ETV Bharat / state

రైతన్నల పోరాటానికి మద్దతుగా నిలిచిన మంత్రులు, తెరాస శ్రేణులు

author img

By

Published : Dec 8, 2020, 4:38 PM IST

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంత్రులు భారత్‌ బంద్‌లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తుండగా.. కేంద్రం మాత్రం వాళ్ల నడ్డివిరిచే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. సన్నబియ్యానికి బోనస్‌ ఇచ్చే విషయంలోనూ మోకాలడ్డుతున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ministers-participated-in-bharath-bundh-in-telangana
రైతన్నల పోరాటానికి మద్దతుగా నిలిచిన మంత్రులు, తెరాస శ్రేణులు

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన బంద్‌కు తెరాస మద్దతు పలికింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు వివిధ ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్‌ ఆల్ఫా హోటల్‌ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెరాస శ్రేణులతో కలిసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మేడ్చల్‌లోని జాతీయ రహదారిపై మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు బైఠాయించాయి. మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెరాస కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాఠోడ్‌, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ రైతులు, తెరాస కార్యకర్తలతో కలిసి... ర్యాలీ నిర్వహించారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు.

రహదారుల దిగ్బంధం

నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికార పార్టీ కార్యకర్తలతో కలిసి ద్విచక్రవాహన ప్రదర్శన నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్‌లో చేపట్టిన నిరసనలో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సూర్యాపేటలో హైదరాబాద్‌-విజయవాడ రహదారిని తెరాస శ్రేణులతో కలిపి మంత్రి జగదీశ్‌రెడ్డి దిగ్బంధించారు. కామారెడ్డి జిల్లా టేక్రియాల్ చౌరస్తాలో బంద్‌కు మద్దతుగా చేపట్టిన ఆందోళనలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బి.బి.పాటిల్, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, సురేందర్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ వద్ద రైతులతో కలిసి మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆందోళనకు దిగారు. రైతులను కార్పొరేట్లకు బానిసలను చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందని మంత్రులు ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

వెంటనే రద్దు చేయాలి..

కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు సంఘీభావంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్టీసీ బస్టాడ్ ఎదుట ఆందోళన చేపట్టారు. వ్యవసాయ చట్టం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, కడియం శ్రీహరి, రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి వరంగల్‌ మడికొండలో భారత్‌ బంద్‌లో పాల్పంచుకున్నారు. కేంద్రానికి సెగ తగిలే వరకు నిరసన కొనసాగిస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. భారత్‌ బంద్‌లో భాగంగా కరీంనగర్‌లో మంత్రి గంగుల ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు ఆందోళనకు దిగాయి.

పోరాడినప్పటికీ..

పార్లమెంట్‌ లోపలా.. వెలుపలా.. పోరాడినప్పటికీ వ్యవసాయ చట్టాలకు కేంద్రం ఆమోదం తెలిపిందని తెరాస లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వర్‌రావు ఆరోపించారు. అన్నదాతల వెన్నువిరిచే చట్టాలను రద్దు చేయాలంటూ మంత్రి పువ్వాడ అజయ్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఖమ్మంలో ధర్నాకు దిగారు. దేశానికి అన్నం పెట్టే రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అన్నదాతలకు భరోసా

భారత్‌ బంద్‌లో భాగంగా తెరాస శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. అన్నదాతలకు పూర్తి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చాయి.

ఇదీ చూడండి: రైతన్నకు మద్దతుగా నిలిచిన రాష్ట్రం.. భారత్​ బంద్​ సంపూర్ణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.