'రాష్ట్రంలో పోలవరం ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వేకు ఏపీ అంగీకరించింది'

author img

By

Published : Nov 16, 2022, 5:08 PM IST

Updated : Nov 16, 2022, 8:02 PM IST

polavaram

Polavaram Project Authority Meeting: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ఉమ్మడి సర్వేపై తెలుగు రాష్ట్రాలు.. మరోసారి భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశాయి. ఉమ్మడి సర్వేకు కేంద్ర జలసంఘం, ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించినట్టు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ చెబితే... అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఉమ్మడి సర్వే అవసరమేంటని ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్‌ డ్యాం పనులు 2023 జనవరి నెలాఖరుకు పూర్తిచేస్తామని, అదే ఏడాది జూన్‌నాటికి ప్రధాన డ్యాం పనులు గ్రౌండ్‌ లెవల్‌వరకు తీసుకొస్తామని శశిభూషణ్‌ కుమార్ వెల్లడించారు.

Polavaram Project Authority Meeting: పోలవరం ప్రాజెక్టు అథారిటీ 15వ సమావేశం... బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. కృష్ణా, గోదావరి భవన్‌లో... పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డి, తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, ఇంజనీర్లు హాజరయ్యారు. కేంద్ర జలసంఘం ప్రతినిధులు కూడా పాల్గొన్న ఈ భేటీలో ఎజెండాలోని 15 అంశాలపై చర్చించారు. పోలవరం బ్యాక్ వాటర్స్ కారణంగా... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంభవించే ముంపుపై తెలంగాణ ప్రభుత్వం రాతపూర్వకంగా కొన్ని వివరాలు సమర్పించింది.

బ్యాక్ వాటర్స్ కారణంగా 892 ఎకరాలు ముంపునకు గురవుతోందని... స్థానిక ప్రవాహాలు, డ్రైనేజ్ కారణంగా ముప్పు పొంచి ఉందని వివరించింది. 2022 జూలై వరదల సందర్భంగా వచ్చిన ముంపు, నష్టాన్ని... అథారిటీకి సమర్పించిన నివేదికలో తెలంగాణ సర్కార్‌ పొందుపరిచింది. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తరలించేలా ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండా ఎత్తిపోతల పథకాలు చేపట్టిందని పేర్కొంది. పోలవరం బ్యాక్ వాటర్స్ కారణంగా తెలంగాణలో ముంపుపై ప్రస్తావించగా... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల అంశాలను కేంద్ర జలసంఘం పరిగణలోకి తీసుకుని.. అధ్యయనం చేయించడానికి అంగీకరించినట్టు తెలంగాణ ఈఎన్‌సీ తెలిపారు. ఉమ్మడి సర్వేకు ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి అంగీకరించినట్లు తెలిపారు.

'రాష్ట్రంలో పోలవరం ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వేకు ఏపీ అంగీకరించింది'

ఏపీ జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ మాత్రం... తెలంగాణ ఈఎన్సీ చెప్పిన మాటలతో విబేధించారు. అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాతే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని, ఉమ్మడి అధ్యయనం, సర్వే అంటూ ఏదీ ఉండదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో వచ్చే సీజన్‌లో పోలవరం ప్రాజెక్టు పనుల లక్ష్యాలు, వనరులపై ప్రణాళిక సిద్ధం చేసి ఆమోదించినట్లు శశిభూషణ్ కుమార్ తెలిపారు. ప్రధాన డ్యాం గ్యాప్ పనులను 2023 డిసెంబర్ వరకు పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకు జరిగిన రెండు సమావేశాల్లో ఎలాంటి ఫలితం లేదన్న శశిభూషణ్‌... ఈ అంశంపై ఏకాభిప్రాయం కోసం త్వరలోనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఇద్దరు సీఎంలతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 16, 2022, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.