ETV Bharat / state

Nehru Zoo Park Entry Fee: నెహ్రూ జూ పార్క్ ఎంట్రీ ఫీజు పెంపు

author img

By

Published : May 2, 2023, 6:53 PM IST

Nehru Zoo Park Entry Fee Hike: నెహ్రూ జంతు ప్రదర్శన శాల ప్రవేశ రుసుము పెరిగింది. పెరిగిన యాజమాన్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని నెహ్రూ జూపార్క్ ప్రవేశ రుసుము పెంచేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయంతో ప్రవేశ ధరలు ఇలా మారనున్నాయి.

nehru zoo park entry fee in hyderabad
60 ఏళ్లు పూర్తి చేసుకున్న నెహ్రూ జూ పార్క్.. పెరిగిన ప్రవేశ రుసుము

nehru zoo park entry fee in hyderabad: హైదరాబాద్​లోని నెహ్రూ జంతు ప్రదర్శన శాల ప్రవేశ రుసుము పెరిగింది. ఇకపై పెద్దలకు మామూలు రోజుల్లో రూ.70, సెలవు రోజుల్లో రూ.80, పిల్లలకు మామూలు రోజుల్లో రూ.45, సెలవు రోజుల్లో రూ.55 రుసుముగా నిర్ణయించారు. పెరిగిన యాజమాన్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని నెహ్రూ జూపార్క్ ప్రవేశ రుసుము పెంచేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన జంతు ప్రదర్శన శాలలు, పార్కుల అథారిటీ (జపాట్) పాలక మండలి సమావేశం హైదరాబాద్ అరణ్య భవన్​లో జరిగింది.

60 ఏళ్లు పూర్తి చేసుకున్న నెహ్రూ జూ పార్క్: 60 ఏళ్లు పూర్తి చేసుకున్న నెహ్రూ జూ పార్క్​ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెహ్రూ జూ పార్కులో సౌకర్యాలు మెరుగుపర్చాలని, వన్య ప్రాణుల ఆవాసాలను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దటం, ఆకర్షణీయమైన జంతువులను దిగుమతి చేసుకోవటం.. పులి, సింహం ఎన్​క్లోజర్లను గ్లాస్ పార్టీషన్​తో అతి దగ్గరి నుంచి చూసే ఏర్పాటు, సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు, పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు.

మరిన్ని సౌకర్యాలు: నెహ్రూ జూపార్క్​లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, మరింత వృద్ధికి అవకాశాలపై క్యూరేటర్ ప్రశాంత్ పాటిల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నిపుణుల సూచనలతో వీలైనంత త్వరగా అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జంతువులను దత్తత తీసుకుని, నిర్వహణ వ్యయాన్ని విరాళంగా ఇచ్చే సదుపాయాన్ని మరింతగా విస్తరించాలని పాలక మండలి తీర్మానించింది. మీరాలం ట్యాంక్ నుంచి జూ పార్క్​లోకి వచ్చే నీటిని నియంత్రించటం, మిషన్ భగీరథ ద్వారా జంతువులకు తాగునీటి వసతిపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించాలని నిర్ణయించారు. నెహ్రూ జూపార్క్​తో పాటు రాష్ట్రంలో ఉన్న మిగతా జంతు ప్రదర్శన శాలలను మరింత అభివృద్ధి చేయాలని, పర్యావరణహిత కార్యక్రమాలతో సందర్శకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు.

పర్యావరణహితంగా: హనుమకొండలోని కాకతీయ జూ పార్క్, మహబూబ్​నగర్​లోని పిల్లలమర్రి మినీ జూపార్క్, కరీంనగర్​లోని లోయర్ మానేరు డీర్ పార్క్, పాల్వంచలోని కిన్నెరసాని డీర్ పార్క్​లో జంతు సంరక్షణ- ప్రదర్శన చర్యలు, కేబీఆర్, మృగవని, మహవీర్ హరిణ వనస్థలి, ఇతర అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో సౌకర్యాల కల్పనపై ప్రధానంగా సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ అనుమతితో హైదరాబాద్​తో పాటు అన్ని జూపార్క్​లు, నేషనల్ పార్క్​లను, అర్బన్ ఫారెస్ట్ పార్క్​లను పర్యావరణ హితంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.