ETV Bharat / state

ప్రకృతి వ్యవసాయంతో సిరులు పండిస్తున్న రైతు సుజాత

author img

By

Published : Nov 6, 2020, 10:47 PM IST

ప్రకృతి వ్యవసాయంతో సిరులు పండిస్తున్న రైతు సుజాత
ప్రకృతి వ్యవసాయంతో సిరులు పండిస్తున్న రైతు సుజాత

మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే పెద్దలు అనేవారు వంటిల్లే పెద్ద వైద్యశాల అని. అదే సూత్రాన్ని ఆచరిస్తున్న ఓ మహిళా రైతు.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడమే కాకుండా, వినియోగదారుడికి అందించే లక్ష్యంతో సాగుపథంలో దూసుకుపోతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో 30కి పైగా వివిధ రకాల పంటలు, కూరగాయలు సాగుచేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారుడికి విక్రయించడమే కాకుండా, విలువ ఆధారిత పద్ధతిలో ఉత్పత్తులను తయారుచేసి విక్రయిస్తున్నారు. ఆమె అవలంబించిన సాగు విధానంతో అనేక ప్రశంసలు, అవార్డులు సొంతం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్​ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సుజాత పోస్టు గ్రాడ్యూయేట్‌ చేశారు. పెద్ద చదువులు చదివినా.. వ్యవసాయంపై మక్కువతో పొలం బాటపట్టారు. మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉండడానికి కారణాలు, అప్పటి సహజ సిద్ధ సాగు విధానాలను సుజాత తెలుసుకున్నారు. రసాయనాలు వినియోగించని కూరగాయాలు, పండ్లు కోసం ఎంతగానో ప్రయత్నించేవారు. అవి అరకొరగానే దొరికేవి. అందువల్ల తామే తమ అవసరాలు కోసం ప్రకృతి వ్యవసాయం చేయాలని భావించారు.

సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని తెలుసుకున్నారు. 2014లో కనిగిరి సమీపంలో పెదారగట్ల గ్రామంలో 50 ఎకరాల పొలాన్ని తీసుకున్నారు. ఈ భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు ప్రారంభించారు. ఔషధ మొక్కలు, చిరు ధాన్యాలు సాగు చేయడం ప్రారంభించారు. జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు స్వయంగా తయారుచేసేవారు. వర్షాలు తక్కువుగా ఉండడం వల్ల తొలి సంవత్సరం కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా.. నేల సారం పెరుగుతుండటం వల్ల ఫలితాలు రావడం ప్రారంభమైంది.

ప్రకృతి వ్యవసాయమంటే రసాయనాలు వినియోగించకుండా ఆవు మూత్రం, పేడలను వినియోగించి సాగు చేయడమొక్కటే కాదు.. సాగులో కొన్ని పద్ధతులు పాటించాలి. గ్రీన్‌ మెన్యూర్‌, పంట మార్పిడి, గడ్డితో మల్చింగ్‌, ఒకే క్షేత్రంలో విభిన్న రకాల పంటలతో అంతర పంటలు విధానం, చీడపీడల నివారణ కోసం పెస్ట్‌ మేనేజ్‌మెంట్, ఔషధ మొక్కల పెంపకం, ఆవులు పెంపకం ఇలా.. భిన్న పద్దతులుతో సాగు చేస్తేనే ఫలితాలు వస్తాయని భావించి, ఈ పద్ధతులన్నీ ఈ క్షేత్రంలో అమలు చేస్తున్నామంటున్నారు రైతు సుజాత.

కంది, మినుము, పెసరు, బొబ్బర్లు, శనగ, వేరుశనగ, నువ్వులు, అరికెలు, సామలు, అండుకొర్రలు, కొర్రలు, జొన్నలు, సజ్జలు, పసుపు, మిర్చి, మొక్కజొన్నలతో పాటు ఉద్యాన పంటలు మామిడి, సపోటా, సీతాఫలం, జామ, దానిమ్మ, ఉసిరి, నిమ్మ, నేరేడు, కొబ్బరి, మునగ వంటి 30 రకాల పంటలు సాగుచేస్తున్నారు. అన్ని రకాల కూరగాయలు కూడా పండిసున్నారు. స్వల్పకాలిక పంటలు ఒకసారి వేసిన తరువాత అదే స్థలంలో అదే పంట వేయమని, పంట మార్పడి ద్వారా చీడపీడలు ఆశించవని ఆమె పేర్కొంటున్నారు. వీరు పండించిన ఉత్పత్తులను చాలా వరకు విలువ ఆధారిత పద్ధతిలో ఉత్పత్తులు తీసుకువస్తారు. నువ్వులు, వేరుశనగ నూనె తయారు చేయడం, పసుపు, కారం కూడా సొంతంగా పొడులు ఆడించడం, కొర్రలు, అండ్రుకొర్రలు, సామలు, జొన్నలు వంటివి శుద్ధిచేసి సొంతంగా ఎగుమతి చేస్తున్నారు.

రైతు సుజాత ప్రకృతి వ్యవసాయంతో మంచి ఫలితాలు సాధిస్తూనే, ఎంతోమందికి అవగాహన కల్పిస్తున్నారు. విశాఖలో జరిగిన అంతర్జాతీయ సెమినార్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొని దాదాపు గంటసేపు జల సంరక్షణ, ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించారు. 2015లో ప్రకృతి వ్యవసాయంలో ఉత్తమ మహిళా రైతుగా అవార్డు అందుకున్నారు. 2017లో .. కందుకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా ఉత్తమ రైతుగా.. రైతు నేస్తం అవార్డు అందుకున్నారు.

సుజాత వ్యవసాయ క్షేత్రంలో పూర్తిగా సాగు మీద దృష్టిపెడితే ఆమె భర్త కోటేశ్వరరావు సాంకేతిక అంశాలతో సహకారాన్ని అందిస్తారు. ప్రకృతి వ్యవసాయానికి సాంకేతికత కూడా అనుసంధానం చేయడం వల్ల మరింత మంచి ఫలితాలు సాధించవచ్చునని వీరి నమ్మకం. అందువల్ల ఆయన క్షేత్రంలో మినీ వాతావరణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడు వర్షం కురుస్తుంది.. వాతావరణంలో తేమ ఎలా ఉంది అన్న విషయాలపై ముందస్తు సమాచారం ఉంటే, తద్వారా సాగుకు సమాయత్తం కావచ్చని ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. సౌర శక్తితో పక్షులు వంటివి రాకుండా ఆలారం ఏర్పాటుచేశారు. మార్కెటింగ్‌లో కూడా అంతర్జాల సేవలను వినియోగించుకుంటున్నారు. సంకల్పం గట్టిదైతే ఎంతటి పనైనా సాధించవచ్చునని ఆదర్శ రైతు సుజాత నిరూపిస్తున్నారు.

ఇదీ చదవండి: తాగి పడేసిన బోండాలతో సేంద్రియ ఎరువు.. ఎక్కడో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.