డ్రగ్స్​ వినియోగంపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు.

Police rides on Ganjai
గంజాయి రవాణా, డ్రగ్స్​ వినియోగంపై ఉక్కుపాదం

నిషేధిత గుట్కాతో పాటు డ్రగ్స్​, గంజాయి వంటి మత్తు పదార్ధాల రవాణాపై జంట నగరాల పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వీటి అమ్మకాలు, వినియోగం, రవాణాను అరికట్టాలని ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు చేపడుతున్నారు. మత్తు పదార్ధాలు, నిషేధిత గుట్కా, గంజాయిని పూర్తిగా నిరోధించేలా కృషి చేస్తున్నారు. నిఘా పెంచి పాన్‌షాపులపై కేసులు నమోదు చేసి, గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్​ చేస్తున్నారు. మత్తు పదార్ధాల వలన కలిగే అనర్ధాల గురించి విద్యార్ధుల్లో అవగాహన కల్పిస్తున్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలు

యువత భవిష్యత్తును అంధకారం చేస్తున్న గంజాయి, గుట్కా లాంటి మత్తు పదార్ధాల విక్రయానికి అడ్డుకట్ట వేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిపై ఇప్పటికే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్‌.. పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళిక రచించాలని.. ఉత్తమంగా పనిచేసే సిబ్బందికి రివార్డులు కూడా అందించాలని ఉన్నతాధికారులు సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని వెల్లడించారు.

మూడు కమిషనరేట్లపై ప్రత్యేక నిఘా

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని పాన్‌షాపులు, కిరాణా దుకాణాలతో పాటు ఇతరత్రా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎక్సైజ్‌, పోలీసు అధికారులు, సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. నగర శివారు ప్రాంతాలతో పాటు నగరంలోనూ ప్రతి రోజు దాడులు జరుగుతున్నాయి. రాజధాని సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కాలినడకన తిరుగుతూ ధూల్‌ పేట్‌ వంటి ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు ముమ్మరమయ్యాయి. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గతంలో గంజాయి విక్రయించి అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే రైళ్లలోనూ తనిఖీలు ముమ్మరం చేశారు. గంజాయి ఇతర రాష్ట్రాల నుంచి రవాణ అవుతున్నందున దాన్ని అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

నగరంలో పలుచోట్ల గంజాయి స్వాధీనం

ఎస్‌ఆర్‌ నగర్‌, జీడిమెట్ల, శంషాబాద్‌, సికింద్రాబాద్‌, అల్వాల్‌, మచ్చబొల్లారం, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, బాలనగర్‌, సనత్‌నగర్‌, పేట్‌ బషీరాబాద్‌ ప్రాంతాల్లో పోలీసులు దాడులు కొనసాగాయి. బాలానగర్‌ జోన్‌ పరిధిలోని గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని ఎస్​వోటీ పోలీసులు పట్టుకొని రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్​బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి లిక్విడ్‌ గంజాయి, 14 గంజాయి టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలో నానక్‌రామ్‌గూడకు చెందిన దన్ను సింగ్‌ గంజాయిని ప్యాకెట్లలో విక్రయిస్తుండగా దాడి చేసి పోలీసులు పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి 77 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

దుకాణదారులపై కేసులు

మరో వైపు జీడిమెట్ల పరిధిలోని మెట్టుకానిగూడలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి వాటిని ధ్వంసం చేశారు. కృష్ణారెడ్డి అనే వ్యక్తి మొక్కలు పెంచుతున్నట్టు దర్యాప్తులో బయటపడింది. కూకట్‌పల్లి, బాచుపల్లి ప్రాంతాల్లోని పాన్‌షాపులు, కిరాణా దుకాణాలపై దాడి చేసిన పోలీసులు నిషేధిత గుట్కా విక్రయిస్తున్న 57 దుకాణదారులపై కేసులు నమోదు చేశారు. నిషేధిత గుట్కా, ఇతరత్రా మత్తు పదార్ధాలను విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టడంతో పాటు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. మత్తు పదార్ధాల రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు, రైల్వే పోలీసులు తరచు దాడులు చేపడుతున్నారు.

ఇదీ చూడండి:

drugs: హైదరాబాద్‌లో 3 కిలోల డ్రగ్స్‌ పట్టుకున్న ఎన్‌సీబీ.. నిందితుడు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.