ETV Bharat / state

NEET EXAM: 'నీట్​ 2021' ఎగ్జామ్ స్టార్ట్.. ఈ రూల్స్​ మస్ట్!

author img

By

Published : Sep 12, 2021, 2:00 PM IST

వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(NEET 2021) రాష్ట్రంలో ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీక్ష కోసం కేటాయించిన నగరాలు, పట్టణాల్లో కరోనా నిబంధనల నడుమ పరీక్ష కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు జరుగుతుంది. ఈ పరీక్ష కోసం తెలుగు రాష్ట్రాల్లో లక్ష మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

NEET 2021, neet in telangana
నీట్ ప్రారంభం, తెలంగాణలో నీట్

వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(Neet 2021) రాష్ట్రంలో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కేటాయించిన నగరాలు, పట్టణాల్లో పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమైన పరీక్ష కోసం... విద్యార్థులు నిర్దేశించిన సమయానికన్నా ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని జాతీయ పరీక్షల సంస్థ ముందే స్పష్టం చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు జరుగుతుంది. కరోనా పరిస్థితుల్లో మాస్కులు ఉన్న వారినే కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. ఫొటో లేకుండా వచ్చిన విద్యార్థులకు... అక్కడే ఫొటో గ్రాఫర్‌ను ఏర్పాటు చేసి... ఫొటో తీసి లోపలికి అనుమతిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో లక్ష మందికి పైగా..

ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది నీట్​కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో తెలంగాణ నుంచి దాదాపు 55వేలు, ఏపీ నుంచి సుమారు 50వేల మంది ఉన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 202 నగరాలు, పట్టణాల్లో 3,842 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, హయత్ నగర్ పట్టణాల్లో 112... ఆంధ్రప్రదేశ్​లో కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరి పట్టణాల్లో 151 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ వెల్లడించింది. ఆంగ్లంతో పాటు తెలుగు, హిందీ వంటి 13 భాషల్లో పరీక్ష ఉంటుంది.

హనుమకొండలో ప్రశాంతంగా..

నీట్ పరీక్ష హనుమకొండ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ప్రారంభమైంది. నీట్ పరీక్షకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా... 5,189 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేయడం వల్ల గంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.

ఎన్​టీఏ నిబంధనలు

నీట్ పరీక్షకు పలు నిబంధనలు, ఆంక్షలను ఎన్​టీఏ ముందుగానే ప్రకటించింది. నిబంధనలు బేఖాతరు చేస్తే మూడేళ్ల వరకు డిబార్ చేయనున్నట్లు వెల్లడించింది. అడ్మిట్ కార్డుతో పాటు పాస్ పోర్టు సైజు ఫొటో, ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. అభ్యర్థులు కచ్చితంగా మాస్క్​ ధరించాలని స్పష్టం చేసింది. చిన్న శానిటైజర్ తీసుకెళ్లవచ్చు. మంచినీళ్ల బాటిల్, ఆహారపదార్థాలను అనుమతించలేదు. అయితే అనారోగ్యంతో ఉన్నట్లు ఆధారాలు సమర్పిస్తే మందులు, పారదర్శకమైన నీటి సీసాను అనుమతిస్తామని చెప్పింది. ఉంగరాలు, బ్రాస్​లెట్లు, చెవి పోగులు, ముక్కు పుడకలు, గొలుసులు, నెక్లెస్​లు, హెయిర్ పిన్, హెయిర్ బ్యాండ్, తాయత్తులు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బూట్లు, పొడవు చేతుల చొక్కాలు, చేతి గడియారాలు, పెన్ను, పెన్సిల్, రబ్బరు, కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ఎన్​టీఏ స్పష్టం చేసింది. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నును కేంద్రంలోనే ఇస్తారు. పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రం నుంచి బయటకు వెళ్లనీయరు.

ఈ ఏడాది 200 ప్రశ్నలు

నీట్ పరీక్షలో ఈ ఏడాది 200 ప్రశ్నలు ఉంటాయి. అయితే 180 ప్రశ్నలకే సమాధానం ఇస్తే సరిపోతుంది. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి కాబట్టి.. కచ్చితంగా తెలిసిన సమాధానాలే రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. సమాన మార్కులు వస్తే నెగెటివ్ మార్కులు తక్కువ ఉన్నవారికే ర్యాంకులో ప్రాధాన్యం ఇవ్వాలని ఈ ఏడాది ఎన్​టీఏ నిర్ణయించింది. నీట్ ర్యాంకు ద్వారా దేశవ్యాప్తంగా 83 వేల 75 ఎంబీబీఎస్, 26,949 బీడీఎస్, 52,720 ఆయుష్, 525 బీవీఎస్, ఏహెచ్, 1899 ఎయిమ్స్, 249 జిప్​మర్ సీట్లను భర్తీ చేయనున్నారు.

ఇదీ చదవండి: Ganesh Immersion: 'గణేశ్ విగ్రహాల నిమజ్జనం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.