Ou Doctorate to CJI: ప్రపంచీకరణతో స్థానిక సంస్కృతులకు ముప్పు: జస్టిస్‌ ఎన్వీ రమణ

author img

By

Published : Aug 6, 2022, 6:06 AM IST

Updated : Aug 6, 2022, 6:17 AM IST

OU Honorary Doctorate awarded to Justice NV Ramana
OU Honorary Doctorate awarded to Justice NV Ramana ()

Ou Doctorate to CJI: దేశ ఉన్నత విద్యారంగంలో కొత్త శకాన్ని సృష్టించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం... గ్లోబల్ లెర్నింగ్ సెంటర్‌ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. భారత్ వంటి ప్రజాస్వామిక దేశాల్లో విశ్వవిద్యాలయాలు.. జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విద్యార్థులు ఏ కోర్సు చదివినా.. దేశంలోని చట్టాలు, పరిపాలన అంశాలపై ఉండేలా సబ్జెక్టును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని సీజేఐ సూచించారు. జస్టిస్ ఎన్వీ రమణకు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

Ou Doctorate to CJI: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదాన చేసింది. ఓయూ 82వ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళిసై చాన్సలర్ హోదాలో సీజేఐ జస్టిస్‌ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. దేశంలోని ఉన్నత విద్యలో కొత్త శకాన్ని సృష్టించి.. ఆధునిక భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యమైన ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో మంది మేధావులను తయారు చేసిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. పీవీ వంటి ప్రధాని, కేసీఆర్ లాంటి సీఎం సహా మంత్రులు, నేతలను ఓయూ అందించిందన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్ లాల్ నెహ్రూ, అంబేడ్కర్ వంటి 42 మంది సరసన... ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోవడం తాను సరిపోతానా అని భయపడ్డానని జస్టిస్‌ రమణ అన్నారు. ఓయూ హాస్టళ్లు, క్యాంటీన్, గ్రంథాలయాల్లో స్నేహితులతో కలిసి గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాయం గ్లోబల్ లెర్నింగ్ సెంటరని.. సామాజిక సమతుల్యతకు, భిన్న నేపథ్యాలున్న విద్యార్థులకు వేదిక అని అభివర్ణించారు. సామాజిక మార్పు, మరింత సమానత్వం కోసం విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తించిన కేంద్రమన్నారు. రాష్ట్రంలోని భిన్నత్వం, విలువైన సంప్రదాయాలకు ఓయూ ప్రతిబింబమన్నారు. భారతదేశం వంటి ప్రజాస్వామిక దేశాల్లో విశ్వవిద్యాలయాలు జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు.

ప్రపంచీకరణతో స్థానిక సంస్కృతులకు ముప్పు: జస్టిస్‌ ఎన్వీ రమణ

విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో విద్య, సమాచారమే వ్యక్తులకు కీలకమైన ఆస్తి. నాణ్యమైన విద్య, కష్టపడేతత్వం, అంకితభావంతో ఎవరైనా సామాజిక అడ్డుగోడలను బద్దలు కొట్టవచ్చు. సామాజిక అభివృద్ధికి విద్య కీలక పునాది. చట్టాల పట్ల విద్యార్థులు కనీస జ్ఞానం కలిగి ఉండాలి. రాజ్యాంగంతో ప్రజలు అనుసంధానం కావాలి. ఎందుకంటే అదే మనకు అంతిమ రక్షణ కవచం. రాజ్యాంగం, సుపరిపాలన అంశాలపై పాఠ్యాంశాలను ప్రవేశపెట్టడానికి ఇదే కీలక సమయం. - జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ప్రపంచీకరణ విధానం వల్ల యువత అనేక సవాళ్లు ఎదుర్కుంటోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. గ్లోబల్ కల్చర్ వైపు వెళ్తున్నందున... స్థానిక సంస్కృతులకు ముప్పు ఉందన్నారు. ఈ శతాబ్దం చివరి నాటికి ఏడు వేల మాట్లాడే భాషల్లో దాదాపు సగం అంతరించి పోతాయని 2021 యునెస్కో నివేదిక చెబుతోందన్నారు. ఒక్కో భాషతో సాహిత్యం, జానపదమే కాకుండా విజ్ఞానం కూడా మరుగున పడుతుందని సీజేఐ జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రపంచీకరణ వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బ తింటోందని.. హస్తకళలు, చేతివృత్తులపై తీవ్ర ప్రభావం కనిపిస్తున్నాయన్నారు. గ్లోబలైజేషన్‌ను విమర్శించడం తన ఉద్దేశం కాదని.. అయితే ఎక్కడో తప్పుగా వెళ్లారని రుజువైందన్నారు. అందరికీ ఉపయోగం, అవకాశాలు కల్పించే గ్లోబలైజేషన్ మోడల్ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్​డీలతోపాటు గత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేశారు.

ఇవీ చదవండి: Munugodu congress Meet: మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: రేవంత్ రెడ్డి

Vice president election: నేడే ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. ధన్‌ఖడ్‌ ఎన్నిక లాంఛనమే

Last Updated :Aug 6, 2022, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.