ETV Bharat / state

'నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం.. ఎటువంటి నష్టం జరగలేదు'

author img

By

Published : Feb 4, 2023, 11:51 AM IST

fire incident in telangana new secretariat: ఈ నెల 17న హైదరాబాద్​లో ప్రతిష్టాత్మకంగా నిర్మిచిన నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీనిపై ప్రభుత్వం స్పందించి ఏమి నష్టం జరగలేదని స్పష్టం చేసింది.

Telangana New Secretariat
తెలంగాణ నూతన సచివాలయం

fire incident in telangana new secretariat: సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం చాలా చిన్నపాటిదేనని, లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లోని స్టోర్ రూం మినహా ఎక్కడా నష్టం జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ప్రారంభ ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో సచివాలయ పనుల వేగవంతంపై సర్కార్ దృష్టి సారించింది. రహదార్లు, భవనాల శాఖా మంత్రి ప్రశాంత్ రెడ్డి నిన్న రాత్రి పనుల పురోగతిని పరిశీలించారు. రాత్రి పది గంటల వరకు సచివాలయంలో కలియతిరిగిన మంత్రి తుది దశ పనులను ఆరా తీశారు. మిగిలిన పనుల వేగవంతం, నిర్దేశిత గడువులోగా పూర్తి పై చర్చించారు. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్​లో జరిగిన అగ్నిప్రమాదం, ఆ ప్రభావంపై కూడా ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూం మినహా మిగతా ప్రాంతాల్లో ఎక్కడా పెద్దగా నష్టం జరగలేదని చెప్పినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని మంత్రి ఇంజనీర్లు, గుత్తేదార్లకు స్పష్టం చేశారు. పనుల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఏం జరిగిందంటే: నిర్మాణంలో ఉన్న నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్​లో ఉన్న స్టోర్ రూంలో రెండో తేది అర్దరాత్రి 2గంటల సమయంలో మంటలను గమనించిన సిబ్బంది.. ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటల తీవ్రత పెరగడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కానీ ఆ లోపే మంటలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకు చేరుకున్నాయి.

స్టోర్ రూంలో ఉన్న ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు మంటల్లో కాలిపోయి దట్టమైన పొగ వ్యాపించింది. అగ్నిమాపక సిబ్బంది 2 గంటల్లో.. 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు మంటలను పూర్తిగా ఆర్పేశారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సచివాలయం భద్రత చూసే ఎస్పీఎఫ్, రహదారులు భవనాల శాఖాధికారులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం పెద్దగా నష్టమేమి లేదని.. ఇంటీరియర్ డెకరేషన్ కు ఉపయోగించే ఫ్లైవుడ్, మరికొంత సామాగ్రి మాత్రం కాలిపోయినట్లు చెబుతున్నారు. సచివాలయం చుట్టూ భారీగా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. మింట్ కౌంపౌండ్ వైపు సైతం పోలీసుల బందోబస్తు చేపట్టారు.

సచివాలయం లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. స్టోర్ రూంలోని ప్లాస్టిక్ సామాగ్రి నుంచి మంటలు వ్యాపించాయని చెప్పారు. మంటల దాటికి పొగ ఎక్కువగా వచ్చిందని వివరించారు. స్టోర్ రూంలో కొంత మేర మినహా ఎక్కడా నష్టం జరగలేదని ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.