ETV Bharat / state

మూడు నెలల్లో కుక్కలు, కోతుల దాడులను తగ్గిస్తాం: తలసాని

author img

By

Published : Feb 23, 2023, 3:27 PM IST

Updated : Feb 23, 2023, 4:31 PM IST

Talasani Review on Dogs Attack in Telangana: మూడు నెలల్లో కుక్కలు, కోతుల దాడులను తగ్గిస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ స్పష్టంచేశారు. హైదరాబాద్​​లో వీధి కుక్కల దాడిలో... చిన్నారి తీవ్రంగా గాయపడి మరణించడంతో మంత్రి తలసాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నగరంలో వీధి కుక్కలు, కోతుల సమస్య పరిష్కారంపై ప్రత్యేక సమావేశంలో నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Talasani
Talasani

Talasani Review on Dogs Attack in Telangana: రాష్ట్రంలో వీధి కుక్కల విషయంలో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని‌ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పశు భవన్​లో వీధి కుక్కల బెడదపై హోం శాఖ మంత్రి మహమూద్ అలీతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో... ప్రత్యేకించి హైదరాబాద్​ నగరంలో వీధి కుక్కలు, కోతుల సమస్య, నివారణ చర్యలపై విస్తృతంగా చర్చించారు. సాధారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై పురపాలక, పశుసంవర్ధక శాఖల అధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.

మూగజీవాలైన వీధి కుక్కల బెడద విషయంలో ప్రభుత్వం, పురపాలక శాఖ, పశుసంవర్ధక శాఖ, జీహెచ్ఎంసీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అంబర్​పేటలో నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడి వల్ల చనిపోయిన నేపథ్యంలో ఆ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో విపక్షాలు వ్యతిరేకత కోణంలో చూస్తూ దుష్ప్రచారం చేస్తున్నాయని తలసాని ధ్వజమెత్తారు. జంట నగరాల్లో వీధి కుక్కలు, కోతుల బెడద నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవడమే‌ కాకుండా ఆధునిక టెక్నాలజీ కూడా అందిపుచ్చుకుంటామని స్పష్టం చేశారు.

మూడు నెలల్లో కుక్కలు, కోతుల దాడులను తగ్గిస్తాం: తలసాని

'రోడ్లపై ఇష్టం వచ్చినట్లు మాంసం వేయవద్దు. అవసరమైతే రాత్రి సమయాల్లో మున్సిపల్‌ సిబ్బంది డ్యూటీ చేస్తారు. మూడు నెలల్లో కుక్కలు, కోతుల దాడులను తగ్గిస్తాం. ఎవరైనా సూచనలు చేస్తే స్వీకరిస్తాం. కుక్కల దాడిలో మరణించిన బాలుడి కుటుంబాన్ని ఆదుకుంటాం.'-తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్థక శాఖ మంత్రి

నీటి లభ్యత పెంచుతున్న దృష్ట్యా ఆహారం విషయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ప్రత్యేకించి మాంసం వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ పడేయవద్దని సూచించారు. ఇక నుంచి నగరంలో మాంసం దుకాణాలు, పశు వధ కేంద్రాల నిర్వహణపై స్పెషల్ డ్రైవ్ చేపడతామని, ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మూసీ నది పరివాహక ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో కూడా మాంసం వ్యర్థాలు నిర్వహణ పట్ల జాగ్రత్తలు తప్పనిసరి అని మంత్రి తలసాని సూచించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ విజయలక్ష్మి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, సంచాలకులు డాక్టర్ రామచందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, పశుసంవర్థక శాఖ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 23, 2023, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.